Sunday, June 21, 2009

ఆర్షధర్మము - మొదటి భాగము

1. నిద్ర మేల్కొనుట
“బ్రహ్మీ ముహూర్తే ఉత్థాయ”, “బ్రహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్య” అంటుంది ధర్మశాస్త్రం. బ్రహ్మ మూహూర్తం అనగా ఉదయం సూర్యోదయం అక్షాంశ రేఖను బట్టి ఏ ప్రదేశములో ఎన్ని గంటలకు జరుగుతుందో ఖచ్చితంగా తెలిసికొని దానికి ఒక మూహూర్తం అనగా రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషముల ముందు కాలం ఆసురీ ముహూర్తం, దానికి 48 నిమిషములు ముందు కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయములో భగవచ్చింతన జేయువారిని దేవతలు ప్రీతిగా ఆశీర్వదిస్తారని, మానవ మేథస్సునకు బ్రహ్మ సంకేతములు అందు కాలము ఆ ముహూర్తమనియు, ఆ సమయమున నిద్రించువారి పూర్వ జన్మల మరియు ఈ జన్మన ఆర్జించిన పుణ్యము కూడ క్షయమగుననియు వేద ప్రమాణము. బ్రహ్మ మూహూర్తమున ధ్యానం సత్ఫల దాయకము.

2. నిద్రనుండి మేల్కొని కనులు తెరుస్తూనే తమ అరచేతులను చూచుకొనుచు “కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీం తాం ప్రభాతే కర దర్శనం” అనే శ్లోకాన్ని మననం చేసికొని ముగ్గురు దేవేరిలను కుడి అరచేతిలో ఆవాహన జేసికొని కనులకద్దకొనవలెను. దీనివలన, మానవ సహజముగా కష్టం కలిగినపుడు ఈ రోజు లేస్తూనే ఎవరి ముఖం చూచామో యిలాజరిగినదని పరనింద జేసి పాపం మూటగట్టుకొనుట నివారింప వచ్చును.

3. భూమాత, భూదేవియని, భూమిని పంచ భూతములలోనొకటిగా ఆరాధించుట హైందవ సంస్కృతి. గనుక ప్రతి దినం “సముద్ర వసనే దేవి పర్వతస్థనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాద స్వర్శం క్షమస్వమే” యను శ్లోకాన్ని మననం చేసుకొని భూమికి నమస్కరించిన తర్వాత పాదాలు భూమిపై మోపాలి. ప్రతి యుగాంతం తర్వాత జలప్రళయం నుండి మరల భూమి ఉద్భవించి, దానిపై జీవరాసులు సృష్టింపబడి, ఆ భూమి నుండి వచ్చే ఆహారం ద్వారానే జీవులు బ్రతుకుచున్నప్పుడు, అలాంటి భూమిపై నడుస్తూ, ఉమ్ముతూ, మలమూత్ర విసర్జన చేస్తున్నాము. భూమాత కోపిస్తే భూకంపము, క్షామము ద్వారా వినాశము తథ్యము కనుక మన అపరాధములను క్షమింపవేడి నమస్కరించి భూమిపై కాళ్ళు పెట్ట వలెను.

4. పండ్లు తోముట, మలమూత్ర విసర్జన :
సూర్య చంద్ర గమనదిశలగు తూర్పు, పజమరలకు ఎదురుగా చేయరాదు. దంతధావనము ద్వారా, నోటిలో నురగలోనుండు సూక్ష్మ క్రిములు వేరుచోట్ల ప్రబలకుండునట్లు అటునిటు తిరుగకుండ ఒకేచోట చేయుట ఆరోగ్యదాయకము. మూత్ర విసర్జన నిలుచొని చేసినందున కొన్ని సమయములలో తల తిరుగుట, స్పృహతప్పుట ప్రత్యక్ష ప్రమాణములుగా తెలియుచున్నవి. అతి త్వరగా మూత్ర విసర్జన చేయవలసివచ్చినపుడు, కనులు మూసుకొని కూర్చొని చేయుట క్షేమమని డాక్టర్లు కూడ నిర్ధారించిరి.

5. స్నానము : చన్నీటి స్నానము ఉత్తమము. మొదట తలపైనుండి ఆరంభిచవలెను. క్రొత్తగా చన్నీటి స్నానం చేయుట వలన జలుబు చేయు ప్రమాదం కలదు కాని విడువకుండ అలవాటు చేసికొనినయడల ప్రశాంతత, మనోనిగ్రహం, ఏకాగ్రత, కంటికీ, మెదడుకు చలువజేసి కోపతాపాలనుండి ఉపశమనము పెద్దల అనుభవము. అట్టి ముఖ్యోద్దేశముతో హైందవ సంస్కృతి కార్తీక, మాఘస్నానాలని, దీక్షల పేరుతో మండలము రోజులు అనగా 48 రోజులు మూడువేళలా చన్నీటి తలస్నానం ఆదేశించిరి.

వేడినీటితో చేయునపుడు ముందుగా కాళ్లు తడుపుకొని ఆ తరువాత శరీరం తడుపకోవలెను.

శ్లో ॥ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా, సింధు, కావేరి జలే ऽ స్మిన్ సన్నిధిం కురు ॥

శ్లో ॥ గంగా గంగేతి యో బ్రూయంత్ యోజనానే శతైరపి
ముచ్యతే సర్వపాపే భ్యో విష్ణులోకం సగచ్ఛతి ॥

పవిత్ర నదులను స్మరించి మనము స్నానము చేయు నీటియందు ఆవాహన చేయుట వలన, గంగా గంగా యనుచు పుణ్య గంగానదీ స్నానానుభూతి పొందుట ద్వారా మానవులు పాప రహితులై విష్ణులోకమును బొందుదురని ధర్మశాస్త్రము.

స్నానం చేయునపుడు పురుషులు దిగంబరముగా మొలపై వస్త్రము లేకుండగను, స్త్రీలు వెంట్రుకలు విరియబోసుకొని నిలుచుండియూ స్నానము చేయరాదు. ఆ సమయమున భూత, ప్రేత, పిశాచములు ఆవహించు ప్రమాదము గలదు.

ప్రాతఃకాల స్నాన సమయము
తెల్లవారు ఝామున గం. 4 – 5 మధ్య ఋషి స్నానము. మహర్షులాసమయమున స్నానం చేయుదురనుటకు నిదర్శనం రామాయణమున అహల్యా శాప వృత్తాంతము.
గం. 5 – 6 మధ్య దైవ స్నానం. దేవాలయములలో దేవతా విగ్రహములకు ఆ సమయమున అభిషేకము నిర్వహింతురు.
గం. 6 – 7 మధ్య మానవ స్నానం. మానవులు కనీసం ఈ సమయంలోనయినా స్నానం చేయగలిగితే, స్నానానంతరం సూర్యునకు నమస్కారం చేసి ఆరోగ్యముగా నుండుటకు వీలగును. బ్రహ్మమూహూర్తంముందుగనే స్నానం చేసి కూర్యోదయం వరకు జప, తపాది అనుష్ఠానములు చేయువారు నిష్ఠాగరిష్ఠులగు, సనాతన సదాచార సంపన్నులగుదురు.
గం. 7 తరువాత రాక్షస స్నానం. నింద్యము.
స్నానం తరువాత ముందుగా ముఖము, తరువాత వక్షస్థలము, తరువాత శిరస్సు, ఆపై మిగిలిన అంగములు తుడుచుకొనవలెను. ఇట్లు చేయుట వైద్య శాస్త్రం ద్వారా సైనస్, నిమోనియా, జలుబు రాకుండగా కాపాడు కొనుటయే.

మానవ నిత్యాచరణ ధర్మములన్నియూ ఋషి ప్రోక్తములగు సాధారణ, శరీర వైద్య శాస్త్రమే.

పురుషులకు అభ్యంగన స్నానవారదోషములు:
ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం - కాంతి, మనోల్లాసము.
మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం - లక్ష్మీ కటాక్షము.
గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం - భోగము

గమనిక : పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు.

స్త్రీలకు మంగళ, గురు, శుక్రవారములు శుభములు.

సముద్ర స్నానము: ముందుగా మంచినీటి స్నానం చేసి వెళ్ళి సముద్ర స్నానము చేసి వచ్చిన వెంటనే మరల మంచినీటి స్నానం చేయవలయును. ఒకే సంవత్సరములో క్రమంగా ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమ దినములు సముద్రస్నానం మోక్షప్రదమగు వ్రతము. సముద్ర స్నానము ఒక ఘడియ (24 నిముషముల) కు పైగా చేసిన యడల మగవారిలో పుంసత్వము, ఆడవారిలో గర్భధారణ శక్తి తగ్గునని లోకోక్తి.

6. వస్త్ర ధారణ
స్నానానంతరం ఉతికి ఆరవేసిన పొడి వస్త్రములు ధరించి మూఖాలంకరణ చేసికొని దైవ ప్రార్థన చేయవలయును. తడి బట్టలతో శుభకార్యములు దైవ కార్యములు చేయరాదు. సంప్రదాయదుస్తులు ధరించి, అధునాతన అనుకరణలు విసర్జించుట సనాతన ధర్మము. సంప్రదాయ వస్త్రధారణ వలన తమ మనస్సు పవిత్రమై, ఇతరులను ఆకర్షించు పాపము నుండి విముక్తులగుదురు.

7. ముఖాలంకరణ
భస్మధారణ: హిందువులందరునూ విధిగా భస్మ ధారణ చేయవలయునని శివపురాణము వక్కాణించినది. పురుషులు మాత్రమేగాక స్త్రీలును త్రిపుండ్ర ధారణ చేయుట తమిళ సాంప్రదాయము.

శ్లో॥ శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనమ్॥
శ్లో॥ వినాభస్మ త్రిపుండ్రేన, వినా రుద్రాక్షమాలయా
పూజితో పి మహాదేవి నస్యాత్ తస్య ఫలం లభేత్॥
శ్లో॥ తత్సర్వం ఫలితం నాస్తి లలాటే తిలకం వినా
లలాటే సతతం దేవ్యాశ్రయ సహవిరాజితం
చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం॥
శ్లో॥ స్నానం, దానం, జపో, హోమం, సంధ్యా స్వాధ్యాయ కర్మసు
ఊర్ధ్వపుండ్ర విహీనశ్చ తత్సర్వం నిష్పలం భవేత్॥
శ్లో॥ శ్రాద్ధే, యజ్ఞే, జపో, హోమే, వైశ్వదేవే, సురార్చనే
ధృత త్రిపుండ్ర పూతాత్మా మృత్యుంజయతి మానవః॥

భస్మధారణ లేని ముఖమును, శివాలయము లేని గ్రామమును, శివార్చన లేని గృహమును, ఛీ, ఛీ, యనమని శివపురాణము. తాత్పర్యమేమనగా, హిందువులందరు తమ మతానుసారము విభూది, తిలకము, త్రిచూర్ణము, చందనము, మరేదయినను నుదుట ధరించి, ఆజ్ఞా చక్ర స్థానమగు భృకుటియందు పసుపుతో తయారు చేసిన కుంకుమ ధరించి, మెడలో రుద్రాక్ష మాలగాని, మరే మాలనయిననూ ధరించి దైవ ప్రార్ధన చేయుట వలన, పవిత్రతయే గాక దృష్టి దోష నివారణ కూడ జరుగును. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఒంటినిండా విభూది పూసుకొని త్రిపుండ్రములు ధరించి, పాశుపత దీక్షతో పంచాక్షరి జపించినట్లు పురాణముల గాధలు. నేటి కాలపు ముఖాలంకరణగా రంగుల రేఖలు, రంగుల బిళ్లలు ధరించుట ఆత్మహత్యా సదృశము. దేవతా విగ్రహములకు, పటములకు, మగవారు కూడ స్టిక్కర్లు ధరించుట విచారకరము.

8. మాలాధారణ
వక్షస్థలమున ధరించుటకును, జపమునకు బొటనవ్రేలు, మధ్యవ్రేలు, అనామికలతో మాలలోని పూసలను ముందుకు జరుపుటకును, వివిధ మాలలలో తంత్రసార శాస్త్రానుసారము తులసిమాల, శంఖమాల, పవడముల మాల, స్ఫటిక మాల, ముత్యాలమాల, పద్మాక్షమాల, సువర్ణమాల, కుశగ్రంధి మాలలు ఒకదానికన్న ఒకటి వరుసగా పది పది రెట్లు అధికఫలమొసంగును. ఇక రుద్రాక్షమాల అనంత ఫలదాయకము.

రుద్రాక్షమాలలము గురించి ప్రస్తుత కాలమున వారపత్రికలు, దృశ్యమాధ్యమముల (T.V.) ద్వారా వాణిజ్యప్రచారము ఎక్కువగా జరుగుచున్నది. కాని రుద్రాక్షలలో ఏకముఖి నుండి 14 ముఖములవరకు గలవాని విశిష్ఠత ప్రత్యేక మంత్ర బలము వలన సిద్ధించునేకాని, కేవలము ధరించినంత మాత్రమున సిద్ధించదని వేదవాక్యము.

9. ఆసనము
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయం 11వ శ్లోకంలో ధ్యానము, పూజలకు
శ్లో॥ శుచౌదేశే ప్రతిష్ఠాప్య స్థిరమానసమాత్మనః
నాత్యుచ్ఛితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥
అంటారు. మనసు భగవంతుని ఆరాధనలో లగ్నమగుటకు ఆసన ప్రభావం కూడ దోహదకారి. ఈ నాటి పరిస్థితులను బట్టి జింక చర్మంగాని, పులి చర్మంగాని లభించకపోయినా, సరాసరి నేలపై కూర్చొనకుండ పీటవేసికొని దానిపై దర్భాసనం, దానిపై చిత్రాసనం దొరకని యడల మెత్తని తెల్లని వస్త్రం వేసికొని కూర్చొనవలెను.
దర్భాసనం - పుష్ఠిని, కంబళి - దుఃఖవిమోజనమును, చిత్రాసనం - కామ్యసిద్ధిని, జింకచర్మం - జ్ఞానమును, పులిచర్మం - మోక్షమును, తెల్లని వస్త్రం - శాంతిని గల్గించును.
వెదురు - దరిద్రం, రాయి - వ్యాధి, నేల – దుఃఖము, కొయ్య – దౌర్భాగ్యము, గడ్డి - యశోహాని, చిగురుటాకులు - చిత్రభ్రమణము గాన వీనిని ఉపయోగింపరాదు.

10. ఇష్టదేవతా ప్రార్థన
84 లక్షల జీవరాసులను సృష్ఠించిన బ్రహ్మదేవునకు తనను తెలుసుకొను జీవిలేదను విచారముతో మానవులకు బుద్ధియను ప్రత్యేక గుణమును ప్రసాదించి జీవిత పరమావధిని తెలిసికొనునట్లు సృష్ఠించెను. కనుక ప్రతి మానవునకు ఇష్టదేవతా ప్రార్ధన ముఖ్యము. కోరికలతోనో, లేక కష్టములనుండి విముక్తి కొఱకో, లేక తప్పులకు క్షమాపణగానో గాక, మానవ జన్మనిచ్చినందులకు కృతజ్ఞతగా జన్మరాహిత్యము కొరకు నిత్యమూ ఇష్టదేవతా ప్రార్థన చేయుట విద్యుక్త ధర్మము. శుచిగా తూర్పుముఖముగా కూర్చొని దైవప్రార్థన చేయవలెను.

Saturday, June 6, 2009

ఆర్షధర్మము --- విన్నపము

విన్నపము

పూర్వజన్మల పుణ్య ఫలముగా భగవద్దత్తమయిన మానవజన్మను సఫలంచేసికొని, పతనం కాకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములను పొంది, పరమాత్మ కృపకు పాత్రులమగుటకు సనాతన ఆర్ష ధర్మానువర్తనమే పరమావధి. “ధర్మో రక్షతి రక్షితః" ధర్మ బద్ధులమయి జీవించి ధర్మముచే నుద్ధరింపబడవలసి యున్నది.

వేదాంతపరంగా మానవుడు త్రిదోషాలను ప్రయత్నపూర్వకముగా నిర్మూలించుకొని భగవత్కృపాపాత్రులు గావలసియున్నది. అవి మల, విక్షేపణ, ఆవరణ దోషాలు. మలదోషం శౌచం ద్వారాను, విక్షేపదోషం సద్గ్రంథ పఠన, శ్రవణముల ద్వారాను, ఆవరణ దోషం జప, తపాద్యనుష్ఠానముల ద్వారా నిర్మూలనమగునని శాస్త్ర ప్రమాణముగాన మొదటి మెట్టు శౌచము. నవసమాజములో మానవులు శరీర బాహ్య శౌచము ద్వారా ప్రజలను ఆకట్టుకొనగల్గుచున్నారు గాని, అంతః శౌచం తెలియక, పాటించలేనందు వలన భగవత్కృపకు పాత్రులుగాలేక పోవుచున్నారు.

గురు, బుధ, పండిత, ఆచార్యవర్యులు, ధర్మ ప్రచారముకన్న భక్తి ప్రచారమునకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మనోనైర్మల్యం లేని భక్తితో ఏకాగ్రత సాధించలేమనునది సత్యము. భారతీయ మానవులలో నరనరములందు రక్తంలోనే భక్తి ఇమిడియుంటుంది. కాని ధర్మాచరణ లేని భక్తి ఫలితం అత్యల్పము. జన్మాంతర సుకృతం వలన చరాచర జీవరాశిలో నాల్గవది, ఉత్తమమగు మానవ జన్మను, సనాతన ఆర్షధర్మ ఆచరణద్వారా సార్ధకం చేసికొనాలి.

మానవలక్షణాలున్నంతమాత్రాన మానవులముగాము. అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానముల తారతమ్యములు తెలిసికొని సద్ధర్మాచరణ గావించాలి. వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణములన్నియూ మానవ అభ్యుదయానికీ, భక్తి, జ్ఞాన, వైరాగ్య సాధనకూ మూలము స్వధర్మాచరణయేనని ప్రబోధిస్తున్నవి.

కనీసము మన నిత్యకృత్యములలో ఆచరించగల్గిన ధర్మాలను తెలిసికొని ఇంతవరకు తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని మానవార్హతబొంది సద్గతిని బొందపలసియున్నది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి పాకులాడినట్లు, ఇంట గెలవకయే రచ్చ గెలవాలనే తాపత్రయంలా, ధర్మాచరణలేని మానవుల పూజలూ, పుస్కారములు, పురాణ భాష్య శ్రవణములు, తీర్థయాత్రలు, సత్సంగములు అత్యల్ప ఫలదాయకము మాత్రమే.

మానవునకసాధ్యములేదు. మనసుంటే మార్గంముంటుంది. మాట్లాడే ప్రతిమాట భావాన్ని మనసుకు పట్టించుకుంటే చాలు. “భవానీ భావనాగమ్యా" మనం రోజూ నిద్రలేచినది మొదలు మరల పరుండేవరకు ఆచరించగలిగే కొన్ని ధర్మాలను తెలిసికొనవలయునను కుతూహలంతో, నా అల్ప పరిజ్ఞానానికందినంత సేకరించి తోటివారికందించి ఉడుతాభక్తిగా మానవసేవ రూపంలో మాధవసేవకు ప్రయత్నించాను.

ప్రయత్నం నాది, ఫలితం చదువరులది.


బుధజన విధేయుడు
బాలనరస అప్పేశ్వర శాస్త్రి
కాశీవాసి

ఆర్షధర్మంతో మళ్లీ మీముందుకు వస్తున్నాం

ఇంతవరకూ మేము కాశీ కేదారం పేరుతో కాశీ (వారణాశి) లోని కేదార ఖండముయొక్క మహాత్మ్యమును మీముందు ఉంచినాము. ఈ సంకలనము మొత్తాన్ని ప.డి.యఫ్ రూపంలోకి మార్చాము. కావలసినవారు మాకు తెలిపిన మేము ఫైలు పంపగలము. ప్రస్తుతము దీనిని పండిత పరిష్కృతం చేయించే దిశలో ఉన్నాము. అది అయిన తరువాత అచ్చువేయడం జరుగుతుంది.

నెలరోజులనుండి ఖాళీగా ఉండి - అంటే ఏమీ పోష్ట్ చెయ్యక – చేతులు చాలా …. గా ఉన్నాయి.

బ్రహ్మశ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు 1995 లో ఆర్షధర్మము (చారుచర్య) అనే చిరు పొత్తమును సంకలనం చేసి ముద్రింపించారు. అవి అన్ని కాపీలు పూర్తిగా చెల్లుబాటవగా మరల ప్రచురించ సంకల్పించారు. ఇంతకు ముందులానే దీనిని కూడా ప్రచురించడానికి ముందు అంతర్జాలంలో ఉంచిన మరింతమందికి చేరుతుందని ఆశిస్తూ దీనిని మీ ముందు ఉంచుతున్నాము. ఇందులోని ధర్మములు మను ధర్మశాస్త్రము, చతుర్వేద పరమ రహస్యము, వర్ణాశ్రమ ధర్మ పరిణామము, సంపూర్ణ నీతి శాస్త్రము, ధర్మానుష్ఠాన చంద్రిక లనుండి గ్రహింప బడ్డాయి.

1995 లో దీనిని నెల్లూరు లో జరిగిన ఆర్షధర్మ మహాసభ వారి ప్రథమ వార్షికోత్సవ సభలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ శంకరాచార్య మహాస్వామి వారి కరకమలములచే ఆవిష్కరిమప బడినది.
దీనినికూడ అంతర్జాలం లోని ఆంధ్రులు ఆదరిస్తారని ఆశిస్తూ

మీ

దువ్వూరి వేణు గోపాల్

Saturday, May 16, 2009

శ్రీ కాశీ కేదారనాథ స్తుతిః

బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత శ్రీ కాశీ కేదారనాథ స్తుతిః

శ్లో అన్నానాంపతయే దిశాంచపతయే
మాదృక్పశూనాం పునః
స్తేనానాం పతయే సమస్త జగతాం
క్షేత్రాషధీనాంసతామ్
వృక్షాణాం పతయే శివాయ సుధియాం
దృక్తస్కరాణాం తథా
పుష్ఠానాంపతయే దినాధిపతయే
సర్వాత్మనేతేనమః

శ్లో అస్మానుద్ధరదేవదేవ భవతఃపాదం
శరణ్యాంనతాన్
భక్తాభీష్టదమప్రమేయభగవద్ధామ
ప్రదంచాంతతః
నైవాన్యం వరయామతేపదయుగాత్
కేదారనాథప్రభో
మోక్షైకప్రథిత ప్రభావవిభవా
కేదారభూస్తేప్రభో

శ్లో శివతత్వం నజానామి కీదృశోऽశిమహేశ్వర
యాదృశో ऽశిమహాదేవతాదృశాయ నమోऽస్తుతే


శ్రీ కాశీకేదారమహాత్మ్య అంతర్గత కేదారనాథ స్తుతిః



శ్లో శ్రీమత్పరస్మైః నీజచిత్ఘనాయ
గౌరీతపఃపూర్ణఫలప్రదాయ
కేదారనాథాయ నమశ్శివాయ
నమోనమః కారణకారణాయ

శ్లో కాశ్యాంకృతాఘాఖిలవారణాయ
కారుణ్యసంపూర్ణదృశేవరాయ
ప్రాచీన తీర్థోత్తమ తీరగాయ
నమోనమః కారణకారణాయ

శ్లో గంగా, దివోదాస, సునైగమేయ
మహాఘకృద్బాష్కల తారణాయ
శివాపరోధార్త వృపోద్ధరాయ
నమోనమః కారణకారణాయ

శ్లో మయిప్రసన్నాయచవామదేవ
మునౌప్రసన్నాయ నృపేపితద్వత్
రహస్యదాత్రే త్వముక్త పూర్వా
నమోనమః కారణకారణాయ

శ్లో నమో నమస్తే భజతాం ప్రసన్నం
నమోనమః కాశిజనాఘహంత్రే
హితోపదేష్ట్రే మమధీప్రదాత్రే
నమోనమః కారణకారణాయ


శ్రీ కాశీ కేదారమహాత్మ్యాంతర్గత ప్రాచీన మణికర్ణికా, గుప్తతీర్థ, గౌరీకుండ స్తుతిః

శ్లో ఆద్యాయా మణికర్ణికా విజయతే కేదారనాథాగ్రతః
సానః పాప మనాదిమూల మఖిలం నిర్నాశయత్వద్యవై
భూపేసోమవతీశపాప కలుషే శ్రీవామదేవేమయి
ప్రీతా పూర్ణ కటాక్షపాత్రపదవీమస్మాన్ తదాత్వాదరాత్

శ్లో శ్రీ గౌరీ శ్రుతి భూషణ ప్రవిల సత్తాటంకముక్తామణేః
సంపాతా దపలబ్ధవైభవతయా శంభోరతీవప్రియా
యా స్మానుద్ధరదప్రమేయకలుషాధారాన్ జడాన్ సా సదా
ప్రాచీనమణికర్ణికా భవతునః పాపౌఘవిధ్వంసినీ

శ్లో యా సా పార్షద నైగమేయ గణపే శంభోః ప్రసాదం కరీ
యాపాపాధమబాషలదివజ మపిస్థానం పరం ప్రాపితా
యా భూలోక కతాపరాధ జనతాం సాంబా సముత్తారిణీ
ప్రాచీనామణికర్ణికా భవతునః పాపౌఘవిధ్వంసినీ

శ్లో యా కేదారపురః సదావిలసతే కాశ్యాం ప్రజాస్తారయన్
యానిత్యం త్రిజగ్పవిత్ర తటినీం సంయజ్య తత్తుష్ఠిదా
యాకాశీజనతాఘ సంఘశమనీ సందర్శనాత్ మజ్జనాత్
ప్రాచీనామణికర్ణికా భవతునః పాపౌఘ విధ్వంశినీ


కాశీ ఖండాతర్గత శ్రీకాశీకేదారనాథ మహాత్మ్యం

శ్లో జన్మద్వయార్జితం పాపం శరీరాదపి నిర్వ్రజేత్
దృష్ట్వాకేదారశిఖరంపీత్వా తత్రామృతతవచ
సప్తజన్మకృతాంత్పాపాన్ముచ్యతేనాత్రసంశయః
హరపాపహ్రదేస్నాత్వాకేదారేశాల్ప్రపూజ్యచ
కోటిజన్మార్జితైనోభిర్ముచ్యతేనాత్ర సంశయః
సకృత్ప్రణమ్య కేదారం హరపాపకృతోరతః

శ్లో ధర్మార్ధకామమోక్షాణాం కాశ్యాం కేదారభూమికా
యాస్యవృద్ధికరీజాతా విశ్వేశానగరీబలాత్
శివలోకమవాప్నోతి నిష్పాపోజాయతేక్షణాత్

శ్లో కాశ్యాం కేదారభూమౌతు నతథా దేహయాతనా
అనాయాసేనదేహస్యత్యాగమాత్రేణతారకం
ఉపదిశ్యమహాదేవః కరోతి స్వాత్మవత్ క్షణాత్
శ్రీకాలబైరవాద్యాస్తు కాశీస్థాదేవతాగణాః
కేదారాంతర్గ్రుహే స్మాకంనైవా జ్ఞాసంప్రవర్తతే
శివప్రసాదోబలవాన్ కేనశక్యోవివారితుమ్
కేదారేశం మహాలింగం దేహకేదారనాశనం
కేదారాణిక్త పుత్రాద్యాభవన్తి ధ్యానభూమయః


శ్రీ కాశీకేదార మహాత్మ్యాంతర్గత కేదారఖండ అవధి

శ్లో పురాకేదారనాథ స్వక్షేత్రమంతర్గ్రుహంస్థితం
పూర్వశ్యాందిశి గంగార్ధభాగం తీర్థసమన్వితమ్
అర్ధక్రోశంచాగ్నిదిశి లోలార్కేశాంతదక్షిణం
సర్వపాపప్రశమనం శంఖోధారాంతవైరతమ్
పశ్చిమే వైద్యనాధాన్తం రమాతీర్ధాంతువాయుదిక్
ఉత్తరే శూలటంకాంతమీశాన్యాం క్రోశమర్ధకమ్
ఏతన్మధ్యే శుభంలింగం సర్వపాప వినాశకం
శ్రీ విశ్వనాథకేదారకాశ్యాం కేదారనామతః
సద్యస్తారయతేలోకాన్ భైరవాయాతనం వినా


స్కందపురాణాంతర్గత శివ అభయం

శ్లో మమకేదారలింగేయః, పత్రంవాపుష్పమేవవా
ఏకద్వత్రిచతుర్వాపిచులుకోదకేమేవవా
అర్పయేత్తత్సమాసాద్యముక్త సర్వాధిపోభవేత్

శ్లో తుషారాద్రిం సమారూహ్యకేదారం వీక్ష్య యత్ఫలం
తత్ఫలం సప్తగుణితం కాశ్యాం కేదారదర్శనే

Saturday, May 9, 2009

రికార్డ్ స్థాయిలో తక్కువ కామెంట్లు వచ్చిన బ్లాగు -- ఓవిన్నపం

అయ్యలారా , అమ్మలారా

గత కొద్ది రోజులుగా నేను పోస్ట్ చేస్తున్న కాశీ కేదారం అనబడు కేదార ఖండ మహాత్మ్యం ఒక కొలిక్కి వచ్చింది. మధ్య మధ్య ఒకటి రెండు అధ్యాయాలు పొస్ట్ చెయ్యలేదు కూడా? దీనిని త్వరలో ప్రింటు వెయ్యబోతున్నాము. ఎవరికైనా దీనిని చదివి అందులోని పుచ్చు తప్పులు ... అచ్చు తప్పులు ... భాషాదోషాలు మాకు తెలియచేయాలని ఉంటే మాకు ఒక వేగు పంపిన వారికి పూర్తి బ్లాగు యెక్క పి.డి.యఫ్ ప్రతి పంపగలము.

అట్లే కాశీ గురించి ఏమయినా సమాచారం తెలుసు కోవాలన్న జిజ్ఞాస ఉన్న మా బ్లాగులో కామెంటినా సరే లేక వేగుపంపినా ఆ సమాచారాన్ని మా బ్లాగులో పొందు పరుస్తాం. అట్లే ఇక ముందు మా బ్లాగులో ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ చేస్తాం. ఇలాగే ఆదరిస్తారని తలుస్తున్నాం.

మరొక విషయం నాబ్లాగులో ఇంతవరకు వచ్చిన కామెంట్లు 2. ఇన్ని తక్కువ కామెంట్లు ఇంతవరకూ ఏ బ్లాగుకు రాలేదని, మాదే రికార్డని మేము భావిస్తున్నాం.

జయ్ హో

Wednesday, May 6, 2009

31 వ (ఆఖరి) అధ్యాయము

మహర్షులు సూతుని, గురుదేవా! మంగళకరమగు శివకళ్యాణ రహస్యము శలవిండని వేడిరి. సూతుడిట్లు వివరించిరి.

జడుడు, స్థావరుడగు హిమాచలము పర్వతముల రాజుగా రాణించి కృతార్ధుడగుట, శివ పార్వతుల కళ్యాణ గాథ సర్వ సిద్ధి ప్రదము. శివుని ఆజ్ఞానుసారము దాక్షాయణి సృష్ఠి నిమిత్తము, దానవ సంహారము కొరకు కుమారస్వామిని ప్రసాదించుటకుగాను పర్వతరాజుకు తనయగా ఉద్భవించెను. కశ్యపాదులు శివాంశతో సృష్ఠి నిమిత్తమై ఉద్భవించిరి. వారికి శక్తి అంశతో భార్యగా పార్వతి సృష్ఠికి కారణమైనది. దేవ, మానవ, పశు, పక్ష్యాది సృషఠికి పూర్వమే పరాశక్తి మూడులోకములను సృష్ఠింటినది. బ్రహ్మ, శివ పరాశక్తుల ఆజ్ఞచే ప్రతి కల్పమందును సృష్ఠి జేయును. లీలా వినోదముగా శివుడు మహాకైలాసమున రుద్రరూపముతో నున్నపుడు పరాశక్తి సతి రూపము శివుని వరించెను. దక్షుని కుమార్తెగా అవతరించి శివుని పరిణయ మాడగా దక్షుడు శివునికి మామగారైన గర్వమున దేవతలను లెక్కజేయక తిరస్కరించనను వారు శివుని ధ్యానించుచు దక్షుని ఉపేక్షించిరి. శివుని ద్వారానే దక్షుని గర్వమడగింపనెంచి వాని ఆజ్ఞావర్తులుగా దక్షునిచే ఒక యజ్ఞమారంభింపజేసిరి. దక్షుని మోహింపజేసి మామగారిగా శివునికన్న నీదే పైచేయిగా నుండవలెను అని నమ్మించి సలహా నిమిత్తము దేవతలు దక్షుని శివుని వద్దకు తీసుకొనివెళ్లి వారందరునూ శివునికి నమస్కరించి కూర్చొనిరి. శివుని కేవలము అల్లునిగా తలచిన దక్షుడు శివునికి నమస్కరించకయే ద్వతల మధ్య ఆశీనుడాయెను. అందరు దేవతలతో సహా దక్షుని కూడ శివుడు కుశలము విచారించిరి. కాని దక్షుడు కోపించి, మామగారినగు నాకు నమస్కరింపకయే మూర్ఖుడై, శివుడు దుష్ట స్వభావముతో నన్ను అందరితో సమానముగా చూచెనని కోపించి, శివుని దూషించి సభనుండి వెళ్లిపోయెను. దేవతలందరునూ దక్షుని పతనమారంభమైనదని తలచి శివునికి నమస్కరించి నిష్క్రించిరి.

దక్షుడు యజ్ఞమందు పూర్ణ ఫలదాత యగు శివుని ఆహ్వానింపకయే యజ్ఞమారంభించి హవిర్భాగము రుద్రునికివ్వనందున కోపించిన సతీదేవి, శివుడు వారించిననూ వినక దక్షయమునకు వెళ్లి బంధువర్గముతో సహా దక్షుని నిందించి, నీపేరుతో దాక్షాయణిగా నున్న ఈ దేహము త్యజించుచున్నానని యజ్ఞవాటిక యందు దుమికి అంతర్ధానమయినది. ఈ విషయము నారదుని ద్వారా తెలిసిన పరమాత్మ వీరభద్రుని సృష్ఠించి పంపి దక్షయజ్ఞము ఛిన్నాభిన్నము చేసి దేవతలను దండించి దక్షుని గర్వమడగించెను.

ఆ సతియే శివాజ్ఞచే పర్వత రాజ దంపతులకు తనయగా, బాలగా వారినానందింపజేసెను. కుమారిగా పరమేశ్వరుని పతిగా పొందునిమిత్తము తపమాచరించెను. శివుడు లీలగా ఎన్ని పరీక్షలు పెట్టిననూ సడలనీయని దీక్షతో అపర్ణగా ధృడముగ నిల్చి శివుని అభిమానములకు పాత్రురాలై, తన తలిదండ్రులను ఒప్పించి తనవద్దకు వరాన్వేషణకు పంపునట్లు శివునిచే అనుజ్ఞపొంది, తన మనోభీష్టమును తలిదండ్రులకు తెల్పెను. పర్వతరాజ దంపతులు సాక్షాత్ పరమేశ్వరుని తమ అల్లునిగా తలంచి ఆనందముతో తమ పూర్వజన్మముల పుణ్యము ఫలించి తమకీ అదృష్టము కల్గినట్లు భావించిరి. శివుడు హిమవంతుని వద్దకు జ్యోతిష బ్రాహ్మణులు, బృహస్పతి, శుక్ర, వశిష్ఠ, అత్రి, భృగు, కుత్స మహర్షుల ద్వారా కన్యావరణము నిమిత్తము పంపిరి. హిమవంతునికి అనుకూలమగు ముహూర్తము వారిద్వారా తెలిసికొని కన్యను చూచు నిమిత్తము శివుడు హిమవంతునింటికి వెళ్లెను. విశ్వకర్మను నియమించి అతని మనస్సంకల్పముద్వారా మనోహరమగు మండపమును, గృహమును, కళ్యాణ వేదికను, శిబిరములను నిర్మింపజేసిరి. నవరత్న ఖచిత స్వర్ణ రజిత మండపములు, రత్నములు పొదిగిన కుశ వనములు, ముత్యములు, రత్నములు నింపిన ఊయలలు, వీధులలో పతాకములు రెపరెపలాడుచు, చింతామణి, కల్పవృత్రము, కామధేనువు, అక్కడకు వచ్చినవి. షడ్రసముల పిండివంటలతో భోజనములు సమకూర్చుటకు కామధేనువు సిద్ధమయినది. వస్తు, గంధ మాల్యాది లేపనములు సమకూర్చుటకు కల్పవృక్షము సిద్ధమయినది. రత్నభూషణములు సమకూర్చుటకు చింతామణి వచ్చినది. సంగీత, వాద్య ఘోషలు మిన్ను ముట్టించుటకు నారదాదులు వచ్చిరి. ఆవాహితులను స్వాగతించుటకు లోకపాలురు వచ్చిరి. సర్వకార్యములు సమకూర్చు బాధ్యత స్వయముగ బ్రహ్మ తన భుజస్కందములపై ధరించెను. వివాహవిషయముల సంప్రతింపులకు విష్ణుమూర్తి సిద్ధమాయెను. హిమవంతుని ఇంట అన్నియు సమకూర్చి, దేవతలందరునూ వరుని ఆహ్వానించి తీసికొని వచ్చుటకు కైలాసము వెళ్లి శివునికు సాష్టాంగ నమస్కారము చేసి హిమవంతుని ఆహ్వానము విన్నవించిరి. పరమేశ్వరుడు వృషభ వాహనుడై నంది, భృంగి, గణ పరివార సమేతుడై, దేవతలు స్తుతి స్తోత్రములు చేయుచు ముందు నడువగా, యక్ష, గంధర్వ, కిన్నెర, అప్సరసలు సేవింపగా హిమవంతుని ఇంటికి చేరిరి. హిమవంత దంపతులు స్వామివారికి పాలతో పాద ప్రక్షాళన చేసి, రత్న నీరాజనమిచ్చి స్వాగతించిరి. మామగారిచ్చిన ఫలములు చేతగైకొని బ్రాహ్మణులు స్వస్తివాచకము పల్కగా శివుడు హిమవంతుని మందిరము జొచ్చిరి. హైమవతి సర్వాలంకార భుషితయై రత్న సింహాసనమున ఆశీనురాలాయెను. స్వామి హిమవంతునితో, బ్రహ్మ, విష్ణు, ఋషిగణములతో అంతర్వేది మండపమున ప్రవేశించిరి. మామగారు అల్లుని రత్నపీఠమున అధివసింపజేసిరి. బ్రహ్మగారు పురోహితులు కాగా, బాజా భజంత్రీలు, బ్రాహ్మణుల స్వస్తి వాచకములు, గణముల జయజయధ్వానములు, మిన్ను ముట్టగా, హిమవంత దంపతులు స్వామివారికి కన్యాదానము జేసి కృతార్ధులైరి. అగ్నౌకరణ, లాజహోమ, సదస్య, భూరి భోజనాదుల అనంతరము స్వామి అమ్మవారిని తీసికొని కైలాసము బయలుదేరగా, దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. దేవతల ఢంకా, భేరి, మృదంగముల మధ్య గంధర్వులు గానము, అప్సరసలు నాట్యము జేసిరి. అందరి మనములు ప్రపుల్లములై ఆనంద డోలికలలో ఊగినవి. శంకరుడు బ్రహ్మ, విష్ణులను సత్కరించి బ్రాహ్మణులకు యధోచిత దానములొసంగి దేవితో సహా వృషభారూఢుడై కైలాసమేగిరి. ఆహూతులు ఆనందముగ తమలోకముల కేగిరి. లీలావినోదభరిత శివ పార్వతుల కళ్యణమట్లు వైభవోపేతముగ జరిగినది. తోడబుట్టిన అన్నదమ్ములు లేని కన్యను వివాహమాడుట ధర్మ విరుద్ధము గనుక శంకరులు హిమవంతునకు మైనాకుడను కుమారుని అనుగ్రహించిరి. కాని మైనాకుడు అమ్మవారికి సహోదరుడనిపించుకొనుటకు భయపడి ఇప్పటికిని సముద్రమున దాగియున్నాడు. కేదారేశ్వరుడు 15 కళలతో కాశీకి చేరి ఒక్క కళను మాత్రము హిమాలయకేదారమున వదలినాడు. విశ్వనాధుడు కేదార క్షేత్రమున కాలభైరవదండన లేకయే తారకమంత్రముపదేశించి ముక్తినిచ్చును. ఈ శివకళ్యాణ కథా శ్రవణము సర్వ మంగళ ప్రదము. ఏ కోరికతో శివ కళ్యాణ పఠన, శ్రవణములు జరుపుదులో అవి నిశ్చయముగా ఫలించును.

ఈ పురాణము విని మునిశ్రేష్ఠులు ఈశ్వరుని స్తుతించిరి. అన్నానాం పతయే, దిశాంచ పతయే, మాదృక్పపశూం పతయే నమః. తస్కరానాం పతయే, జగత్ సమస్త క్షేత్రౌషధీనాం పతయే నమః. వృక్షాణాం పతయే పుష్ఠానాం పతయే. బుద్ధానాం పతయే, దుష్ఠానాం పతయే, దినాంచ పతయే నమః. స్వామీ అనంత కోటి నమస్కారములు. అప్రమేయా! అభీష్ట వరదా! మీ ధామము ప్రసాదింపుడు. మాకు మరి ఏదియునూ వలదు. కేదార క్షేత్ర మహిమ కేవలము ముక్తి ప్రదము. అందువలన మాకు నిరంతరు, ఆజన్మ కేదార వాసమనుగ్రహింపుడు. ఋషుల ధ్యానమునకు సంతుష్టుడై పరమాత్మ పార్వతీ సమేతుడై, వృషభవాహనుడై, సూతునితో సహా ఋషులకు దర్శనమొసంగెను. గణేశ, కుమార, గణ సహితుడై దర్శన మొసగి ప్రఫుల్ల సుస్వరమున సద్భక్తముని శ్రేష్ఠులారా! మీ స్తుతికి ప్రసన్నుడనయితిని. మీకు పునరావృత్తి రహిత మొక్షమొసంగితిని. కేదార క్షేత్రములో నున్నను, ఇతర దేశముల కరిగినను, ప్రసాదమెక్కడ భుజించినను ఫలించినట్లు, మీ దేహత్యాగమెక్కడ జరిగినను, నా రహస్య వృత్తాంతము లన్నియూ అవగతము చేసికొనిన మీరు ధన్యులు. ముక్తులని పలికి లింగముల అంతర్ధానము జెందిరి. కోటి సూర్య ప్రభాభాసితమగు స్వామిని దర్శించిన సూతుడు, మునులారా! మనము ధన్యులము, కాశీ కేదార మూల రహస్యము వేదసారము. శంకర ప్రతిపాదితముగనుక జనన మరణచ్ఛేదము. పూర్వ జన్మల పుణ్య సంచయముచే మాత్రమే దీనిని వినుట, వినిపించుట, చదువుచ, చదివించుట యనునవి సంభవించును. లేనిచో నేను నా గురుదేవులు వ్యాసమహానుభావుని ముఖకమలము నుండి వినుట, ఇక్కడకు వచ్చుట, మీకు వినిపించుట ఎట్లు జరుగును? మీరు విశ్వశించుడు, కేదారేశ్వరుని ఎదుట శివజ్ఞాన రహస్యము పూర్తిగనో, సగమో, ఒకభాగమో, కేవలమొక శ్లోకము గాని చదవుట, వినుట, వినిపించుట వలన ఇష్ట సౌఖ్యములనుభవించిన తర్వాత అంతమున శివపదము ప్రాప్తించుట నిశ్చయము. శివునికి ప్రీతికరమగు శ్రావణ, కార్తీక, మాఘమాసములు గాని అథవా వైశాఖమున కాని ప్రతి దినము ఈ పురాణము చదివిననూ, వినిపించిననూ, వినిననూ వారు శివునికి ప్రీతులై ముక్తి పొందుదురు. వక్తకు వస్త్ర భూషణములనొసగి సంతృప్తి పొందించిన వారిని కేదారేశ్వరుడు అనుగ్రహించి ముక్తినొసగును.

సూతుని ద్వారా ఇట్లు వినిన మునులు ఆనందముగ మున్ముందు సూతుని పూజించి, సుగంధ పూరిత వస్త్రములు, అసంఖ్యాక రత్న, సువర్ణ ద్రవ్యములచే సంతృప్తుని జేసి, విశ్వనాథ, మణికర్ణిక, పంచక్రోశ దేవతలు, కాశీలోని సర్వదేవతలను పూజించి, చివరగా కేదారేశ్వరుని శరణు జొచ్చి విధి విధాయకముగ పూజించిన వెంటనే ఆకాశవాణి రూపమున కేదారేశ్వరుడు ఆజ్ఞాపించిన విధముగా శివుని హృదయమున నిల్పి ధ్యానమగ్నులై ఇచ్ఛాను సారము భోగములనుభవించి సద్యః ముక్తులై దేహపతనానంతరము విదేహముక్తులైరి.

ఇది బ్రహ్మవైవర్త పూరాణాంతర్గత,
కాశీమూల రహస్యాంతర్గత
కాశీ కేదార ఖండ మహాత్మ్యము
సంపూర్ణము

ఇతీశమ్

Monday, May 4, 2009

30 వ అధ్యాయము

ఋషి గణము మరల సూతునిట్లడిగిరి. శివజ్ఞాన రహస్య తత్వజ్ఞుడవగు గురువర్యా! మీ ద్వారా తెలిసికొనదలచిన ముఖ్యవిషయము ఒకటి కలదు. శివుడు గౌరీదేవిని వినిపించిన నూరు కథలలో మీకు ఎవైన తెలిసియున్నచో సెలవిండు. శివుడు ఏకాంతమందిరమున, తనకు మాత్రమే తెలిసిన కథలు గౌరికి వినిపింపగా వానిని నౌగమేయుడు విని రహస్యముగ లక్ష్మికి వినిపించెనని తెల్పితిరి గదా! ఆ కథలలో కొన్ని మీకు తెలిసియుండిన దయచేసి మాకు వినిపింపుడని కోరిరి. సూతుడు, మునులారా ఆ కథలను సంత్రేపముగా తెల్పుదును వినుడు. మాగురువు వ్యాసుని ద్వారా నేను తెలిసికొనిన వానిలో కాశీకి సంబంధించిన వానిని తెల్పుదును.

కల్పభేదముచే సృష్ఠిలో కూడ భేదముండును. శివలీలలు అద్భుదము. శివునిచే గౌరికి చెప్పబడిన కథలు అనేక కల్పములలో, విచిత్రముగా ఎందరు శివుని సేవించి బ్రహ్మపదము, దేవాంగనా పదములను బొందిరో లెక్కకందవు. శివ మహిమ తెల్పు కాశీని గురించిన కథలు వినుడు.

పరమేశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. దేవీ భూమండలమున ప్రత్యేక ప్రధానమగు కాశీ నా శరీరము. కాశీ నా త్రిశూలాగ్రమున నిర్భయముగ నుండును. ప్రళయకాలమున కాశీని మహాకైలాశమునకు ఎత్తి పట్టుకొని మరల సృష్ఠి జరిగిన వెంటనే క్రిందకు దించి భూమిలో చేరునట్లు చేసెదను. కాశీ లౌకిక దృష్టికి పృధ్విలో చేరినట్లుండును కాని జ్ఞాన దృష్టికలవారికి కాశి నేనుగానే తెలియును. అందున విశ్వేశ్వర,ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగముల మహిమ చాలా గొప్పది.

1) కశ్యపుని కథ
ఒకప్పుడు దశార్ణవదేశమున కక్షివంతుడను బ్రాహ్ణుడు శ్రద్ధాళువై తన కుమారునితో సహా కాశీయాత్రకు వచ్చెను. తన ఇద్దరు భార్యలతో కేదార క్షేత్రమున వశించి, నిత్యము కేదారేశ్వరుని సంవత్సరకాలము సేవించెను. సోమవార వ్రతములు విధిగా సల్పుచుండెను. శాస్త్రోక్తముగా గౌరీ కుండమున స్నానమాడి భస్మరుద్రాక్షధారియై పగలు శివుని పూజించి రాత్రికి భుజించెడివారు. హవిష్యాన్నము, పాలు, పండ్లు స్వామికి నివేదించిన వానినే అందరూ స్వీకరించెడివారు. ఒక సంవత్సరకాలమిట్లు సేవించి మరల వారి స్థానమును చేరిరి. కాలమాసన్నమై భార్యలతో సహా మరణించి మరు జన్మలో బ్రహ్మపుత్రుడు కశ్యపుడుగా జన్మించి భార్యలు దితి, అదితులై అతనినే పరిణయమాడిరి. కేదారేశ్వరుని ప్రసాదమున వారికుమారుడు ఇంద్రపదవి పొందెను. అంతమున శివజ్ఞానము పొంది నాలో చేరిరి.

2) స్వాయంభువ మనువు కథ

కౌశల దేశమున సుదాసుడను పేరు గల రాజు కలడు. అతడు, భార్య, కుమారులు చాలా ధార్మికులు. ధర్మాత్ములు. చిన్నకుమారునకు రాజ్యమప్పగించి కాశీని సేవించుటకు వచ్చిరి. కేదాల క్షేత్రమున వసించి ప్రతి పక్ష ప్రదోషము దినముననూ కేదార గౌరి కుండమున స్నానమాడి భస్మ రుద్రాక్షలు ధరించి కేదారేశ్వరుని పూజించి బ్రాహ్మణ సమారాధన తర్వాతనే వారు భుజించెడ్వారు. అట్లు సంవత్సరకాలము వ్రతమాచరించి వారి రాజ్యమునకు వెళ్ళిరి. వారు గతించి మరు జన్మమున కేదారేశ్వరుని కృపచే స్వాయంభువమనువుగను, భార్య శతరూపగను పుత్రుడు సూర్యుడుగను భాసించిరి. క్రమముగ శివజ్ఞానముపొంది నా పదమును చేరిరి.

3) చంద్రుని కథ

పాండ్య దేశమున సుధనుడను వ్యాపారి ధనికుడు, శివధర్మపరాయణుడు. స్త్రీ పుత్రులతో కాశీయాత్రకు వచ్చిరి. యధావిధిగా కేదార క్షేత్రమున శివపూజా ధురంధరులై రెండు సంవత్సరములు గడిపిరి. నిత్య గౌరీకుండ స్నానము కేదార సేవనము సల్పిరి. శివరాత్రి వ్రతమునందాసక్తులై రెండు శివరాత్రులు గౌరీకుండ స్నానము భస్మ రుద్రాక్షధారణ అహోరాత్రకేదార అర్చన, రాత్రి జాగరణ, నాల్గు జాముల పూజ, మరుదినము బ్రాహ్మణ సమారాధన తర్వాత అతడు భార్యా పుత్రులతో కలసి భోజనము జేసి మరల వారి దేశము చేరిరి. దేహావసానంతరము వారు చంద్రుడు, రోహిణి, వారి పుత్రుడు బుధుడుగా అవతరించిరి. ఆ భోగమనుభవించిన తర్వాత నాభక్తులై నాలో ఐక్యమయిరి. నేనే కేదారేశ్వరుడను. వారి భక్తికి ప్రసన్నుడనై వారికి శివ పదము అనుగ్రహించితిని.

4) యమ, శనైశ్వరుల కథ

కాశ్మీర దేశమున శ్రీదాసు యను ఒక శూద్రుడు గలడు. వానికైదుగురు కుమారులు. చాలా అన్యోన్యముగా నుండెడివారు. బిడ్డలననాధులను చేసి తలిదండ్రులు గతించిరి. బిడ్డలు వారి చితా భస్మమును గంగలో నిమజ్జనము చేయుటకు కాశీకి వచ్చిరి. విధి పూర్వకముగ ఉత్రర క్రియలు గవించి, కేదార క్షేత్రమున ఒక సంవత్సర కాలము నిత్య నియమిత యాత్రలు చేయుచు, నిత్యము గౌరీకుండ స్నానము, కేదార సేవనము చేసిరి. ఆ సంవత్సర కాలములో మూడు శని ప్రదోషములు రాగా వారు ఉపవాసదీక్షతో భస్మ రుద్రాత్రధారులై కేదారేశ్వరుని పూజించిరి. వారి దేశము చేరిన తర్వాత కాలమాసన్నమై వారు మరణించిరి. వారు కేదారేశ్వరుని అనుగ్రహమున యముడు, శనైశ్చరుడు, సావర్ణిమను, మరియు అశ్వనీ కుమార దేవతలైరి. భోగానంతరము శివ జ్ఞానులై నాపదమును బొందిరి.

5) రాహువు కథ

మార్వాడ దేశ శమీపురమను గ్రామమున దుర్ఘటుడను పేర ఒక చండాలుడుండెను. అతడు చాలా పాపి. మ్లేచ్ఛ వర్తకునితో అతడు కాశీకి వచ్చెను. మ్లేచ్ఛుడు వర్తకము ముగించుకొని వెళ్లిపోయెను. దుర్ఘటుడు అనారోగ్య కారణమున వానితో వెళ్ళలేక కేదారక్షేత్రమున బిచ్చగాడుగా పడియుండెను. అట్లు ఆరునెలలు గడిచి పోయినవి. ప్రతినెల కృష్ణపక్ష చతుర్దశి కేదారేశ్వరునికి మాస శివరాత్రి ఉత్సవమునకు భక్త జనసందోహము వచ్చును. దుర్ఘటుడు అందరివద్ద బిచ్చమెత్తి అందరిని భగవంతుడు మీకు మేలు చేయునని చెప్పెడివాడు. అట్లే రాత్రి గడచి పొయెడిది. ఆరు మాసములలో ఆరు మాస శివరాత్రులట్లు జాగరణ చేసెను. అట్లు దైవికముగ చండాలుడైనను కేదార నామోచ్ఛారణ, రాత్రి జాగరణల ఫలితముగ అనారోగ్యము మటుమాయమై తన గ్రామమునకు తిరిగి వెళ్లి, కాలవశమున మృతి జెందెను. కేదార అనుగ్రహమున అతడు రాహువుగా సింహికకు జన్మించి, మోహిని అమృతము పంచునపుడు రాక్షసుడైనను మోసపూరితముగ అమృతపానము చేసిన కారణముగా రెండుగా ఖండింపబడినను, కేదారేశ్వరుని కృపవలన నవగ్రహములలో ఒకనిగా పూజలందుకొనుచు భోగాంతమున నాపదము పొందెను.

6) పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఇంద్రాణుల కథ

దేవీ మరొక కథ వినిపించెదను. కర్ణాటక దేశమున కళావతి యను ఒక బ్రాహ్మణ యువతి గలదు. అంగదేశమున విలాసినియగు ఒక రాణి గలదు. ఘూర్జర దేశమున సుమతి యను ఒక వైశ్య స్త్రీ గలదు. విదర్భ దేశమున పుష్ప నామముతో ఒక శూద్ర స్త్రీ గలదు. వీరు నల్గురు వైధవ్యమును పొంది పతిలేకపోగా పుత్రులుకూడ లేనివారై విడివిడిగా కాశీకి చేరిరి. నిత్యము గంగాస్నాన, విశ్వేశ్వర అర్చనలు యధాశక్తి బ్రాహ్మణులకు దానములు చేయుచు ఒకరోజు వారు నల్గురు కేదారేశ్వర ఆలయమున కలిసి ముచ్చటించు కొనుచు, వారి వారి కష్టసుఖములు, పూప్వ వృత్తాంతములు చెప్పుకొనిరి. వారివద్దనున్న ధనము పూర్తిగా వ్యయమగువరకు నల్గురునూ ఒకచోట కలిసి యుండునట్లు నిశ్చయించుకొనిరి. నిత్యము గౌరీకుండములో స్నానము, కేదారేశ్వర పూడ, ఇష్ట దేవతలైన పతులను మనసా ధ్యానించుకొనుచు 12 సంవత్సరములు కాశీ కేదారేశ్వరుని సమీపముల వశించిరి. సోమవారములు, ప్రదోషములు మాస శివరాత్రులు, మహాశివరాత్రులు, ఉపవాస ప్రతముతో భక్తి ప్రపత్తులతో బ్రాహ్మణ సమారాధనలు చేసి తర్వాత వారు భుజించెడివారు. శరీర కష్ముల కోర్చి ఈ విధముగ వారి వద్ద ధనము పూర్తిగా వ్యయమగువరకు కాశీవాసము చేసి తర్వాత వారి వారి గ్రామములకరిగిరి. కాలవశమున నల్గురును మరణించిరి. కేదార క్షేత్రమున వారు అన్నలింగమునకు గంధపుష్పాక్షతలతో నిత్యపూజ చేసిన కారణమున కాశీ అన్నపూర్ణ ప్రసన్నురాలై వారికి నా శివపద మబ్బునట్లు చేసినది. హే గౌరీ వినుము, నీవు ఆ కల్పమందు ఆ బ్రాహ్మణ స్త్రీ కళావతి, లక్ష్మి రాణియగు విలాసిని, సరస్వతి వైశ్య స్త్రీ సుమతి, మరియు ఇంద్రాణి పుష్పయను శూద్ర స్త్రీ. వారు ఒక కల్పకాలము మీ పదవులలో యుండి నా భక్తిచే నా జ్ఞానమును పొంది శివపదమలంకరించిరి.

7) దూర్వాసుని కథ

మరొక కథ వినుడు. కాంచీ పురమందు ధర్మ శర్మ యను పుణ్యాత్ముడు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గలడు. వేద విద్యాభిమాని. యధావిధి కాశీ యాత్రకు వచ్చి కాశీ కేదార నాథుని దగ్గర మూడు సంవత్కరములు నిత్యము గౌరీకుండమందు స్నానము, కేదారేశ్వరుని పూడ చేసి మధూకర వృత్తితో భుజించెడివాడు. ఆర్ద్రా నక్షత్ర దినమున ప్రతిమాసము అరుణోదయకాలమున, ముఖ్యముగ ధనుర్మాస ఆర్ద్రాదినమున విశేషముగ నా మహాలింగ అర్చన చేసెడివాడు. స్వామీ నా పూజలతో ప్రసన్నుడవయి నాకు నీ కల్మష రహిత సుజ్ఞానము ప్రసాదింపుమని రోజునూ ప్రార్ధించెడివాడు. అట్లు 3 సంవత్సరములు గడచిన తర్వాత మరల కాంచీపురము వెళ్లుచు త్రోవలోనే మరణించెను. కేదారేశ్వరుని అనుగ్రహమున అతడు మరుజన్మలో అత్రి మహర్షి కుమారుడు దూర్వాసుడుగా జన్మించెను. శివమానసుడు, శివరహస్య జ్ఞానిగా ఒక కల్పము భోగమనుభవించి కల్పాంతమున శివపద ప్రాప్తి బొందెను. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి కేదారలింగమునకు అన్నలింగ జ్ఞానముతో పూజలు సలిపి త్రిమూర్తులకు మాత అయినది.

8) అగస్త్య, లోపాముద్రల కథ

మరియొక కథ వినుడు. ఒకప్పుడు శ్రీశైల పర్వతము ధృతియను పేరుగల బ్రాహ్మణుడు శ్రీమల్లిఖార్జున లింగమును భక్తితో పూజించెడివాడు. అతడు భార్యా సమేతుడై కాశీ యాత్రకు వచ్చి కేదార క్షేత్రమున వసించి, ఆరు సంవత్సరములు నియమ నిష్ఠలతో షణ్ముఖ స్వామి కార్తికేయుని పూజించెడివారు. ప్రతిమాసము కృత్తికా నక్షత్రమున, శుక్ల పక్ష షష్ఠీ దినమునను, విశేషముగ కార్తీక మాస శుక్ల పక్షమున, చంపా షష్ఠీ, స్కంద షష్ఠీ దినములందు విధిపూర్వకముగ ఉపవాస వ్రతమాచరించుచు పూజలు సల్పిరి. నిత్యము గౌరీ కుండమున స్నానము చేసి కేదారేశ్వరుని పూజించుట వారి నిత్య కృత్యము. అన్నపూర్ణా సమేత కేదారేశ్వరునిగా ధ్యానించెడివారు. యధాశక్తి బ్రాహ్మణులకు బిక్షులకు అన్నమిడెడివారు. ఆ తర్వాత వారు భుజించెడివారు. ఆరు సంవత్సరముల తర్వాత వారికి పృధ్వీ ప్రదక్షణము చేయు సంకల్పము కల్గి కాశీని వదలి మార్గ మధ్యమున దేహ త్యాగము చేసిరి. అతని భార్య అతనితో సహగమనము చేసినది. వారు మరు జన్మమున అగస్త్య, లోపాముద్రలై గొప్ప కీర్తి గడించిరి. కార్తికేయుని ద్వారా శివ రహస్య జ్ఞానముపదేశింపబడి కల్పాంతమున నా సన్నిధికి చేరి శివపదము బొందిరి.

9) పృధి చక్రవర్తి తండ్రి వేణు కథ

మరియొక కథ. వింధ్య పర్వత శ్రేణిలోని ఒక వనమందు దుర్నయుడను పేరు గల ఒక మహాపాపి, కిరాతకుడుండెడివాడు. పథికులను దారిదోపిడి చేయుచు బ్రతికెడివాడు. ఒకనాడు అతడు ఒక కార్పణికుని చంపుటకు కత్తి ఎత్తగా అతడు భయపడి హే ఢుంఢి గణపతీ, హే కేదారనాథా నన్ను కాపాడుడని దీనుడై పెద్దగా ప్రార్థించెను. వెంటనే కత్తి ఎత్తిన కిరాతుని చేయి పైన స్తంభించిపోయెను. అతడు ఎంత ప్రయత్నించినను కత్తి పట్టిన చేయి దింపజాలనందున అతి దుఃఖితుడై ఆ బ్రాహ్మణుని ప్రార్ధించి, స్వామీ నన్ను దయతలచి మరల నా చేయి సరియగునట్లు చేయుడు. మీ ఇష్టదైవమును ప్రార్థించి నన్ను కాపాడుడని బిగ్గరగా ఏడ్వగా బ్రాహ్మణుడు దయాళువై మరల ఢుండి రాజ కేదారేశ్వరులను ప్రార్ధించి కిరాతుని చేయి దిగునట్లు చేసెను. కిరాతుడతని కాళ్లపై బడి, కాధూ నా అపరాధమును మన్నించి నాకు తరుణోపాయముపదేశింపుడని పేడగా, బ్రాహ్మణుడతనిని ఆదరముగ లేవనెత్తి నీవు కాశీయాత్ర చేసి ముందుగా గణేశుని, ఆపై శంకరుని విధాయకముగా పూజించినచో నీవు కృతార్ధుడవగుదువని తెల్పెను. దుర్నయుడు వెంటనే కాశీ యాత్ర జేసి విధిపూర్వకముగ గణేశుని, ఢుండిరాజును, విశ్వేశ్వరుని పూజించి, కేదార క్షేత్రమున ఒక సంవత్కర కాలము కేదారేశ్వరుని పూజించుచు నిత్యము గౌరీకుండ స్నానము, చతుర్ధి దినములలో గణపతి పూజ, మహాచతుర్ధియందు విశేషార్చన, బ్రాహ్మణ, యతి, భిక్షుల ఆతిధ్యము తర్వాత తాను భుజించును గడిపి ఉపవాస జాగరణలతో శివుని తృప్తిపరచెడివాడు. తర్వాత ఒకనాడు తనదేశము చేరుటకు కేదారుని అనుమతి కోరగా, ఆకాశవాణిరూపమున నీకు మంచి జరుగును, వెళ్లి భక్తితో నన్ను ప్రార్ధించుచుండుమని అతనికి వినిపించెను. అతడు తనదేశము తిరిగి వచ్చి కలమాసన్నమై మరణించి, మరుజన్మమున పృధుచక్రవర్తి తండ్రి వేణు యను రాజుగా జన్మించి కీర్తి గడించెను. గణపతిని గురించిన పూర్తి జ్ఞానముపదేశము పొంది మరుజన్మ ఇంద్రుడై, శివజ్ఞాన ప్రాప్తిపొంది అంతమున నాపదము చేరెనని శివుడు గౌరికి రహస్య కథ వినిపించెను.

10) నారద, తుంబురుల కథ

పూర్వము కళింగదేశమున ముగ్గురు భిల్లులుండెడివారు. వారి పూర్వపుణ్య వశమున వారికి కాశీయాత్ర చేయు సంకల్పముదయించి కాశీచేరి కేదార క్షేత్రమున ప్రతి శుక్ర, శని, మంగళవారములందు, దండపాణి, బిందుమాధవ, కాలభైరవులను విధిపూర్వకముగ పూజించి మరుజన్మలలో వారు విశ్వవసు, నారద, తుంబురులుగా జన్మించి, నాగానమందు రతులై ఒక కల్పకాలము భోగమనుభవించి, కేదారేశ్వరుని కృపవలన ముక్తులై నాలోని శివపదము జేరిరి.

ఇట్లు వివిధ కల్పములందు ఎందరో విశ్వేశ్వర, ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగములను పూజించి కాశీ వదలి మరల వారి స్థానములకు చేరినను వారికి దేవత్వమబ్బి భోగములననుభవించి నాజ్ఞానము కల్గి నన్ను చేరినవారనేకులు ఋషులు, మునులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, ఆదిత్య, వసు, రుద్ర, దిక్పాలకులు, వారి స్త్రీలు, పాతాళవాసులు, గంధర్వ, యక్ష, కిన్నెరలు, నాగ కన్యలు, అప్సరసలు, మహాలోక, తపోలోక, జనాలోకవాసులు, బ్రహ్మ, విష్ణు, రుద్ర లోక పాసులు, ప్రఖ్యాత చక్రవర్తులు, ఇట్లు ఎందరో కల్పి కల్పములలో కాశీలో నా పూడచేసిన వారలు కాశీవదలి వెళ్లిననూ దేవయోనులయందు జన్మించినవారనేకులు గలరు. నా ఇతర క్షేత్రములందు నన్ను సేవించిన వారునూ అట్లే ఉత్తమోత్తమగతులు పొందినారు. ఇట్లు అనేక గుహ్యతమ చరిత్రలు ఎన్ని చెప్పగలను. నా ఆనందమయ మీలలు చిత్రాతి చిత్రములు. అని శంకరులు గౌరికి ఇట్టి ఎన్నో కథలను వినిపించిరి. ఈ విధముగనే కాశీలో ఓంకారేశ్వర, విశ్వేశ్వర లింగములను పూజించి కృతార్ధులై దేవత్వమబ్బినవారెందరి కథలో గలవు. అవియునూ వినిపించిరి.

సూతుడు శౌనకాదులతో పుణ్యాత్ములారా! శివునికి మాత్రమే తెలిసి గౌరీదేవి కి వినిపించిన ఇట్టి పరమ రహస్యములు, నా గురువులు వ్యాస భగవానులు, శివభక్తి పరాయణులై దివ్య జ్ఞానముచే కొన్ని తెలిసికొని నాకు వినిపించిరి. నేను మీకు వినిపించితిని. మీరు ధన్యులు. కాశీ విశ్వేశ్వర మందిరమునందును, వివిధ దేవతల మందిరములందుని శివ, శక్తి, గణేశ, కార్తికేయ, నంది, భృంగి, మరియు అన్ని దేవతల పుణ్య దినములందును విశేషమూజలు సల్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, భిల్ల, చండాలాదులు కూడ మరుజన్మమున దేవతలలో ముఖ్యులైనవారి కథలు వింటిరిగదా! పరమేశ్వరుని ఒక్కొక్క అంశ ఒక్కొక్క లింగరూపమున భుతలమందనేక ప్రదేశములందు నెలకొని ఎందరినో ముక్తులను చేసినది. అనన్య భక్తులకు మాత్రమే అవి ప్రాప్తించును. పుర్వ జన్మల పుణ్యవిశేషమున మాత్రమే అపవిత్ర వాసనా క్షయము, పవిత్ర కర్మలపై ఆపేక్ష జనించి శివారాధన ద్వారా ముక్తులగుదురు.

Saturday, May 2, 2009

29 వ అధ్యాయము

ఋషులు సూత పౌరాణికునికి నమస్కరించి, బాదరాయణ శిష్యులు, శివరహస్య నిధియగు మహాత్మా! మీ ద్వారా శ్రీ కాశీ కేదారనాథ మహాత్మ్యము విని తరించితిమి. ఈ కేదారనామము శివునికెట్లు క్లగినది? సాకల్యముగా తెలియజేయుడని కోరిరి. సూతుడు వారడిగిన రహస్య కథతెలియజేయుదునని ఇట్లు తెల్పెను.

పూర్వము హిమవంతుడు భార్యా సమేతముగా శంకరుని ప్రసన్నుని చేసికొనుటకై పదివేల సంవత్సరములు తపస్సుచేసెను. నా యశస్సు పర్వతరాజులందరను మించి పోవలెనన్న, జడుడనగు నాకు శంకరుడు తప్ప వేరు గతి లేదు. గనుక నా మనోరధము నెరవేర్చువరకు తపమాచరింతునను ధృఢసంకల్పముతో వాయు త్రక్షకుడుగా ఇరువదివేల సంవత్సరముల తపస్సు తర్వాత శంకరుడు ప్రీతుడై ప్రత్యక్షమై హే పర్వతరాజా! నీవు భార్యా సహితముగా ఉగ్రతపమాచరించి నన్ను తృప్తుని జేసితివి గనుక నీ అభీష్టము కోరుకొమ్మనగా, వారు పరమానందముతో స్వామిని స్తుతించిరి. జగదాధారా! భక్తాభీష్టవరదా! భక్తుల సర్వస్వమయినా ప్రభో నీకు జయము. హే కరుణాసింధో, త్రిగుణాతీత, సగుణ సర్వజ్ఞ నీకు జయము. స్వామీ మేము ఆపదలలో నున్నపుడు ఎవరిని భజించవలయును? ఈశ్వర చరణారవిందములను భజింతుము. అందువలన ఏమగును? విష్ణువు మొదలుగాగల సర్వ దేవతలు ఆజ్ఞావర్తులగుదురు. ఉపనిషద్వాచకుడగు చంద్రమౌళి నా మనోవాంఛ నెఱవేఱ్చుటకు నా హృదయ గుహయందు నివశించుగాక. సత్య, జ్ఞాన, అనంత, బ్రహ్మరూపుడగు వాని వలన పంచభూతములు, అన్నము సృజింపబడి మరల వానిలోలయమగుచున్నవి. అట్టి త్రిగుణాతీతుడు నా ముందు కన్పించుచున్నాడు. నా పూర్వపుణ్యముచే నా తపము ఫలించినది. ప్రభో నన్ను కరుణించుమని ఆనంద పారవశ్యమున హిమవంతుడు దేహభావన మరచి నాట్యముచేసి సర్వప్రాణుల అంతర్గతుడవైన నిన్ను నేనేమి వరము కోరగలను. నా మనమున గల కోరిక నీవెరుంగనిది కాదు. గాన దనిని నెరవేర్చుమని వేడెను.

పరమశివుడు సంతుష్టుడై హే పర్వత రాజా నీ కోరిక నేనెరుంగుదును. నీవు పర్వత రాజులలో శ్రేష్టుడవగుదువు. దినిని అందరునూ అంగీకరింతురు. నీవు నాకునూ పుజ్యుడవగునట్లు చేయుదును. నా భక్తాగ్రగణ్యులే నాకిష్ఠులు కనుక నీ శిఖరములలో బదరీనామ శిఖరమును నా ఆశ్రమముగా చేసికొందును. కలగతిన జగదంబ నీకు పుత్రిక కాగలదు. తన పూర్వ తండ్రిని నిరశించి వదలివేయుటచే నీకు పుత్రికగా జన్మించగలదు. ఆమెను నాకు వివాహము చేయుటచే నాకు పూజ్యుడవగుదువు. బ్రహ్మాది దేవతలందరును నిన్ను కీర్తింతురు. ఈ బ్రహ్మ కల్పము తర్వాత నీవు ముక్తుడవై నా పదము పొందుదువని వరమొసగి వెంటనే హిమాలయ బదరీ శిఖరమున వసించెను. వెంటనే విష్ణుమూర్తి నర, నారాయణ రూపములు ధరించి, శివును సేవించుటకు ప్రతి దినమునూ ఆ శిఖరమునే తన నెలవుగా చేసికొనెను. ఈ శివలింగ దర్శనమున జీవులకు విదేహముక్తి గల్గి యోగులకునూ దుర్లభమగు శివపద ప్రాప్తిగల్గును. ఇది గ్రహించిన ముముక్షువులందరునూ తండోప తండములుగా ఈ పర్వత శిఖరము దర్శించి ముక్తులగుచుండిరి. ఈ పర్వత దర్శనమున ధర్మార్ధకామమోక్షబీజములు వెంటనే ఫలించుటచే ఈ క్షేత్రము కేదారము అనగా శీఘ్రఫలదాయక భూమియని ప్రశిద్ధిగాంచినది. జగద్వఖ్యాతమయిన కేదార పర్వత దర్శన కేదార లింగార్చనవలన పునరావృత్తి రహిత మోక్షము ప్రాప్తించినది.

మహాకైలాసమున ఒకపరి బ్రహ్మ కేదారము దర్శించి ముక్తులై కైలాసము చేరినవారి హృదయకమలమున మహాలింగ దర్శనము చూచి పరమానందముతో తానునూ కేదార దర్శనమునకు రాగా అక్కడ లింగమున శివదర్శనము కాలేదు. ఆశ్చర్యముతో అటునిటు పరుగెత్తి వెతుకదా అక్కడ ఆవులమందులో దాగి శంకరుడు వృషభరూపమున దర్శనమొసగెను. అప్పటినుండి కేదారలింగమున శివదర్శనము నిల్చిపోయినది. దానితో కేదార దర్శకులకు సద్యఃముక్తియు నిల్చిపోయినది. కాని అక్కడ ప్రాణత్యాగము చేసినవారు, రేతోదక జలపానము చేసినవారు మాత్రము ముక్తులగుచుండిరి.

శివుడు కేదార పర్వతమునుండి కాశీచేరినందున విశ్వేశ్వర నగరమగుటచే కాశీ ద్విగుణీకృతముగ ధర్మార్థ కామమోక్ష ఫలదాయినియు సద్యోముక్తి దాయినియు మాత్రమే గాక, కేదార పర్వతమునకంటె మిక్కుటమగు ఫలప్రదాయిని అయినది. కేదార పర్వత యాత్ర మోక్షదాయిని. కాశీ కేదార దర్శన, స్పర్శన, అర్చనములు అనాయాస ముక్తిదాయకములు. మహాదేవుని తారక మంత్రోపదేశముతో క్షణములో జీవి కాలభైరవ దండన లేకనే ముక్తిపొందును. 50 కోట్లయోజనముల విస్తీర్ణముగల భూమండలమున కాశీ విలక్షణమయినది. శివానుగ్రహముగలవారు కాశీలో మరణించి శివపదము పొందుదురు. శివజ్ఞాన రహస్యము కేవలము శివునికి మాత్రమే తెలియును. ప్రియసతి గౌరీమాతకు తెలియును. కుమారస్వామి ద్వారా సనత్కుమారులు తెలిసికొన గల్గిరి. కేదారనామోచ్ఛారణయు శివప్రీతికరమై కాశీవాసఫలితమొసంగును. కాశీవిశ్వేశ్వరునికిని, కేదారేశ్వరునికిని భేదములేదు. ఇట్టి కాశీ కేదార మహిమను వినినఋషిపుంగవులు పులకాంకితులై నిశ్చల ధ్యాన నిమగ్నులైరి.

Wednesday, April 29, 2009

28 వ అధ్యాయము

మహర్షులిట్లనిరి. శివజ్ఞాన సముద్రులగు ఓ సూతా! మీ ద్వారా ఈశ్వరుని లోక తారక రహస్యము వింటిమి. భక్త వత్సల కేదారేశ్వర మహిమ, ప్రాచీన మణికర్ణిక యొక్క గుప్త అద్భుత ప్రభావము, విశ్వనాథ, మణికర్ణికల ప్రభావము, నిత్య యాత్రా విధానము, ఢుంఢిరాజు, ఓంకారాది మహా లింగముల విభవము, జ్ఞానవాపి మొదలగు తీర్థముల అద్భుత మహిమ, పంచ క్రోశములోని లింగములు, శివగణములు, శివయోగుల చరితము, శివాపరాధ భ్రష్టులై కల్పాంత పాప భోగులను గూడ శివ ప్రసాదము తరింపజేయు రహస్యము, అసాధ్యమగు శివాపరాధ నిష్కృతి మొదలగునవి వింటిమి. ఇదంతయు శ్రీకేదారేశ్వరుని విలక్షణ కృపావిశేషము. మేము భక్తిపూర్వకముగ తీర్ధయాత్రలు చేసి యుంటిమి. కాని కేదార మహిమ వినియుండలేదు. కనుక మీరు దయతో మాచే యాత్ర చేయించుడు. గుప్తతీర్థ స్నాన, కేదారేశ దర్శనములచే మమ్ము కృతార్ధులను చేయుడు. మీరే మా పాలిట తారకులు. అని ప్రార్ధించి నైమిశారణ్య వాసులగు మునిగణము, శౌనకాది ఋషులు సూతునితో కాశీ యాత్రకు బయలు దేరిరి.

కేదారనాథ, విశ్వనాథులు, మణికర్ణికలను మనమున తలంచుచు మనో వేగమున కాశికి చేరిరి. మణికర్ణికలో స్నానమాడి విశ్వనాథుని పూజించి, ఢుంఢిరాజు, ఓంకారేశ్వరాది మహాలింగములు, జ్ఞానవాపి, పంచ క్రోశలింగములు ప్రదక్షిణచేసి కేదారము చేరి, ప్రాచీన మణికర్ణికలో విధివిధానముగ స్నానమాడి, కేదారేశ్వరుని రుద్ర పారాయణతో అభిషేకించి, సూతునితో సహా ఆనంద సముద్రమున ఓలలాడిరి. కేదారేశ్వరుని సన్నిధిన సత్కథా కాలక్షేపముతో సూతునిట్లు కీర్తించిరి.

గురువరా! మేము ధన్యులమైతిమి. మా తపము ఫలించినది. మీ కథా సారాంశము ద్వారా లోకమున రెండు సుప్రసిద్ధములు గా తెలిసికొంటిమి. మొదటిది ప్రాచీన మణికర్ణికా స్నానము, రెండవది కేదారేశ్వరుని అర్చించుకొనుటు. మా పుణ్యమున మాకు రెండును ప్రాప్తించినవి. కాశీక్షేత్ర దర్శనము బహుళఫల ప్రదము. ఇక్కడ భైరవయాతనకూడ లేదు. ఇక జీవన్ముక్తులనై మేము ఇక్కడే నివశింతుము. కాని ఒక్క సందేహము నివారింపుడు. స్వామీ, ధర్మము ఫలించు స్థానములు చాలా గలవు. అర్ధము నిచ్చు స్థలములునూ చాలా గలవు. చతుర్విధ పురుషార్ధములనొసగు శివక్షేత్రములు గలవు. తీర్థ క్షేత్రములు గలవు. స్వయంభూలింగములు, దివ్యమూర్తులలో గణేశ, దుర్గ, విష్ణు మొదలుగా గలవి అనేకములు. సర్వకామ్యార్ధ సిద్ధిదములు. ఇవి మోక్షప్రదములెట్లగును? జీవులు అనాది అవిద్యా వాసనవలన బంధితులు గదా? స్వాత్మజ్ఞానము కల్గనిదే మొక్షమెట్లు సిద్ధించును. అనేక జన్మల పుణ్యమున శాస్త్ర, వేదాంతముల తెలిసికొనవలయునను ఇచ్ఛ జనించును, వేదాంత శ్రవణమున, మనన, నిధి ధ్యాసలు, అవశ్యమని తెలియును. అట్టి నిధి ధ్యాసవలన భగవానుడే గురురూపియై ధృఢభక్తుల ఆగామి, సంచిత పాపముల నిర్మూలనకు ఉపదేశము చేయును. కాని ప్రారబ్దము అనుభవించి తీరవలయును. ఎట్టి యోగులునూ ప్రారబ్ద క్షయమగువరకూ అజగర వృత్తితో దేవధారులై యుండవలసినదే, ప్రారబ్ద క్షయమయిన తర్వాతనే విదేహ ముక్తియని శృతి వాక్యము గదా! మరి సాధారణ జీవులకు ముక్తి ఎట్లు సాధ్యము? అనాదిగా జీవులు అవిద్యా పాశబద్ధులై యుందురు గదా! అట్టివారికి స్వాత్మ జ్ఞానములేక ముక్తి ఎట్లు సాధ్యము? భగవంతుని యడల అనన్య భక్తి గల్గి, వారికి గురువే దైవమై గురు శుశ్రూషచే వేద, శాస్త్రములు నేర్చి, నిరాతంకులై సుఖదుఃఖములు, శత్రు మిత్రులు, మానావమానములు సమానములై జీవభావము వదలి, ఆత్మానుసంధానులై కొందరు ముక్తికి అర్హులగుదురు, కాని సాధారణ మానవులెట్లు ముక్తి బడయుదురు? ఈ సంశయము నివారింపమని మునులు సూతుని కోరగా సూతుడిట్లు వివరించిరి.

మునులారా మిమ్ము సంపూర్ణ సంశయ రహితులను చేయుటకు విశ్వేశ్వరుడే సమర్ధుడు. కాని నాకు మా గురుదేవులు బోధించిన విధముగా మీకు తెల్పెదను వినుడు. పరమేశ్వరుడు సర్వ సమర్ధుడు. అందరి హృదయములో ఆత్మగా తానే యుండి లీలగా ఆడించుచున్నాడు. కర్తుం, అకర్తుం, అన్యధా కర్తుం సమర్ధుడు. ప్రతిజీవియందును స్వాత్మ జ్ఞానము అంతర్లీనముగ గలదు. కాని మాయా వరణముచే జీవులలో అది వెలువడుటలేదు. శాస్త్ర విద్య వలన అవిద్య నిర్మూలనమై భగవదంశ ప్రకాశితమై కాశీ స్ఫురణ గల్గి, సాధారణ జీవులు ముక్తికి అర్హులగుదురు. కాశీ ప్రాప్తితో ముక్తి నిశ్చయమని వేదవాక్కు. ఒక్కమారు కాశీ దర్శించినను క్రమముక్తి గల్గును. సామవేదగానము చేయుచు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తుల తర్వాత సంకల్ప మాత్రమున సర్వభోగములు ప్రాప్తించి, సర్వ సుఖములననుభవించిన తర్వాత విరక్తులై ఆత్మానుసంధానముతో సాయుజ్య ముక్తి బొందుదురు. అట్టి సాయుజాయము కాశీలో దేహత్యాగముచే కల్గును. ఇందు సంశయము లేదు. ఇతర పుణ్య తీర్థ, క్షేత్రములయందు గల్గు ముక్తికి విలక్షణముగా కాశీలో సద్యఃముక్తి గల్గును. పాపులకును, ప్రారబ్దవశమున అనుభవింపవలసిన కర్మ ఫలమంతయునూ తుది శ్వాస విడుచు సమయమున క్షణకాలములో భైరవదండన రూప ప్రక్షాళనతో, శంకరుడు తారకమంత్రోపదేశము చేసి ముక్తి నిచ్చును. ఇది మరెక్కడనూ సాధ్యము కాదు. శివానుగ్రహమున కాశీవాసులలో ధర్మలోపము జరుగదు. కాశీకేదార క్షేత్రమందు అట్టి భైరవ యాతన కూడ లేకనే ముక్తి గల్గునట్లు శివాజ్ఞ. శివాజ్ఞ వలన బ్రహ్మాండము పిండాండమగును. అట్లే యుగముల పర్యంతము ఎన్నో జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకము ప్రాణోత్క్రమణ సమయమందు క్షణకాలమున భైరవుడు అనుభవింపజేయుటలో సంశయమేమిగలదు. జ్ఞానాదేవతు కైవల్యమనునది వేదోక్తి. అట్టి జ్ఞానము ఏ జీవికైనను తారక మంత్రోపదేశ రుపమున సాక్షాత్ శివుడే కల్గించునపుడు ఇక సాయుజ్యముక్తి గాక మరి ఏ ముండును? కాశీలో కేదార క్షేత్రము విశేష ఫలదాయకము. కేదార నామము ధరించుటయు కళ్యాణ ప్రదము. మహాపుణ్యవిశేషమున మనకు కాశీ దర్శన ప్రాప్తియు మీరు నన్ను పరి ప్రశ్నించుటయు, నా గురువు వ్యాస భగవానుని అనుగ్రహమున నేను తెలిసికొనిన కాశీ మహాత్మ్యమును సత్సంగరూపమున నేను మీకు వినిపించుటయు జరిగినది. సత్సంగము వలన ధర్మార్ధకామమోక్షములు నిశ్చయముగ ఫలించును. ఇది నిశ్చయము.

Friday, April 24, 2009

27 వ అధ్యాయము


మహర్షులు సూతుని, వ్యాస భగవానుని ప్రియశిష్యులు, జ్ఞానసముద్రులగు మహాత్మా! అంబిక పరమాత్మ నడిగిన రహస్యమును వివరింపుడని కోరగా సూతుడు వారికిట్లు తెల్పిరి.

దేవీ నా పూజా పుణ్యవశమున ఈ హంసల జంట బ్రాహ్మణ యోనియందు జన్మించి సుఖశర్మ యనునామముతో నిర్దోష భక్తితో మనలము పూజించి సుఖములకు నాధుడైనందున నాథశర్మగా ప్రసిద్ధి చెందును. నిర్దోషురాలగు అతని భార్య అనవద్య పేరుతో ప్రసిద్ధి చెందును. వీరు బ్రహ్మవేత్తలై నా క్షేత్రములన్నిటిని సేవించి శివతత్వమును కార్తికేయుని ద్వారా తెలిసికొని, అన్ని క్షేత్రముల మహాత్మ్యమును గ్రహించి త్రికాల జ్ఞానులై అహంగ్రహోపాసనద్వారా దేహాభిమానము వదలి ఆత్మానుసంధానులై మనమే వారుగా భావించి అనవద్య ఉమగాను, నాథశర్మ మహేశ్వరుడుగాను కైలాసము చేరుదురు. మనము వారిలో లీనమగుదుము. ప్రమధగణములతో సేవలందుకొందురు. మనభక్తులవైభవమును దర్శించి ఆనందమనుభవించెదము. అనేక బ్రహ్మ కల్పముల తర్వాత, విష్ణు కల్పమారంభమగును. అనేక విష్ణు కల్పముల తర్వాత రుద్ర కల్పమగును. అపుడు మనము మహాకైలాసమున కేగెదము. ఉమామహేశ్వరాత్మక కల్పమువరకు వీరు మనవద్ద ముక్త స్థితులై మనలో లీనమగుదురు. జగద్వ్యవహారము కొరకు మనము క్షణికలీల, నిత్యలీల, మరియు భక్తులను ఉద్ధరించుటకు దీర్ఘలీలలు నిర్వహింపవలయును. భక్తులను తృప్తులను చేయుటయే లీలావిశేషము. భక్తశులభుడగునేను శంభువిజ్ఞానుని ఆశీర్వాదము నెఱవేర్చుటకు ఈ దంపతులకు ఇన్ని జన్మలలో క్రమక్రమముగా వీరినిట్లు ఉద్ధరించ వలసివచ్చినది.

ఇట్టి వృత్తాంతమును శివునివద్ద తెలిసికొని పార్వతి సంతసించి స్వామికి నమస్కరించి ఆ హంసలను కృపాదృష్టితో దీవించి వృషభవాహనారూఢులై పార్వతీ పరమేశ్వరును మహాకైలాసమునకేగిరి. కాలగమనమున ఆ హంసలు వేదశాస్త్రార్ధసంపన్నులగు బ్రాహ్మణ కుటుంబములందు జన్మించిరి. దంపతులై యోగ ప్రవృత్తులై అనవద్య, నాథశర్మలుగా ప్రసిద్ధులై అనేకానేక శివక్షేత్రములు దర్శించి, కాశి, కేదార, నేపాల, గోకర్ణ, భువనేశ్వర, శ్రీపర్వత, త్ర్యంబకేశ్వర, విరూపాక్ష, కాళహస్తి, కంచి, శోణాద్రి, అంధకాసుర, సుదనేశ్వర, గోపర్వతేశ్వర, నవనీతేశ్వర, వృద్ధగిరీశ్వర, శ్రీమచ్ఛిదంబర సభ, బ్రహ్మేశ్వర, వైద్యనాథ, ఛాయావన, శ్వేతవన, అమృతకుభ, త్రయీవన, వాల్మీక, శ్రీవాంఛ, మధ్యార్జున, మయూరనాథ, పంపాపురి, వాతపురి, సేతునాథ, బలేశ్వర, నందీశ, శాలివాటి, శ్రీమద్బలాస్యనాధ, శ్రీకంఠ, మాతృభూతేశ, జంబీశ, బృహదీశ్వర, పంచనద, కుంభకోణ, వటకానన, హిమాచల, విధ్యగిరి, గుహ్య, మలయ పర్వతములు, గంగ పూర్వాపరములు, యమున పూర్వాపరములు, నర్మద, గోదావరి, కృష్ణవేణి, క్షీరనది, పినాకిని, హరితపురి, సంక్షేపముగ హిమాలయ, సేతుబంధములమధ్యగల మఖిలశివ క్షేత్రములు, మరుద్వధ, పూర్వాపరములతర్వాత, తాలకాననము చేరిరి. అక్కడ తాలవనేశ్వరుని పూజించి రాత్రికి అక్కడ విశ్రమించిరి. తాలవనేశ్వరమహేదేవుడు భక్త రక్షణకొరకు రక్తవర్ణ, ఆకుపచ్చ జటలతో అక్కడ కొలువుతీరినాడు. ఈ దంపతులు మహాదేవుని, నిర్మల భక్తితో ప్రార్ధించి తమను ఉద్ధరింపమని వేడగా, వారి స్వప్నమందు దర్శనమిచ్చి ప్రేమపూర్వక గంభీర స్వరముతో భక్తులారా! ఈ పర్వతపు నైఋతి కోణమున కావేరికి ఉత్తర తీరమున మీరు వెళ్ళి కార్తికేయుని ద్వారా ప్రణవజ్ఞానమును ఉపదేశము పొందుడు. ఆ నిర్ద్వంద శివ జ్ఞానముతో నా పదము జేరుదురు అని పల్కి అంతర్ధానము జెందేను.

తెల్లవారగనే దంపతులు లేచి మహాతీర్థమున స్నానమాడి, భస్మ రుద్రాక్ష ధారులై త్రిపుండ్రములు ధరించి పంచాక్షరి జపించి, రుద్రపారాయణ చేసి, పార్వతీ పరమేశ్వరులను మనసా స్తుతించి మీ ఆజ్ఞచే మేము వెళ్లి కార్తికేయుని ప్రార్ధించి వారి ఉపదేశము పొందుదుము, దయతో మీలో చేర్చు కొనుడని ప్రార్ధించి బయలుదేరి ధృడనిశ్చయముతో కార్తికేయుని పుర్వ భక్తులు అగస్త్యాది ఆచార్య వర్యులను చేరి నాల్గుదిక్కులు ప్రదక్షిణ చేసి నైఋతి కోణమున స్కందుని ఎదుట నిలిచి చేతులు జోడించి, స్వామీ మేము మీ శరణు జొచ్చినాము, దయతో మాకు దీక్ష నిచ్చి, మీ అధీనులమయిన మాకు సదా మీ పాదాబ్జముల సేవాభాగ్యము అనుగ్రహింపుడని దీనముగా ప్రార్ధించిరి. అపుడు కార్తికేయుడు తృప్తుడై వారితో ఇట్లనెను.

మీరు శివాజ్ఞచే నావద్దకు వచ్చిరి. పరశివ మహిమా రహస్యమును మీకు అనుగ్రహించితిని. ఈ క్షణమునుండి అఖిల శివజ్ఞాన ఆనంద బోధమీపరమైనదని ఆశీర్వదించిరి. ఆ దంపతులు పరమానందముతో షణ్ముఖుని కీర్తించి మనసా, వాచా, కర్మణా వారు తమ సర్వస్వము స్వామి కర్పించుకొని లీలా వినోదముగా శివక్షేత్ర దర్శనము కొరకు బయలుదేరిరి. కార్తికేయుడు మరల వారినుద్దేశించి, భక్తులారా! పూర్వజన్మలలో మీ ద్వారా కించిత్ శివాపరాధము జరిగిన కారణముగా, దాని నిర్మూలనతో సంపూర్ణ ఫలితమునకు మీరు వెంటనే కాశీ కేదార గుప్త తీర్థ సేవనము చేసి పరమ పదము పొందుడనెను. వెంటనే వారు కుమారస్వామి ఆజ్ఞ శిరసావహించి దారిలోని శివ క్షేత్రములను దర్శించుచు, వాని మహాత్మ్యమును గ్రహించి స్తుతించుచు చివరకు కాశీ కేదార క్షేత్రము చేరిరి. విశ్వేశ్వరాది సర్వదేవతలను, ఒంకారాది సర్వలింగములము, జ్ఞానవాపి మొదలగు తీర్ధములను సేవించుకొని పంచ క్రోశయాత్రలోని సర్వదేవతలను పూజించి చివరగా కేదార గుప్త తీర్ధము చేరి విధి పూర్వకముగా స్నానమాడి, పూర్వ జన్మలలోని శివాపరాధము, శివ జ్ఞానయోగులయడల తాము జరిపిన అపరాధములనుండి ముక్తులై, దీక్షా గురు శ్రీకార్తికేయ ముఖకమలమునుండి గ్రహించిన ఉపదేశమును విధివిధానముగా సాధన చేయుచు పరమేశ్వరుని యందు చిత్తము ఏకీకృతమొనరించి ఎండిన మానులవలె నిశ్చలమైన వారి నిరంతర తైలధారాపూర్వక ధ్యానమునకు సంతసించి పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై వారికి తమ దేహముల నొసంగిరి. వారి అంశమును ఆ దంపతుల దేహములందు ప్రవేశింపజేసిరి. రుద్రకల్పము వరకు వారు దేహ ధారులై, కల్పాంతమున విదేహముక్తి బొందిరి.

కేశీ కేదారేశ్వరుని మహిమ అట్టిది. శివపార్వతుల లీలలు అపారము. మునులారా వినుడు, నా సద్గురు కృపచే నాకీ వేదరహస్యము బోధింపబడినది. నాథశర్మ, అనవద్యల జన్మవృత్తాంతము వినినవారికి జ్ఞానాంకరము ఉదయించి, మాయా వృతము విడివడి పక్వమైన ఫలము చేతికంది ముక్తులగుదురు. ఈ సద్రహస్య అమృతభాండమును మీకందించు సంకల్పము నాకు కల్గుట నాభాగ్యము. సంసార సముద్రమును అవలీలగా తరించు రహస్యము గ్రహించితిరి. ఉమాకాంత స్మరణతో మునులు సూతుని స్తుతించి, గురుదేవా! మాకు అనేక శివకథలు వినిపించితిరి. క్షేత్రమహిమలలో భేదము, భక్తులనుద్ధరించుటలో భేదము, రాజుల మనోవృత్తులలో భేదము, బ్రహ్మ సృష్టిలోనే భేదము. ఇవన్నియూ పూర్వాపరములెట్లు తెలిసికొనగలము? మీరు పౌరాణికిలుగా సకల పురాణముల వచించితిరి, ఈ భేదమెట్లు కల్గినది? ఇతిహాసములు జగత్ సత్యముగా భాసింపజేయుచున్నవి, సృష్ఠి, స్థితి, లయములలో కల్పభేదములు తెలియుచున్నవి? ఈ సంశయమును మానుండి దూరముచేయుడని కోరిరి.

అపుడు సూతుడు, మునులారా! ఒక్కొక్క కల్పమందు పరమాత్మ లీలా విశేషములు భిన్నముగా యుండును. బ్రహ్మాది కీట పర్యంతము వారి సంచిత పుణ్య పాపముల ననుసరించి భేదములు కల్గుచుండును. పురాణములలో భేదమున్నట్లు కన్పించునేగాని, వస్తుతః అట్టి భేదమేమియు లేదు. శాస్త్రములన్నియూ సత్యములే. కలగతి ననుసరించిన భేదమేకాని, శివమహిమలో మార్పులేదు. బుద్ధిమంతులు ఆదినుండి అంతము వరకు సవిస్తరముగ గ్రహించిన యడల ప్రేమ పూర్వకముగ శివుని భజించుట ద్వారా గ్రహించగలరు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా! సంశయము విడిచి అన్ని విచిత్రకథలలోని తాత్పర్యము శివధామము చేరు మార్గము భక్తి ఒక్కటిగానే గ్రహించుడు. ఈ కథము విన్నవారు సద్గతిని బొంది శివధామము జేరుదురు.

Wednesday, April 22, 2009

26 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూతుని, సత్యవతి పుత్ర వ్యాసభగవానుని ప్రియశిష్యులు, సర్వజ్ఞానులు, మీరు వినిపించు అమృతమును గ్రోలి మేము ధన్యులయగుచున్నాము. మహాత్మా ఇంతవరకు అనవద్యకు నాథశర్మ చెప్పిన దానిని మీరు మాకు వివరించుచున్నట్లు తెల్పుచున్నారుగదా! ఆ అనవద్య నాథశర్మలను శివజ్ఞాన దురంధరులు ఎవరు? వారి పూర్వజన్మ వృత్తాంతమేమి? వారికట్టి జ్ఞానమెట్లబ్బినది? వీనిని సవివరముగా తెలియజేయుడని ప్రార్ధింపగా సూతులవారిట్లు తెల్పిరి. నేనుకూడా ఈ రహస్యమును మా గురువునడిగి తెల్సికొంటిని. భగవాన్ బాదరాయణులు నాకిట్లు తెల్పిరి.

పూర్వకాలమున మానససరోవరమునందు ఒక హంసమిధునము విహరించుచుండెడిది. అవి అన్యోన్యప్రేమతో ఆనందముగా యున్నవి. ప్రతిదినము ప్రాతఃకాలమున, ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయమునకు పూర్వము, కాయంత్రము, రాత్రి ఇట్లు షట్కాలములయందు ఆ సరోవరములోని తామరతూడులు తినుచు, రాత్రికి సరోవరము ఒడ్డునగల వటవృక్షమున అవి ఏర్పరచుకొనిన గూటిలో నిద్రించుచు కాలము గడుపుచున్నవి. యక్షరాజు కుబేరుడు తన స్త్రీలతో నిత్యము మానస సరోవర ప్రాంతమున విహరించి, అందు స్నానమాడు, హంకలు కాపురముచేయు అదే వటవృక్షముక్రింద శివార్చనకై రత్న నిర్మిత శివలింగము ప్రతిష్టచేసికొని, భస్మరుద్రాక్షధారుడై ఆలింగమునర్చించిన తర్వాత తన స్త్రీలతో తననగరము అలకాపురికి వెళ్ళుచుండెను.య హంసలు ఆహారమునకై సరోవరములోని స్వర్ణకమలములు వాని తూడులతో సహా చెట్టు పైకి తెచ్చుకొని షట్కాలములయందు వాని ముక్కులతో తూడులుతెంపి, స్వర్ణకమలములు క్రిందకు వదలు చుండినవి. ఆ కమలములు సరాసరి క్రిందనున్న రత్న లింగముపై పడి, ఆ పక్షులకు తెలియకయే షట్కాల శివ లింగార్చన స్వర్ణపుష్పములచే జరుగుచుండెను. తర్వాత హంసలు ఆ తూడులను తినుచుండెను. ఇట్లు నిత్య శివార్చన తర్వాత ఆహారము తీసుకొనుచున్న ఆ హంకలజంట కొంతకాలము జరిగిన తర్వాత, పార్వీ పరమేశ్వరులు, గజానను, షడానన, సర్వగణ సమేతులై వృషభారూఢులై మానస సరోవర తటమున విహారమునకు వచ్చిరి. వటవృక్షము క్రింద రత్న శివలింగముపై నాళరహిత స్వర్ణకమలములు ఒక్కొక్కటిగా పడుచుండుటచూచి, పార్వతి విష్మయమున శివునితో నాథా! ఇదేమి వింత? ఆకాశమున గాని, ఈ ప్రాంతమున గాని ఎప్పరునూ కన్పించుటలేదు, సహస్రనామార్చన చేయుచున్నట్లు ఈ స్వర్ణకమలార్చన ఎట్లు చరుగుచున్నదని అడుగగా, స్వామి నవ్వుచూ పార్వతీ సృష్ఠియందు ప్రాణుల గతి విచిత్రముగా యుండును. అది వాని కర్మపై ఆధారపడి యుండును. సత్కర్మకు సద్గతి, దుష్కర్మకు దుర్గతి కల్గును. కర్మఫలమనుభవించి ఆ జీవి ఆయుర్దాయము పూర్తికాగా యింకనూ కర్మఫలము మిగిలినచో మరల జన్మించవలయును. ఈ విధముగా జీవులు జనన మరణ చక్రమున తగుల్కొని పరిభ్రమించుచున్నారు. ఇది విచిత్రము. ఈ వటవృక్షముపైన చివర కొమ్మలలో ఆకులలో దాగి ఒక గూడు కన్పించుచున్నది చూడుము. అక్కడనుండి ఈ మహాలింగార్చన జరుగుచున్నది. అని శివుడు చెప్పగా పార్వతి ఆశ్చర్యముతో పైకి చూడగా వృక్షముపైనున్న గూటినుండి పుష్పవర్షము కురియుచున్నది.

అపుడు పార్వతి స్వామితో నాథా! పక్షులలో ఇట్టి దుర్లభమగు అనన్య భక్తి ఎట్లు సాధ్యము? ఈ పక్షులు ఈపూజ తెలిసి చేయుచున్నవా? లేక తెలియక యధాలాపముగా జరుగుచున్నదా? విధి వశమున జరుగుచున్నదా? నాకు వినకుతూహలముగా యున్నది. ఇవి భక్తితో చేసినచో తప్పక శివపదము బొందగలవు. తెలియక చేసిననూ ముందు జన్మలలో సద్గతి కల్గును. లేక పూర్వజన్మ సుకృతమున ఇట్లు జరుగుచుండవచ్చును. ఎట్లయిననూ జంతువులకు దుర్లభమయిన మీ పూజ జరుగుచున్నది. దీనివలన అవి తరించుట నిశ్చయము. కాన స్వామీ నాకు వివరముగా తెల్పుడు. పూర్వజన్మలలోని ఏ పుణ్యమున మీసేవా భాగ్యమబ్బినది? ఏపాపము వలన వీటికి పక్షిజన్మ కల్గినది? మీ లీల విచిత్రముగదా!

దేవీ వినుము. వీని పూర్వజన్మ విశేషము, నా పూజా ప్రభావము తెల్పుచున్నాను. భ్రమరాంబా సమేతుడై శూలపాణి విహరించిన మల్లిఖార్జున స్థానమగు శ్రీపర్వతమున ధర్మగుప్తుడను శివజ్ఞాని నివశించుచుండెను. అతడు త్రికాలములయందు మల్లిఖార్జునుని సేవించుచుండెను. ఒకలేడి సమీపమందలి వనములనుండి పారిపోయివచ్చి ధర్మగుప్తుని ఆశ్రమమునకు చేరెను. అతడు దానిని చూసి పుత్రవాత్సల్యముతో దానికి పచ్చి గడ్డిపరకలు, నీరు అందించుచు కాపాడుచుండెను. అతనితోపాటుగా ఆ లేడిపిల్ల అక్కడి బ్రాహ్మణుల కూటీరములలో తిరుగుచు, అతనితోపాటు త్రికాలపూజలకు భ్రమరాంబా, మల్లిఖార్జునులను దర్శించుచుండెను. పూజముగియగనే ధర్మగుప్తుడు ఆ హిరణమునకు, శివ ప్రసాదము భస్మమును చల్లి, అమ్మవారి ప్రసాదము పుష్పములు అలంకరించుచుండెను. ఒకరోజు ఆ మగలేడి తనసహవాసము కొరకు వనమునుండి మరియొక ఆడలేడిని తెచ్చుకొని రెండునూ ఆడుకొనుచు, తిరుగుచు బ్రాహ్మణునకు ఆనందము కల్గించుచుండెను. ఒకనాడు ఆశ్రమ గోవులతోపాటుగా ఆ లేడి జంట వనమునకు వెళ్లి మరల తిరిగి రాలేదు. ధర్మగుప్తుడు విచారముతో వనమంతయూ వెతికినను అవి కన్పించనందున అవి ఏమైయుండును? వేటగాండ్రు ఎవరయిన చంపి తీసికొనివెళ్లిరా? సరస్సులో నీరుత్రాగుటకు వెళ్లి పడిపోయినవా? కొట్టుకొనిపోయినవా? అడవి మృగములబారి పడినవా? నేనెంత మూఢుడను, వానిని పెంచితినేగాని రక్షింపలేకపోతిని. అవి చనిపోయినచో నాకు హత్యాదోషమాపాదింపబడునేమో? ఏమైననేమి చేయగలమని మిన్నకుండెను.

కాలగతిన ఆ లేడి జంట చనిపోయి, వాని పలకునికి క్లేశము కల్గించిన కారణమున మరుజన్మలో వింధ్యపర్వతముపై కిరాత భార్యాభర్తలైరి. ధర్మగుప్తునిచే నిత్యము శివపూజా భస్మము, నిర్మాల్యపుష్పముల అలంకరణచే ఆ మిథునము ఆ బ్రాహ్మణునితోసహా శివపదము చేరియుండవలసినదే, కాని పూర్వజన్మ దుష్కృతముచే విఘ్నము గల్గినది. ఆ విషయము కూడ తెల్పుదునని శివుడు పార్వతి కిట్లు తెల్పెను.

అంతకు పూర్వజన్మలో ఈ లేడి మిథునమే ప్రభాస తీర్థమున బ్రాహ్మణ దంపతులు. ఇద్దరునూ దుష్టులే. దొంగతనము చేసి పొట్ట పోసుకొనుచుండిరి. అక్కడ శంభువిజ్ఞానవంతుడను ఒక శివజ్ఞాని యోగి యుండెడివాడు. ఒకనాడు ఈ దుష్ట బ్రాహ్మణ దంపతులు ఆ శివజ్ఞాని సొమ్ము అపహరించి దొరికిపోయిరి. కాని ఆ యోగి వారిని మందలింపక దయతో అతని యింటిలోనే పనిచేయుటకు నియమించుకొనెను. వారు కొన్ని రోజులు అతనిని మంచి చేసుకొని కేవలు చేయుచు ఒకరాత్రి అతని డబ్బు, నగలు, వస్త్రములు మొత్తము దొంగిలించి ఆ ప్రక్క అడవిలోనికి పారిపోయిరి. అడవిలోని అసలు గజ దొంగలు వీరివద్దనున్న మొత్తము దోచుకొనిరి. ఈ దంపతులు వేరు దిక్కుగానక బిచ్చమెత్తుచు దేశదేశములు తిరుగజొచ్చిరి.

శివజ్ఞాని తన ద్రవ్యమంతయు అపహరింపబడినను, ఆ దంపతులను నిందింపక, వైరాగ్యముచే భోగభాగ్యములు క్షణ భంగురములయినను అజ్ఞానముచే వారట్లు చేసినందులకు వారిని క్షమింపమని భగవంతుని ప్రార్థించెను. వారు దుష్ట బుద్ధులయినను నా సేవ చేసిన సమయమున, నా దైవకార్యములకు కొంతయినను సహాయము చేసి యుండ వచ్చును గదా! ఆ కొద్ది పుణ్యమున వానికి మంచి జరుగు గాక! యని భగవంతుని ప్రార్థించిన కారణమున భక్త సులభుడగు పరమాత్మ తన భక్తుని కోరిక మన్నించుటకుగాని, ఆ దంపతులు చేసిన పాపములకు వారు ఒక కల్పకాలమునకును ఉద్ధరింపబడకపోయినను వారిపై కృపా దృష్టితో రెండు, మూడు జన్మల తర్వాతనే లేడి జంటగా అగునట్లు తలంచెను. మృగములుగా జన్మించినను పూర్వ జన్మ వాసనా ఫలమున వాటిని కాపాడి పోషించిన ఆ మునికి మనస్తాపము కల్గించి పారిపోయినవి. ఆ పాపమున మరుజన్మ కిరాత దంపతులైరి. కాని ఆ లేడి మిథునమునకు సద్గతి కల్గువలెనను ధర్మగుప్తుని కోరికపై కిరాత దంపతులకు మానస సరోవరమున జీవించు హంసల జన్మ కల్గినది. ప్రతి జన్మలోను ఈ దంపతులపై శివభక్తుల అనుగ్రహమువలన ఆ భక్తుల అభీష్టము నెఱవేరుటకై హంసలకు రత్నమయ శివలింగముపై స్వర్ణకమలములచే పూజచేయు భాగ్యమబ్బినది. కనుక వీటిక మరుజన్మలో నాపదమబ్బునని శివుడు పార్వతికి తెల్పెను.

ఈ కథ ద్వారా శివపూజ కన్ననూ శివభక్తుల సేవచే పరమాత్మ ఎక్కువ ప్రీతి చెంది సద్గతి కల్పించునని తేట తెల్లమయినది. పార్వతి పరమాశ్చర్యముతో నాథా! మీ కృపాపాత్రులైన మీ భక్తుల మనోభీష్టము నిర్వర్తించుటకు ఎట్టి పాపాత్ముల నయినను మీరు ఉద్ధరింతులు. మరి ఈ పక్షులు వాటికి తెలియకనే, వాటి పూర్వజన్మ పుణ్య విశేషములేకనే, వాటిపై మీ భక్తుల అనుగ్రహము వలన కల్గిన పుణ్యమువలన మిమ్ము పూజించు ఈ సత్కర్మ ఫలితముగా వారి మరుజన్మ ఏమగును, విన కుతూహలముగా నున్నదని పార్వతి చేతులు జోడించి, స్వామి చరణములకు నమస్కరించి ప్రార్థింపగా స్వామి సంతసించెను. మరల పార్వతి స్వామీ! మీ భక్తుల మహిమ అపారము. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల మహిమను కూడ నష్టపరచును. పర్వతములు వారికి దాసులు. సముద్రము నీటి బిందువంత యగును. కాలమే నష్టమగును. కైలాసము బంతి యగును. విష్ణు చక్రము కంఠమాల యగును. చంద్ర సూర్యులు వెన్నముద్దలగుదురు. త్రిమూర్తులు పసిపాపలగుదురు. జగత్తు తృణభంగురమగును. తృణమే వజ్రమగును. మీ భక్తుల మహిమ మీకు మాత్రమే తెలియును. గనుక ఈ పక్షుల మరుజన్మ ఏమగునని ప్రార్థించెను. ఈ ఆఖ్యానము శివభక్తి పూర్వకముగ వినినవారు పాప సముద్రమునుండి విముక్తులై శివధామము చేరుదురు.

Monday, April 20, 2009

25 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూత పౌరాణికుని ద్వారా చంద్రవాన్ అను రాజు వృత్తాంతము వినగోరి, మహాత్మా ఆ చంద్రవాన్ అను రాజు వామదేవ, సనత్కుమారులనుండి శివరహస్యమెట్లు తెలిసికొనెను. అతడెవరు? అట్లు శివరహస్యజ్ఞానము పొందియూ, కాశీని, కాశీలోని శివలింగములను ఏల నిందించెను. అయినను అతనికి శివానుగ్రహము ఎట్లు కల్గినది? వివరింపగోరగా సూతుడు చెప్పదొడగెను.

పూర్వకాలమున హిమాచల ప్రాంతమున నేపాల బ్రాహ్మణుడొకడు పశుపతినాధుని షట్కాలపూజలు చేయుచుండెను. అక్కడ శివతత్వజ్ఞాని శివశర్మయును ఒక బ్రాహ్మణుడు ఒడలంతయూ భస్మము ధరించి, నుదుట త్రిపుండ్రములు, మొడలో రుద్రాక్షమాలలు ధరించి సదాశివ పంచాక్షరీజపము, రుద్రపారాయణ చెయుచు నియమముగా త్రిసంధ్యలయందు శివలింగార్చన చేయుచుండెను. శ్రద్ధగా నిత్య నైమిత్తిక కర్మలాచరించుచు సదా పశుపతినాథునియందే మనసు లగ్నముచేసిన వాని కుటుంబమునకు సేవచేయుటకు అకలితో బాధపడు ఒక భిల్లుడు వారింట చేరెను. నిష్కపట భావముతో ఆ బ్రాహ్మణుడు చెప్పిన పనులన్నియూ చేయుచుండెను. ఒకసారి వేరుపనిలో నిమగ్నమయిన అతడు ఆ బ్రాహ్మణునికి నిందాపూర్పకముగా సమాధానమిచ్చెను. కాని శాంతపరుడయిన ఆ బ్రాహ్మణుడతనిని ఏమియు చేయక క్షమించియుండెను. పశుపతి నాథుడు ప్రసన్నుడై ఆకాశవాణి రూపమున ఆ బ్రాహ్మణునితో, భక్తా! నీ త్రికాలపూజలకు, భక్తి శ్రద్ధలతో నీవుచేయు శ్రౌత, స్మార్త కర్మానుష్ఠానములకు నేను తృప్తుడనయితిని. నీకు అవరోక్ష జ్ఞానము కల్గును, రాబోవు జన్మలో నీవు అట్టి జ్ఞానముచే నా పదము జేరుదువు అని పల్కగా ఆ బ్రాహ్మణుడు ఆకాశవాణి వాక్యమును శివాజ్ఞగా స్వీకరించి విరక్తుడై శరీరమును సుష్కింపజేసి తపోనిరతుడై ప్రాయోపవేశమున శరీరమును చాలించెను. అతడే మరుజన్మలో గర్గమహర్షిగా జన్మించెను. అతని పత్ని ప్రఖ్యాత ఉపనిషద్జ్ఞానవ్త్త బ్రహ్మవాదిని. యాజ్ఞవల్కాది మునులకును ఆమె వ్యాఖ్యానమును గ్రహించుట కష్టమయ్యెడిది. పూర్వజన్మమున కూడ వారు భార్యా భర్తలు. వారి సేవకుడగు భిల్లుడు మరు జన్మలో రాజుగా జన్మించి హిమాచల ప్రాంతమునకు రాజయ్యెను. అతడు బ్రాహ్మణుడు, ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు, కీర్తిమంతుడు. అనేక యజ్ఞములు చేసెను. గర్గముని తన త్రికాల జ్ఞానముచే ఆరాజు క్రితము జన్మలో తమ సేవకుడగు భిల్లునిగా గుర్తించి అతనిని ఉద్ధరింపనెంచి రాజుకడకు వెళ్లి ఆత్మజ్ఞానోపదేశము చేసెను. ఆ జ్ఞానముతో రాజు విరక్తుడై గర్గమునితో మహాత్మా నేను నాకుమారునకు రాజ్యమిచ్చి తపస్సుకు పోవుదును. తగిన స్థలమునిర్దేశించుడని కోరెను. గర్గుజు అతనిని కేదారము వెళ్లి తపమాచరింపమని చెప్పి, రాజా నీవు అచట తపస్సిద్ధి పొందుదువు. కాని నీ పుర్వజన్మకృత ప్రారబ్దమున ఒక ఉపాధి యున్నది. అది లేనియడల ఈ జన్మమందే ముక్తి గలదని చెప్పగా, రాజు స్వామీ ఆ ఉపాధికి కారణమేమని అడిగెను. గర్గముని రాజా నీవు పూర్వజన్మమందు ఒక శివజ్ఞాని బ్రాహ్మణుని ఇంట సేవకుడగు భిల్లుడవు. ఒకనాడు అన్యమనస్కుడవై యజమానిని నిందించితివి. ఆ దోషమున ప్రారబ్ది ఫలమునుభవింపక తప్పదని తెల్పెను. వెంటనే రాజు ఆ గర్గముని పాదములపై బడి విలపించి మహాత్మా మీరు తపోబల సంపన్నులు. నా ప్రాహబ్దమును తప్పింపగల శక్తి మీకు గలదు. కనుక నన్ననుగ్రహింపుడని వేడగా, గర్గముని అతనిని తన చేతితో నిమిరి, శంకరుడు కరుణాసముద్రుడు, దీనజన బాంధవుడు. నిన్ను తప్పక అనుగ్రహించును, వెళ్ళి నిష్ఠగా తపము చేయమని దీవించి పంపెను. రాజు కఠోర తపమాచరించి ఆకాశవాణి రూపమున శివకృపకు పాత్రుడాయెను. శివ రహస్యము శివునకే ఎఱుక. శివభక్తుల మహాత్మ్యము వర్ణింపనలవిగానిది. సేవకుని రాజును చేసినది. సేవకుని దూషణతను సహించినను దాని ఫలితము తపస్సిద్ధికి ఆటంకమగుటయు మరల ఆ శివభక్తుని దయవల్లనే అది తొలగి శివకటాక్షమునకు పాత్రుడగుట శివ లీలామృతము. దీనిని వినినవారు, చదివినవారును జన్మపర్యంతము చేసిన పాపములు క్షణములో నశించి భోగములననుభవించి ముక్తి బొందుదురు.

Sunday, April 19, 2009

23వ అధ్యాయము

మునులు సూతుని ఇట్లడిగిరి. తమరు సర్వజ్ఞులగు వ్యాస శిష్యులు. కనుక మీరు మీ గురువు ద్వారా వినివ విధముగా సనత్కుమారులు బ్రహ్మదేవునుండి ఎట్లు ఉత్పన్నమయిరి? ఎప్పుడునూ 5 సంవత్సరముల బాలకునివలె నుండుటెట్లు జరిగెను? సర్వజ్ఞులెట్లయిరి? తెల్పుడనగా, సూతుడుమునిబృందములకిట్లు తెల్పెను. పూర్వము అనవద్య తన పతియగు నాథశర్మనీవిషయముతో పాటుగా, వామదేవుని వృత్తాంతమునుగూడా అడుగగా నాథశర్మ ఇట్లు తెల్పిరి.

పూర్వము ఒక కల్పాంతము తర్వాత మరల కొత్త బ్రహ్మగారు సృష్ఠి చేయు నిమిత్తము 10 వేల సంపత్కరములు ఏకాగ్రమనస్కులై తపమాచరింపగా పరమేశ్వరుడు సంతృప్తిజెంది గంభీరనాదముతో వరము కోరుకొమ్మనిరి. బ్రహ్మదేవుడు శంకరునికి నమస్కరించి, పరమాత్మా! మూడు లోకముల సృష్ఠికొరకు మీ భక్తుల ద్వారా నేనాపని నిర్వర్తింతును. వారు నాకుమారులుగా నా కార్య సాధనకు సమర్ధులు, సర్వజ్ఞులు గావలయును అని ప్రార్థించిరి. శంకరులు పద్మాసనా! దుర్లభమగు వరము కోరితివి. కాని సృష్టి కార్య నిర్వహణ కొరకు నేను నాభక్తులను నిర్దేశింతునని తెల్పి విఘ్నేశ, వీరభద్ర, నందికేశ, కుమార, మహాకాలులను అయిదుగురను పిలిచి, సృష్ఠి కార్యము కొరకు బ్రహ్మ మిమ్ములను తన కుమారులుగా కోరుచున్నాడు. మీకుకూడ అట్టి కోరిక గలదేని జగద్వస్తారము చేయుడనగా, వారు పరమాత్మా తమ ఆజ్ఞ బలవత్తరమయినది గనుక మేము బ్రహ్మదేవుని కుమారులముగా వ్యవహరింతుము కాని సృష్ఠి విషయమున గాదు. బ్రహ్మ తలచినవెటనే మేము ఉద్భవింతుమనిరి. బ్రహ్మ సంతుష్టుడై సత్యలోకము చేరెను. పరమాత్మ అంతర్హితులైరి. వారైదుగురునూ అంతర్హితులైరి.

బ్రహ్మ సృష్ఠి జేయ తలంచినవాడై శివభక్తులను తలంచగా విఘ్నేశ్వరుడు సనకుని రూపమున బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించెను. వీరభద్రుడు సనందునిగా, నందీశ్వరుడు సనాతనునిగా, కార్తికేయుడు సనత్కుమారునిగా, మహాగాలుడు సనత్సుజాతునిగాను 5 సంవత్సరముల బాలకులుగా బ్రహ్మ మానస పుత్రులుగా ఉద్భవించిరి. కాని సదా శివనామ స్మరణముతో వేరు భావము మనసున రానీయక, విరక్తులై నిత్య తృప్తులుగా నుండిరి. బ్రహ్మ వారిని చూచి పుత్రులారా! మీరు దేవ, మనుష్య, పశు, పక్ష్యాదులను పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర సంతతిగా వర్థిల్లజేసి సృష్ఠికార్యము జేయుడని తెల్పగా వారు శివధ్యానపరులై మూగ, చెవిటివారుగా బదులు పల్కక మిన్నకుండిరి. బ్రహ్మ వారిని చూచి, వీరు సృష్ఠికి సహకరింపరని ఎంచి, మరల నూరు సంవత్సరములు తపమాచరించెను. కాని మానసిక తపోబలమున సృష్ఠి జరుపలేక ఎన్నోమార్లు తపమాచరించి విఫలులైరి. అపుడు దీర్ఘముగ ఆలోచించి మైధున సృష్ఠిద్వారా జగత్తును నింపివేసి సంసారిగా మారెను. సనకాదులు మహా మహిమాన్విత రుద్రగణములు. ఇందు నాల్గవ వారు సనత్కుమారులు కార్తికేయుని అంశగా ప్రసిద్ధులు. మూడు లోకములందుని వారి ప్రజ్ఞను తెలిసినవారు లేరు. వైరాగ్యము, బ్రహ్మనిష్ఠ ఎట్టిదో లోకమున చాటుటకు శివుడే ఈ రూపము దాల్చెనా యన్నట్లుందురు. ఎప్పటికిని 5 సంవత్సరముల బాలుని వలె స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందును, బ్రహ్మ, విష్ణు, రుద్రలోకములందును వీరు ఎక్కడ సంచరించిననూ అడ్డువారు లేకపోగా అందరునూ వినమ్రులై నమస్కరింతురు. వీరి శాప ప్రభావమున విష్ణు ద్వారపాలకులు జయవిజయులు జగత్తునందు జన్మించి శాపావసానంతరమున ముక్తులై శివపదము పొందిరి. లోక సంరక్షణార్ధము వీరు మానసమందు పరమేశ్వరుని తలంచుచు మనోవేగమున సంచరింతురు. ఈ కథను విని అనవద్య తన ప్రాణనాధుడు నాథశర్మను ఇట్లడిగెను. స్వామీ విష్ణుద్వారపాలకులు శాపోపహారము తర్వాత శివపదము పొందుటేమి? యనగా నాథశర్మ, ప్రియా శివరహస్యమెఱిగిన వారికే ఈ విషయము తెలియును. వినుము.

తొల్లి విష్ణుమూర్తి శంకరుని ప్రార్థించి స్వామీ మీ ద్వారపాలకులు నన్ను రక్షించువారినిగా జేయుడని కోరగా శివుడు కరుణించి తన ద్వారపాలకులు సుభద్ర, భద్రలనువారిని పిలిచి మీరు విష్ణుమూర్తి ద్వారపాలకులుకండని ఆజ్ఞాపింపగా, వారు శివుని ప్రార్థించి స్వామీ మాకు మరల మీచరణ సేవాభ్గ్యమెప్పుడు? పరమాత్మా మీ ఆజ్ఞను ఉల్లంఘించిజాలము, మీ నిత్య దర్శన, సేవనువిడువజాలము. ఇట్టి సంకట స్థితిలోనున్న మమ్ము కరుణింపుడని వేడగా, శంకరులు మీరు ఒక కల్పకాలము విష్ణువున్నంతవరకు అతనిని సేవించుచుండగా నా అంశతో సలక సనందనులు మీకు శాపమిత్తురు. ఆవ్యాజమున మరల నావద్దకు చేరుదురని ఊరడించిరి. నాసేవక భక్తులను నేనెక్కడనియమించిననూ వారొక్క అంశతో మాత్రమే అక్కడకు వెళ్ళి చివరగా మరల నన్ను చేరుదురు. ఇట్లు బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా నాచే సృష్ఠి, స్థితి, లయ కార్యములకు నియమింపబడి, ఒక అంశతో వెళ్లి ఆ కార్యక్రమముల కల్పాంతమున మరల వచ్చి నన్ను చేరుదురు. కనుక వారు నా అంశతో నాకును వారికినీ భేదము లేదని తెలిసికొనుడు. అట్లే మీరు కుమారముని శాపమున మూడు జన్మలకాలము నన్నే తలంచుచు చివరకు మరల నన్ను చేరగలరు. అని పంపగా వారు విష్ణు ద్వారపాలకులు జయ, విజయులుగా, దేవాసుర యుద్ధములందు విష్ణు భక్తులకు విష్ణువుకు విజయము చేకూర్చుచుండిరి.

ఒకపరి సనకాది మహర్షులు లోక సంచారముచేయుచు విష్ణులోకమునకు వచ్చిరి. అపుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతమున శివమహిమలను చెప్పుచుండిరి. ద్వారపాలకలగు జయ, విజయులు అనుమతి లేనిదేలోనికి వెళ్లరాదని సలకాదుల నడ్డగించిరి. అపుడు మునులు వారిని చూచి, ఊర్ధ్వ, అధో లోకములందెక్కడనూ మాకడ్డునిలుచు వారు లేరు. మీరు దేవ, మానవ, రాక్షస ప్రవృత్తులుగా మమ్ము నిలువరించిరి గనుక మీరు మూడు జన్మలలో అట్టి ప్రవృత్తులుగలవారగుదురని శపించిరి. ఇది గమనించిన లక్ష్మీ నారాయణులు వారే ద్వారము కడకు వచ్చి మునులను సాదరముగ ఆహ్వానించి అర్ఘ్య పాద్యములతో పూజించి స్తుతించుట చూసి జయ విజయులు తమ శాపోపసంహారమునకై వారిని ప్రార్థించిరి. మునులు యోచించి, తమ నోటి ద్వారా అట్టి వాక్యములు వచ్చుట శంభుని ఆజ్ఞగా తలంచి, విధి బలీయము గనుక మీరు మూడు జన్మలలో దైత్య, రాక్షస, మానవులుగా జన్మింతురు. శివ కృపచే మేము ఆ జన్మలలో మీకుమారులుగా ఉద్భవించి మిమ్ము ఉద్ధరింతుము. అని చెప్పి లక్ష్మీ నారాయణులము కూడ వారిని ఉద్ధరింపగోరిరి. అపుడు లక్ష్మీదేవి ఆలోచించి, పరమేశ్వరుని ఆజ్ఞ వలన నేను కూడా వీరిని ఉద్ధరించుటకు ప్రయత్నింతును. వీరి రెండవ జన్మలో వారిచే ఆశింపబడి విష్ణుమూర్తి ద్వారా వారిని ఉద్ధరింతుననెను. సనకాదులు జయ, విజయుల నూరడించి వెడలిపోయిరి.

శాప పర్యవసానమున వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులైరి. సనక మహర్షి హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదునిగా విష్ణువును ప్రార్థించగా, విష్ణుమూర్తి తన శక్తిచాలక శివుని ప్రార్థించెను. పరమాత్మ నృశింహరూపమున విష్ణువులో ప్రవేశించి హిరణ్యకశిపుని, వరాహరూపమున ప్రవేశించి హిరణ్యాక్షుని వధించి ఉద్ధరించిరి.

రెండవ జన్మలో వారు రావణ, కుంభకర్ణులైరి. లక్ష్మి సీతాదేవిగా రావణునిచే బంధింపబడి, విష్ణుమూర్తి రామావతారముతో రావణుని వధించుటకు అగస్త్యునిచే ఆదిత్య హృదయరూపమున శివుని ప్రార్థించి ఆ శక్తితో రెండవ జన్మలో రావణ కుంభకర్ణులను ఉద్ధరించిరి.

మూడవ జన్మలో భద్ర, సుభద్రులు ఒక అంశతో జయ విజయులుగా విష్ణు ద్వారపాలకులైరి. చివరకు కల్పాంతమున ఆ విష్ణువుతో సహా మరల శివపదము బొందిరి. (ఇక్కడ ఏదో తేడా వచ్చింది చూడగలరు ...)

సనకాదులు అనేక కోటి బ్రహ్మాండములు శివధ్యాన పరులై వేరొండు తలంపక శివజ్ఞానులయిరి. ఈ రహస్యము శివుడు పార్వతికిని, స్కందుడు నాథశర్మకును తెల్పిరి. నాథశర్మ అనవద్య కిట్లు తెల్పి శివ రహస్యము అత్యద్భుతము. సనకాదులు బ్రాహ్మ మానస పుత్రులైననూ అనన్య శివభక్తి పరాయణులు. శివ మహాత్మ్యము విచిత్రము. శివయోగుల లీలను కూడ విచిత్రములు

22వ అధ్యాయము

ఋషులు సూత పౌరాణికుని ప్రార్థించి వామదేవుడు సనత్కుమారునిద్వారా వినిన శివరహస్య మేమని అడిగిరి. సూతుడిట్లు చెప్పిరి. సనత్కుమారుడు వామదేవుని మహాత్మా! మీ దివ్య పరిజ్ఞానముల పాపములంది మిక్కిలి గొప్ప పాపము, ఎట్టి కర్మలవల్లనూ నివృత్తి గాని పాపమేది యని అడిగిరి. శివాపరాధమునకు మించిన పాపము, ఎట్టి పుణ్యకార్యములవల్లనూ రహితము గాది. పదివేల ప్రాయశ్చిత్తముల వల్లనూ అట్టి పాపము ప్రక్షాళితముగాదు. అనగా సనత్కుమారులిట్లు తెల్పిరి. కలియుగము పాప భూయిష్టము. పాపభీతి గలవారు తక్కువ. ఉచితానుచితములు తలంపరు. కేవలము ఇంద్రియ, జిహ్వ సుఖ నిరతులు. సత్య, త్రేతా, ద్వాపర యుగములందు ధర్మలోపము లేదు. కలియుగమున మానవులు కుటిలాత్ములై అధర్మపురలగుట వలన శంకరుని కృపలేనిదే వారు తరించు మార్గము లేనందున దయామయుడై శంకరుడు కాశీలో విశ్వనాథుడుగా, గంగ, మణికర్ణికలను పాప ప్రాయశ్చిత్తార్మేర్పరచి, తన యడల, తన భక్తులయడల చేయు అపరాధముల నివృత్తికై తానే కేదారేశ్వరుడై ఈ రహస్యమును మొదట గౌరీదేవికి చెప్పెను. కనుక శివాపరాథ, శివభక్తాపరాథ నివారణ కేవలము ప్రాచీన మణికర్ణిక, గుప్త తీర్థము మాత్రమే. అంతియేగాక తన చుట్టూగల తన అంతర్గ్రుహమున భైరవదండనయునూ లేక పాపులను గూడ తారకమంత్రముచే ముక్తులను చేయుచున్నాడు.

వేరెక్కడనూ పదివేల కల్పములయిననూ తీరని శివాపరాధము కాశీలో ఆజన్మయందే ఉపశమించి ముక్తి గల్గుట తథ్యము. కాశీకేదారునికి ఒక్క బొట్టు గంగాజలము, ఒక్క పుష్పము సమర్పించినవారికి మోక్షద్వారములు తెరుచుకొనును. ఒక దీపము వెలిగించినవారికి జ్ఞానదీపముచే అవిద్య తొలగును. ధూపమిడినవారికి జన్మజన్మాంతరముల కర్మవాసలము దుర్గంధము వీడిపోవును. మంత్రయుక్త పూజనాచరించిన వారిని కేదారేశ్వరుడు ముక్తినొసంగును. ఛత్ర, చామరాది సర్వష్డశోపచారములు చేసినవారిని రుద్ర కన్యలు సపర్యలు చేయుదురు. మహాపూజ చేసిన వారిని రుద్ర గణములు పూజింతురు. కేదారాలయమున భిక్షులకు అన్నపానీయములిచ్చినవారు శంకరుని దయాసముద్రమున తేలియాడుదురు. జీవితమున ఒక్కమారయినను కాశీ కేదారనాథుని పూజించినవారు పునరావృత్తి రహితులగుదురు. వీభూతి రుద్రాక్షధారులై రుద్ర పాఠమాచరించిన వారు అంబికా సహిత శివదర్శనము పొంది శివపదము చేరుదురు. శివ, కేదార, కేదార, కేదార యను ధ్వని మొక్షలక్ష్మితలుపులు తట్టు ధ్వని యగును. ఇది శృతి, స్మృతులవచనము. ఎట్టి సందియమును లేదు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, మధుపర్కముల మంత్ర ధ్వని అట్టివానిని దేవతను తమలోకములకు తీసికొని వెళ్ళుటకు చేయు భేరీధ్వనియగును. కేదారేశ్వరుని ఎదురుగా పురాణము చెప్పువారు, చెప్పించువారు, వినువారు మోక్షలక్ష్మి తమను వరించుటకు వచ్చునపుడు కాలియందియల ధ్వనిగా తలంచవలయును. కేదారము నాల్గు ప్రక్కల ఉన్నవారిని ఒక్క గ్రాసము ఆతిథ్యమునకు పిలుచు ధ్వని ఆతిథ్యమిచ్చు వారిని కైలాసమునకు ఆహ్వానించు ధ్వనిగా తలంచవలయును. కేదారేశ్వరుని స్తోత్రమంత్ర ధ్వని వారనిని కైలాసము తీసికొనివెళ్లునపుడు చేయు భేరీ భజంత్రీల ధ్వనిగా తలచవలయును. కేదారేశ్వరుని పూజించు భాగ్యమునకు నోచుకొననివారు విశ్వేశ్వర సారూప్యము బొందుదురు. ఇందు సందేహము లేనేలేదు. కేదారేశ్వరుని చుట్టునూ అగణిత లింగసమూహము గలదు. అవి దేవ, దానవ, దైత్య, నాగ, రాక్షస, అకుర, రాజ, మునివర్యులు, అప్సరసలు స్థాపించినవి. ఇవి ఐశ్వర్య, భుక్తి, ముక్తులనొసగునవి. కేదారేశ్వరునికి తూర్పున శ్రీకరకంఠ నామముతో సముద్రుడు స్థాపించినది, దానికి తూర్పున మయూర లింగము, వరుణ, సింహ, జారవ్య, మాయేశ లింగములు గలవు. ఇవి కొన్ని లుప్తములు, కొన్ని అదృశ్యములు.

కశ్యపుని కుమారులు శూరాదులు కార్తికేయునిచే నిహతులై స్వామి అనుగ్రహమున శిఖి, కాలజ్ఞాని అనుపేర్లతో స్వామివారి వాహనము, ధ్వజముగాను, తారకాసురుడు పూర్వ జన్మ తపోబలముచే స్వామి గజవాహనముగాను, అమ్మవారి సింహవాహనముకూడ పూర్వ జన్మ తపోవిశేషమున గల్గినదే. వీరి సోదరి అజ నామకురాలు, తల్లి మాయాదేవి కూడ శంకరుని విరోధించి స్కందుని ఆగ్రహమునకు గురై మరల వారి ప్రార్థనల నాలకించి కాశీలో ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి విధి విధానముగా కేదారేశ్వరుని పూజించి, వారి పేర్లతో లింగములు స్థాపించి పాపరహితులై మరల కార్తికేయుని దర్శించి, అమ్మవారిని ప్రార్థించి శివాజ్ఞచే ముక్తులైరి. వారి కుమారులు కూడా ఉపాసనా ఫలముగా వారి ఇష్టదేవతల పేర లింగములు స్థాపించిరి. మరియు నాల్గు వర్ణముల స్త్రీ, పురుషులు స్థాపించిన లింగములును గలవు. గౌరీతీర్థమున గౌరీదేవి, లక్ష్మి, వ్యాస, భార్గవులు స్థాపించిన లింగములు గలవు. సనత్కుమార, గంగ, యుము, సరస్వతులు స్థాపించిన లింగములు త్రినదీశ్వర నామములతో గలవు. ఈ విధముగా పదివేల లింగములు గంగలోని, తీరమునను గలవు.

దక్షిణ భాగముల అసంఖ్యాక లింగములు గలవు. చిత్ర కేతు, చిత్ర రధ, చిత్రాంగద, విచిత్రక, సీత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్, భరత, వానర, జాంబవంత, లంగురులు స్థాపించిన లింగములు, మహాతేజస్వి రామచంద్రుడు, అన్యరాజులు తమ నామధేయములపై లింగములు స్థాపించిరి. అట్లే పశ్చిమమున వైప్రచిత్తేశ్వర, కాలకేయేశ్వర, నిరాతక వచేశ్వర, వైరోచనేశ్వర, వల్మీకేశ్వర, తిలభాండేశ్వర, వాలకేశ్వర లింగములు, కుండేశ్వర, కుఠారేశ్వర, పరిభద్రేశ్వర, శుంభేశ్వర, నిశుంభేశ్వర, కాళీశ్వర, ప్రమథేశ్వర లింగములు స్థాపించి వారందరు శివధామము చేరిరి. ఉత్తరమున ఇంద్రద్యుమ్నేశ్వర, అధీశ్వర, నిషధేశ్వర, గణేశ్వర, క్షేమేశ్వర, వాలఖిల్యేశ్వర, నారదేశ్వర, సఖీశ్వర, అక్రూరేశ్వర, కబంధేశ్వర, పాండేయేశ్వర, క్షాళనేశ్వర, దశాశ్వమేధేశ్వర, కులేశ్వర, కుండలీశ్వర లింగములు గలవు. వీనిలో కొన్ని నష్టమయినవు. కొన్ని భిన్నమయినవి. కొన్ని స్థానభ్రంశమయినవి, కొన్ని భూస్థాపితములు, కొన్ని మాత్రమే ప్రస్తుతము తెలియబడుచున్నవి.

ఈ నామములు విన్నంత మాత్రమున ముక్తిగల్గును. విశ్వేశ్వరుడే కేదారుడుగా ఖ్యాతి గాంచినాడు. కామి, అకామి, భోగి, విరాగి, యోగులకందరకునూ ముక్తి ప్రదాయిని కాశి మాత్రమే. భోగకాములకు ముక్తినిచ్చి తనలోకమున సర్వభోగముల ననుభవింపజేయును. ఈ పురాణరహస్యముని వినినవారు శివపార్శ్వవర్తి గణములలో ఒకరుగా చేరుదురు.

Thursday, April 16, 2009

21 వ అధ్యాయము

మునులు మరల సూతమహామునికి నమస్కరించి కాశీకేదార రహస్యమునికనూ వివరింపుడని కోరగా సూతుడిట్లు వచించిరి. మాంథాత కేదారేశ్వరుని అనేక విధములుగ స్తుతించి స్వామీ మీరు మొదట హిమాలయములందు లింగరూప దర్శనమయిన వారందరకునూ ముక్తి నొసగుచుండిరి. శివాపరాధులకు అక్కడ దర్శనమివ్వనిచ్చగించని మీరు నన్ననుగ్రహించి కాశీలో ఇక్కడ మీ దర్శన భాగ్యము ఇపుడు నాకొసంగిరి. అట్లే ఇక్కడ మీదర్శనము చేసినవారందరకును ముక్తి ప్రసాదింపుడని వేడగా, వెంటనే బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలందరునూ చేతులు జోడించి కేదారేశ్వరునకు నమస్కరించి ప్రభూ! ఇట్టి దుర్లభమగు వరము మీరు అనుగ్రహించినచో క్షణములో నీదర్శనము చేసినవారందరితో కైలాసము నిండిపోయి నరకమున యమునికి గాని ఇక్కడ భైరవునికి గాని, విష్ణు, ఇంద్రాదిదేవతలకు గాని లోకపాలకులకెవరికిని పనియుండదుగదా! మీచే ఏర్పరుపబడిన సృష్ఠి, స్థితి, లయముల నియమముననుసరించి జీవులు వారి సుకృత, దుష్కృతముల వలన స్వర్గ, నరకములు పొందుటనేర్పరచినది మీరేగదా! అట్టి వ్యవస్థ తారుమారయినచో లోకమున మానవులు పాపభీతి వదలి, సుకర్మలు చేయకనే నీ దర్శనముతో ముక్తులగుటకు ప్రయత్నింతురు. గనుక మీరు భక్తుల ననుగ్రహించుటకు గాని, మీ కేదార అంతర్గ్రుహ మందు మాత్రము పాపులకు భైరవ యాతన లేకయే ముక్తి గల్గునట్లు జేయుడని కోరిరి. మీ వరప్రభావమున అర్బుద కల్పములు బ్రహ్మలోగ, విష్ణులోకములలో భోగములనుభవించి పునరావృత్తి రహిత శివధామ ప్రాప్తి నొసగుడని వేడిరి. అపుడు పరమాత్మ ప్రసన్నుడై మాంథాతా! నీవు నా ప్రియ భక్తుడవు గనుక చెప్పుచున్నాను వినుము. కారణాంతరములచే ఇక్కడ నా దర్శనమాత్రమున ముక్తి నీయజాలను. మొదటి మూడు యుగములలో మనుష్యులు ధర్మవంతులుగ నుందురు గనుక ముక్తి సాధ్యము. కాని కలియుగమున పాపులధికముగ నుందురు గనుక దర్శనమాత్రమున ముక్తి బొందిన యడల కర్మశ్ష అనుభవము లయమగుటచే సృష్ఠినియమలోపమగును. గనుక నిశ్చయముగ కాశీ కేదార లింగ దర్శనానంతరము దేశాంతరమున ఎక్కడ మృతి జెందినను ముక్తి తథ్యము. వేరు ఏమార్గమునను అట్టి ముక్తి లభ్యమవదు. ఈ రహస్య వాక్యముపై ధృడ నిశ్చయము గల్గిన వారికి పునరావృత్తి రహిత ముక్తి లభ్యమగును. భోగ మోక్షములు వారి కరతలామలకములు. కాశీలో దేహత్యాగము వలన ఇది నిశ్చయము. కేదారేశ్వరుడు మాంథాతతో మరియు ఇట్లు తెల్పెను. నాయీలింగము ఇపుడు పులగరూప పాషాణముగా తెలియునది. సత్యయుగమున నవరత్నమయముగను, త్రేతాయుగమున బంగారు లింగముగను, ద్వాపరమున వెండిలిగముగను, కలియుగమున ఇట్లు పాషాణముగను కన్పించును. నీచే రెండు భాగములు చేయబడినది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము. అన్నముచే చేయబడినదగుటచే అన్నపూర్ణయగును. అన్నపూర్ణ సహితముగా నన్నర్చించుటచే వారింట అన్నమునకు సదాలోటుండదు. అంతమున నన్ను జేరుదురు. నా ఎదుట గుప్త తీర్థమునుండి 60 వేల పాతాళ లోక నాగకన్యలు నిత్యము నా దర్శన అర్చన నిమిత్తము వత్తులు. దేవలోకమునుండి అప్సరసలు, దేవతలు నిత్యము నన్నర్చించ వచ్చెదరు. గనుక కాశీ కేదార లింగము సర్వ కామప్రదము. నేను విశ్వనాథ లింగమందెట్లున్నానో అంతకన్న ఎక్కువగ ఈ లింగమందున్నాను. విశ్వనాథుని మణికర్ణిక ఎట్లో అంతకన్న ఎక్కువ మహాత్మ్యము ఈ ప్రాచీన మణికర్ణికది. ఇక్కడ ఢుంఢిరాజు, మాధవుడు, భైరవునితో పాటుగా దండపాణియు గలరు. ఇక్కడ నా అంతర్గ్రుహమున మరణించినవారు భైరవ యాతన లేకయే నా తారకమంత్రోపదేశముచే నా రూపము బొంది నన్ను చేరుదురు. అని శంకరుడు వరమిచ్చి మాంథాతను తన ధామమునకు చేరుమని చెప్పి ఆలింగమందు అదృశ్యుడాయెను. అక్కడి ఋషి పుంగవులు మాంథాతను అనేక వధముల కొనియాడిరి. మాంథాత వెంటనే విశ్వనాథ, కేదార, భైరవ, దండపాణి, ఢుండిరాజ, బిందుమాధవ, మణికర్ణికలను సేవించి పాంచభౌతిక శరీరము త్యజించెను. శివగణములతనిని విమానములో మహా కైలాసమునకు తీసికొని వెళ్ళిరి. మాంథాత విమానములో ఒకమారు కాశికి ప్రదక్షణము చేసి, హిమాలయ కేదారము వెళ్లి అక్కడ శంకరుని దర్శించి, ఒక అంశతో అక్కడ నిత్యము కేదారేశ్వరుని అర్చించు కొనగోరగా ఆకాశవాణి రూపమున పరమేశ్వరుడు అనుజ్ఞనొసంగెను. ఇట్లు కాశీకేదార శివ రహస్యమును వామదేవునకు సనత్కుమారులు వినిపించిరి.

కాశీలో కేదారనాధ మహిమ, గుప్త తీర్థముహిమ అత్యద్భుతములు. శివానుగ్రహముగల వారికి మాత్రమేవీని యందాసక్తిగల్గి కాశీదర్శింతురు. ఒక్కపర్యాయమయినను శ్రీకేదారేశ్వర దర్శనము, ధూప, దీప, నైవేద్య సేవనము జేసిన వారికి జనన మరణ భయములు ఉండవు. వారికి ముక్తి మండప ద్వారములు తెరిచి యుండును. పంచక్రోశాత్మక కాశీ పట్టణమంతయు విశ్వేశ్వర స్వరూపము. మణికర్ణిక సర్వపాప వినాశిని. ఇందు సంశయము లేదు. ఓంకారాది లింగములన్నియూ ముక్తిదాయకములు. చతుష్షష్ఠి యోగినులు గూడ ఇష్టకామ్యముల నిత్తురు. 56 వినాయకులు సిద్ధి నిత్తురు. ద్వాదశాదిత్యులు పాపహరులు. కార్తీకములో పంచ గంగా స్నానము, వైశాఖమున పంచతీర్థములు, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదురుగా తీర్థము పాపహరము. కాశీలో అన్నదానము పాపహరము. పంచక్రోశమహాయాత్ర నిశ్చయముగ మహాపాపహరము. దండపాణి, మాధవ, ఢుండరాజ, భైరవులు పాప సంహరులు. 500 విష్ణుమూర్తులు పాప సంహారకులు. దుర్గా క్షేత్రము పాపహరము. కాశీలోని అణువణువున గల సర్వ దేవ తీర్థములు పాపహరములు. వినినెవరు వర్ణించ గలరు. విశ్వేశ్వరుడు ఓంకారేశ్వరాది ప్రతి లింగములోను 42 మహాలింగరూపములుగ వర్ధిల్లుచున్నాడు. ప్రతి క్షేత్రమందును విశేషమహిమలు గలవు. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్ర, అగ్ని, రాక్షస, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర, నక్షత్రమండలమందు గల ధృవ, సప్తర్షి, గ్రహ, అష్ట దిగ్గజ, తక్షక, కర్కోటకాది నాగులు, వశిష్ఠ, దూర్వాసాది బ్రహ్మర్షులు, దివోదాస, హరిశ్చంద్రాది చక్రవర్తులు, ఒకటని వివరించనలవిగాని అనేక దివ్య అనుగ్రహములు చేసి కాశియందు అనేకరూపములుగా నున్నాడు.

ఇట్లు సనత్కుమారునిచే చెప్పబడిన శివ విభూతులు భక్తిపూర్వకముగ విని వామదేవుడు మరల కుతూహలముతో శివ మహాత్మ్యమునిట్లు తెలిసికొనగోరెను.

Tuesday, April 14, 2009

20 వ అధ్యాయము

శౌనకాది మునులు సూతునిట్లడిగిరి. హే శివాజ్ఞాన నిధీ! మాంథాత సంశయ నివారణకు ఎట్టి మహాత్ముల వద్దకు వెళ్ళిరి. వారు కాశీయందు ఎట్టి నియమములనాచరింతురు? తెల్పుమనగా సూతుడిట్లు చెప్పదొడగెను. శివ రహస్యము నెఱిగిన ఆ మహాత్ములు మనసా, వాచా, కర్మణా అహరహము శివకైకర్యమున కంకితమైనవారు. సిద్ధులు, చిద్ఘములు, శివానంద సముద్రముల కెరటమువంటివారి. శివ తత్వార్ధమును తెలిసినవారు. శివునికి వలె శివభక్తులకును సేవ జేయువారు. శివ పూజా పరాయణులు. శివ పురాణమును ప్రవచించువారు. శైవ శాస్త్ర, ఆచార, తంత్రములయందారితేరినవారు. శివ ధ్యానరూపమగు తృప్తితో ప్రాపంచిక విషయములను తృణమాత్రముగ నెంయి శివజ్ఞానమను అగ్నితో భస్మము జేయువారు. మనోవేగమున నిత్యము అఖిల శివ క్షేత్రములను దర్శించనిదే భోజనము చేయనివారు. అట్టివారి సభలో మాంథాత వారికి సాష్ఠాంగ మనస్కారములు చేసి తన సంశయమును నివేదించగా వారు మాంథాతను ప్రశంసించి, నీవు ధన్యుడవు. నీ తపస్సుకు మెచ్చి కేదారేశ్వరుడు ఆకాశవాణి రూపమున నిన్నాదేశించెను. శాస్త్రోచిత నియమపాలన కన్ననూ శివాజ్ఞయే మిన్న గనుక నీవు వెంటనే వెళ్ళి స్వామికి నైవేద్యము తయారు చేయుము. మేముకూడ నీవలె మనోవేగము గలవారము. నీ స్వామ్ ఆదేశానుసారము అతిథి సేవ, భోజనము అయిన తర్వాత మేమునూ యాత్రలో నిన్ననుసరించి వచ్చెదమనిరి. మాంథాత వెంటనే తన స్థానమునకు చేరి, పులగము వండి, నేతితో కలిపి ఆకులో గుమ్మరించి, మధ్యలో గీత గీసి రెండు భాగములు చేసి శివునికి నివేదించి, అతిథి కొరకు ఎదురు చూచుచున్న సమయమున ఇతనితో యాత్ర చేయుటకు సిద్ధులందరును ఎతెంచిరి. ఎంతకును అతిథి దొరకడాయెను. కాలాతీతమగుచున్నందున మాంథాత తో చేరి అందరునూ శివుని స్తుతించిరి. వెంటనే పరమాత్మ భిక్షురూపమున వెలుపల నిలిచి నాకు భిక్షనిత్తువాయాని పిలచెను. మాంథాత సంతోషముతో భిక్షును చూచి నమస్కరించి పొంగలి భిక్ష తెచ్చుటకు లోనికి వెళ్లి అతిథి భాగమును తీయబోగా క్షణములో రెండు భాగములుని పాషాణమూగా మారినవి. మాంథాత ఆశ్చర్యముతో అతిథికి భిక్షనీయలేకపోతినే యని చింతించి, నేనేదో తప్పుచేసి యుండవచ్చును. కేదారేశ్వరుడు కోపించి యుండునని తలచి దుఃఖితుడై వెలుపలకు వచ్చి చూడగా భిక్షువు కన్పింపలేదు. శివభక్తులందరునూ వెలుపలకు వచ్చిచూడగా ఆకాశమున మాహాశంఖ నాదము, ఘంటానాదము, రుద్రకన్యల తాటంకముల ఝణఝణ శబ్దము, శివస్వరూపులగు రుద్రగణములతో, సహస్ర సూర్యకాంతులు మిరిమిట్లు గొల్పు కాంతితో, ఛత్ర, చామర సహిత, శీతల పవనముసు లీటు కఛము క్రిందకు దిగి అందుండి రుద్రగణములు, మాంథాతతో ఋషిసత్తమా కైలాసమునుండి, మీతపస్సుకు సంతృప్తుడయిన పరమ శివుడు ఈ రథమును పంపి మిమ్ము తీసికొని రమ్మనిరి. దయచేసి వచ్చి రథములో మాతోరండని ప్రార్థించిరి.

కాని మాంథాత మనసు సాక్షాత్ కేదారేశ్వరుని దర్శనము కొఱకు ఆరోటపడుచున్నందున, పరమేశ్వరుడు సగభాగమున పార్వతితో అర్ధనారీశ్వరుడుగ వృషభవాహనారూఢుడై, కార్తికేయ, గణేశ, శివగణ సహితుడై, నందీశ్వరుడు ముందు నడువగా, కోటి సూర్య ప్రకాశముతో, కోటి చంద్రుల శీతల పవన శోభతో, సరస్వతీదేవి వీణావాదన సామగానము వినపించుచుండగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పత్నీ సమేతులై జయజయ ధ్వానములు సల్పుచుండగా పాషాణ రూపమయిన అన్నకూటము నుండి ప్రకటితమయి, శిలా ప్రతిమవలె నిశ్చేష్టుడై నిల్చుండిన మాథాతతో స్వామి గంభీరముగా భక్తాగ్రగణ్య శిఖామణీ మాంథాతా! నీ నీశ్చల తపోనిష్టకు, భక్తి ప్రపత్తులకు నేనెంతో తృప్తుడనైతిని. వేరెవ్వరకునూ అలభ్యమగు వరములు నీకివ్వ సంకల్పించితిని గనుక నీ అభీష్టము తెల్పునమిరి. మాంథాత తెలివిలోనికి వచ్చి స్వామి ప్రసాదించిన దివ్య దృష్టితో స్వామిని దర్శించి దండ ప్రణామమాచరించి ఆనందాశ్రువులు ధారా ప్రవాహముగ రాలుచుండ, మహాదేవా! బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకే అలభ్యమగు ఇట్టి మీ సాక్షాత్కారమునకు మూఢుడనయిన నేనునూ పాత్రుడనగుట నా పూర్వజన్మల సుకృతమగును. నీ భక్తుల సత్సంగ ఫలితమగును. ప్రభో ఈ శివభక్తులందరూ నిన్నెప్పుడూ మనమునచూడ నిచ్చగించు మహాత్ములు, గనుక నాపై తమకు గల దయా దృష్ఠి వీరందరిపై యుండు గాక, ఇక రెండవ వరముగా నాకు ముక్తిగూడ కోరను. అనగా పరమ శివుడు, నీవు భక్త శిఖామణి వయితివి, నీకు వరము ఇతరుల కొఱకు కోరుటయే నీ గొప్పతనము కనుక నాయీ దివ్యదర్శన భాగ్యము కొరకు నీవు కోరినట్లు ఇక్కడి వారందరకు దివ్యదృష్ఠి నిచ్చుచున్నాను. అనగనే అక్కడి మునులందరూ బ్రహ్మాదులకే అలభ్యమగు దివ్య దర్శనము చూచి ఆనంద తాండవము చేయుచు, జయ జయ ధ్వానములతో, వేదాంత, స్మృతి, శృతి, పురాణ స్తుతులతో, రుద్ర పాఠ ఘోషతో, మోక్షలక్ష్మీ ప్రార్ధనలతో శంకరుని స్తుతించిరి. వెంటనే శంభుని ఆజ్ఞపై ఆకాశమున శంఖారావ, ఘంటానాదములు మార్మోగ నూర్లకొలది రుద్ర కన్యలు ఛత్ర చామరములు వీచుచున్న విమానములు కన్పట్టెను. అక్కడి మహాత్ములందరు వారి భౌతిక శరీరములు వదలి సూక్ష్మ శరీర ధారులై ఆ విమానముల నెక్కిరి. కేదారనాథుడు వారందరకును తారకమంత్రోపదేశము చేసి మీలో ఇంకనూ భోగ తృష్ణగలవారు నాధామమున అలౌకిక భోగములననుభవించి తదుపరి ముక్తి బొందుడు. భోగవిరక్తుల నన్నే ధ్యానము చేయుచు మోక్షప్రాప్తులు గండని వారిని అనుగ్రహించి మహాకైలాసమునకు పంపిరి. పరమ భక్తుడగు మాంథాత శరీరమును తన కరకమలములచే నిమురుచు వత్సా నీక సశరీర కైవల్యమొసగు చుంటిని, మరేదైన వరమొసంగవలయునని సంకల్పించితిని. వరము కోరమనగా మాంథాత ప్రభో! కాశీలో పాపాత్ములకు భైరవ దండన అత్యంత ఘోరమయినది. అసమాన్యమగు మీ అంతర్గ్రుహమున ఎట్టి పాపులకునూ అట్టి భైరవ దండన లేకయే ముక్తినొసగుడని కోరగా, స్వామి కరుణించి, కాలభైరవ, దండపాణి, ఢుంఢిరాజ, ఆదికేశవ, బిందుమాధవ మరియు ఇతర దేవతా సమూహమునంతయూ చేరబిలిచి, కాశీలో నాయీ కేదార అంతర్గ్రుహమున మృతిజెందు ఎజీవికినీ, ఎంతటి పాపాత్ములయినను కాలభైరవ దండన లేకయే నా తారకమంత్రోపదేశముతో ముక్తులగుదురని ఆదేశించెను. అట్లు ఆదేశించి పరమాత్మ దేవతలచే సేవింపబడుచు, విశ్వేశ్వరుడే నవరత్నమణి మయ రూపముల కేదారేశ్వరుడుగ ఆపాషాణ రూప అన్నకూటమున అంతర్హితుడాయెను.

సూతుడిట్లు ముగించి, మునులారా ఈ కధాంశమును భక్తిపూర్వకముగ విన్నవారు ముక్తులగుదురని చెప్పెను.

Wednesday, March 25, 2009

19 వ అధ్యాయము

వ్యాస శిష్యాగ్రగణ్యా, సూతపౌరాణికా! కేదారేశ్వరుడు ప్రధమ పద్మ కల్పమందు కాశీకి వచ్చినట్లు, విశ్వేశ్వర అనుజ్ఞచే నందీశ్వరుడు హిమాలయ కేదారమునుండి కాశీకి తీసికొని వచ్చినట్లు తెల్పితిరి. ఎకారణమున ఇట్లు సంభవించినదని మునులు ప్రశ్నింపగా మరల సూతుడు చెప్పనారంభించిరి. పరమేశ్వరుడు అవ్యయుడయ అలాజ్ఞవస గోచరుడు. నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త, శిరాశ్రయ, నిరంజన, నిర్వికల్ప, నిష్కళంకుడుగా తానొక్కడే వ్యాపించియున్న పరమాత్మ తాను సర్వవ్యాప్తముగావలెనని తలంచిలీలచే శివ శక్త్యాత్మకముగు తాని శివ శక్తులుగా విడిపోయి తాను మహాకైలాసమున అపాకృత సదాశివునిగానే యుండి శక్తిని పాంచభౌతికముగా విభజించి తాను ఈశ్వర నామముతో బ్రహ్మాండ రచన చేసి ఆనందించుటకు గాను సృష్ఠి, స్థితి, లయలు నిర్వహించుటకు తానే బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా విభజించుకొని, కాల నిర్ణయముకొరకు పద్మ, వరాహాది కల్పములుగా విభజించి ఒక్కొక్క కల్పము బ్రహ్మ ఆయుః ప్రమాణమున ఒక్క రోజుగా చేసి కల్పాంతమున మహాప్రళయము సృష్టించి లయమొనర్చి మరల సృష్టి చేయుచూ ఇట్లు లీలాకేళీ విలాసము సంకల్పించినాడు.

ఒక పద్మ కల్పమున కాశీకి విచ్చేసిన విశ్వనాథుడు, మంధర పర్వత విహారమునకు వెళ్ళి మరల వచ్చినపుడు మూడులోకములలోని తీర్థ, క్షేత్ర, ప్రతిమ, దేవమూర్తి, లింగమూర్తులలోని శక్తులన్నియూ విశ్వేశ్వర సాన్నిధ్యము కోరి వారి నిజస్థానములలో వారి షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము వదని 15 కళలతో కాశీకి చేరిరి. అట్లే కేదారేశ్వరుడు కూడ హిమాలయములనుండి విచ్చేసిరి.

అదే సమయమున హిమాలయములందు మాంధాతయను చక్రవర్తి, సార్వభొముడు, సూర్యవంశజుడు, తన తండ్రి మృతినొందకయే తండ్రి గర్భముచీల్చుకొని బయటకు వచ్చిన మహిమాన్విత శక్తి సంపన్నుడు తన 50 మంది కుమార్తెలను సౌభరియను యోగిపుంగవునకొసగి విరక్తుడై రాజ్యభారమును పుత్రులకు వదలి హిమాలయములకు వెళ్ళి 100 యుగములు తపస్సుచేసి కేదారేశ్వరుని లింగదర్శనము కోరగా ఈశ్వరుడు ఆకోశవాణి రూపమున "భక్త శిరోమణీ నీతపస్సుకు మెచ్చితిని. కాని శివాదపాధమొనరించిన బ్రహ్మకు ఇక్కడ లింగదర్శనమివ్వ ఇచ్ఛగింపక అదృశ్యమయితిని. బ్రహ్మకు శిక్ష ముగిసిన తర్వాత కాశీలో లింగదర్శన భాగ్యమిచ్చితిని. నేనిక్కడ లింగ దర్శనమివ్వనని ప్రతిన బూనిన కారణమున నీవు వెంటనే నా కాశీ నగరమునకు వెళ్లి తపమాచరింపుమని" చెప్పెను. దానికి మాంథాత "స్వామీ మీ దర్శనము లేని రోజు నాకు నిరర్ధకము కనుక నాకు మనోవేగము నిండు. ప్రది దినము గోగర్భ గంగాస్నానము, జ్యావాముఖి దర్శనము, హిమాలయ కేదారేశ్వర దర్శనము, జగత్తునందలి సంపూర్ణ దివ్యక్షేత్రముల దర్శనము మనో వేగమున క్షణకాలమునందు నిర్వర్తించి కాశీలో ఘోర తపమాచరింతును" అనగా స్వామి అనుగ్రహించిరి. అట్లు ప్రాతఃకాలమున సర్వదర్శనముల తర్వాత కాశీ మణికర్ణికా స్నాన, విశ్వేశ్వర అర్చనాదులు ముగించుకొని సంతుష్టలై తపోనిష్టులైరి. కొంతకాలము గడచిన పిదప వృద్ధుడైన మాంథాత నిత్యయాత్రచేయ నశక్తుడాయెను! అపుడు మరల కేదారేశ్వరుడు ఆకాశవాణిగా " భక్త శిఖామణీ! నీవు మయోభారమున శక్తి తగ్గినవాడవగుటచేత మధ్యాహ్న భజనానంతరము నన్ను దర్శింపరమ్ము. నాకు భక్తి ప్రధానము గాని, నియమపాలనగాదు" అని తెల్పగా మాంథాత ఆశ్చరమయముతో శివాజ్ఞ ఉల్లంఘించుటెట్లు యని తలంచి, నియమపాలన ముఖ్య ధర్మము గదా! కాశీలో ఆతిధ్యము ముఖ్య ధర్మమని, దాని మహాత్మ్యమును శివుడు విష్ణుమూర్తికి తెల్పిన విధమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.

కొందరు చోరులు కాశీ వెలుపల గ్రామములందు చాలా ధనమపహరించి రాత్రికి రాత్రి పరుగున కాశికి చేరి కేదారవనమందుగల ఒక శివాలయమున ప్రమిదలో గల మిగిలిన నేతితో వారి పైవస్త్రము చివర చించి వత్తిజేసి దీపము వెలిగించి ఆలయములోని స్వామి సన్నిధిన వస్త్రము పరిచి దొంగిలించిన సొమ్ము భాగములు చేసి పంచుకొను సమయమున భేధాభిప్రాయమున కలహించుకొని తెల్లవారకమునుపే వారి గృహములకు చేరిరి. అందు దీపము వెలిగించిన దొంగ తెలియక చేసినప్పటికి శివాలయమున నేతిదీపారాధన ఫలితమున మరు జన్మ కళింగ దేశాధిపతిగా పుట్టెను. క్రిత జన్మ రహస్యము తెలిసికొనిన ఆరాజు తన దేశమున అన్ని శివాలయములలోను దీపమాలిక నిత్యము వెలిగింపజేసి పూజింపదొడగెను. పుత్ర పౌత్రులు సర్వభోగముల ననుభవించి యజ్ఞములు, దానములు సల్పి అంతమున కాశీవాసము జేసిముక్తి బొందెను. అని విష్ణుమూర్తికి శివుడు చెప్పిన కథము సనత్కుమారుడు వామదేవునికిని, నాథశర్మ తన భార్య అనవద్యకును వినిపింపగా, అనవద్య భర్తద్వారా కాశీలో నిత్య నియమములు, వాని మహత్మ్యము, మాంథాత ఆచరించిన విధిని, తెలుసుకొనగోరగా నాథశర్మ ఇట్లు తెల్పెను. కాశీలో నిర్వహించిన కొద్ది ధర్మమయినను మేరుపర్వతమంత పుణ్య ఫలప్రదమగును. ఇందు సందేహము వలదు. బ్రాహ్మణాది చండాలురవరకు, స్త్రీ పురుష, నపుంసకువరకు, అనులోమ విలోమజాతులు, మ్లేచ్ఛ, హూణ, యవనులకయినను తెలిసి, తెలియక కొద్ది ధర్మమాచరించినను అది అమోఘ ఫలదాయకము. శివునకు ఒక్క జలబిందువు, బిల్వపత్రము, తిలమిశ్రిత తండులములు, వారి వైభవముననుసరించి పూలు, గడ్డిపరక అయినను శివార్పణమని విడిచిన వారిక అమోఘఫల మబ్బును. దశదాన, షోడశ దానములును, గంగా తటమున మెట్లు, మఠములు, జనావాసములు కట్టించినవారు స్వర్గాది శివలోకములవరకు అన్నిభోగముల ననుభవించి క్రమశః పునరావృత్తిరహిత మోక్షమును బొందుదురు. దేవతలు, మునులు, రాజన్యులు ప్రతి దినము కాశీలో ధర్మమాచరించు సదవకాశము కొఱకు నిరీక్షింతురు. ఇక శంకరుల ఆజ్ఞవినిము. కాశీలో అన్నదానమొనరించువారి విషయమున అన్నములోని మొదటి మెతుకునకు ధర్మమును, రెండవ మెతుకునకు అర్ధమును మూడు, నాల్గు మెతుకులకు కామ మోక్షములనిత్తును. ఇక మిగిలిన అన్నమునకేమి ఇవ్వవలసియుండనని ఆలోచింతుననెను. కలియుగమున చతుర్విధ ఫల పురుషార్ధముల నొసగు స్థలము కాశీతక్క వేరొండు లేదు. కాశీలో మాంథాత నిత్య వ్రతముగ ప్రాతఃకాల కేదార పూజానంతరము నిత్యయాత్ర చేసి వచ్చి మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర నిత్యయాత్ర, తర్వాత ప్రాచీన మణికర్ణికా స్నానము, భిక్షుకులకు ఆతిధ్యము నొసగి అపుడు భోజనము చేయును. నిత్య యాత్రము, మాసయాత్రము, వార్షిక యాత్రలు విధివిధానముగ జేయును. ఆకాశవాణి రూపమున భోజనము చేసి కేదారయాత్రము రమ్మని శివాజ్ఞనెట్లు ఆచరించుట ఏది కర్తవ్యము? సంశయనివారణకు కాశీలోని శివభక్తులు, వేదపండితుల వద్దకు వెళ్ళి నమస్కరించి పరిష్కారమడిగెను. వారు సంతోషించి శివాను ఆకాశవాణి రూపమున విని, నిత్యవ్రతుడైన మాంథాతను ప్రశంసించి నమస్కరించిరి.

Monday, March 23, 2009

అష్టాదశోధ్యాయము

మునులు మరల సూతుని, మహాత్మా దుర్ధరుడు ఎట్లు ఉద్ధరింపబడెను? వినిపింపుడనగా సూతుడిట్లు తెల్పెను. మేలక దుర్ధరుని విమానములో కూర్చుండ బెట్టుకొని స్వర్గమునుండి కాశీకి వచ్చెను. కాశీ విశ్వేశ్వర, కేదారేశ్వరులను పూజించుటకొరకు స్వర్గములోని నందనవనము నుండి పాజాతములు తెచ్చెను. విమానము కాశీ చేరిన వెంటనే ఆకాశమున సంచరించు శివగణములు విమానమును నిల్పివేసి మేనకతో, నీవు తీసికొనివచ్చిన ఈ దుర్ధరుడు పరమ పాతకుడు. ఇతనిని కాశీలోనికి అడుగు పెట్టనివ్వము. వానిని కాశీవెలుపలే వదని నీవు వెళ్లి స్వామిని అర్చించి రమ్మనిరి. కోటి కల్పాంతములవరకు నరకయాతన అనుభవింపపలసిన ఈపాపిని వేరుకారణమున యముడు నీ వద్దకు పంపియుండవచ్చును గాని, వీనికి కాశీ ప్రవేశార్హతలేదనిరి. అపుడు మేనక వారిని ప్రార్ధించి సర్వజ్ఞుడయిన యముడు వానిని ఉద్ధరించుటకు నావద్దకు పంపిరి గనుక మీరు వానిని కరుణించి జ్ఞాన దృష్ఠితో పరికించి వానికి తరుణోపాయము తెల్పుడనగా, శివగణము ఆమె కోరికపై జ్ఞనదృష్ఠితో దుర్ధరుని వృత్తాంతము తెలిసికొని మేనకతో అమ్మా ఈపాపి విషప్రయోగముతో చంపనుంకించిన శివానందుడను యోగిపుంగవుడు నిగ్రహానుగ్రహ సంపన్నుడై యిపుడు కాశీలో నున్నాజు. జ్ఞనదృష్ఠితో ఇతడు చేసిన దుశ్చర్య తెలిసియూ ఇతడు మహాపాపియయినను అతని మనసులో ఇతనికి శుభము కల్గవలెనని తలంచి అతడే ఇతని దహన క్రియలు సల్పినాడు. దుర్ధరుని ఇక్కడ వదలి, నీవు వెళ్ళి ఆమహాత్ముని దర్శించి విషయములను వివరించి అతని ఆదేశానుసారముగ ప్రవర్తించమని శివగణము మేనకతో చెప్పి ఆ శివానందయోగిని తెలిసికొనుట కష్టము. అతడు సాధారణముగా కన్పించు వ్యక్తిగాడు. కాశీలో తపోధనులందరు, శ్రావణ సోమవారమున, విశేషముగ పూర్ణిమతో చేరిన శ్రావణ సోమవారమునను, మూడులోకములలోని వారు శ్రీకాశీకేదారేశ్వరుని సేవించుటకు వచ్చెదరు. కార్తీక పూర్ణిమ, విశేషముగ సోమవారము కలిసినచో, ఆమాస ఆర్ద్రా నక్షత్రమునాడు, పుష్యమాస పుష్యమీ నక్షత్రమునాడు మాఘమాస మఖ నక్షత్రమునాడు, ఫాల్గుణమాస పూర్వ ఫల్గుణి నక్షత్రమునాడు, చైత్రమాస చిత్ర నక్షత్రమునాడు, వైశాఖమాస విశాఖ నక్షత్ర దినమున, జ్యేష్ఠమాస జ్యేష్ఠా నక్షత్రదినమున, ఆషాఢమాస పూర్వాషాఢ నక్షత్రము రోజున, భాద్రపద మాసమున ఉత్తరాభాద్ర నక్షత్రమునాడు, మరియు ఆశ్వీయుజ పౌర్ణమి దినములలో త్రలోకములలోని తపస్వులందరు కాశీని సేవించుటకు వత్తురు. వీరందరు విశ్వేశ్వరాది దేవతల దర్శనానంతరము కేదారేశ్వరుని సేవించుటకు తప్పక వచ్చెదరు. వారిలో నీవు శివానందుని గుర్తించి ప్రార్ధింపగలవు. నీ పుణ్య విశ్షమున ఈరోజే శ్రావణ పూర్ణిమ. విశేష సోమవారమయినది. అందరకూ కన్పించకపోయినను అతడు నీకు దర్శనమిచ్చును. ఎందుకనగా పరోపకారపరాయణులకు దర్శన మిచ్చుట అతని నైజము. అని పలుకగా మేనక దుర్ధరుని, విమానమును అక్కడవదలి మనోవేగముతో కాశీలోనికి ప్రవేశించెను. విశ్వేశ్వర దర్శన మణికర్ణికా స్నానములాచరించి శ్రీ కేదారేశ్వర మందిరముచేరి నమస్కరించి పూజించి వేయికన్నులతో శివానందయోగి దర్శనార్ధము నాల్గుమూలల పరికించుచుండెను. తూర్పు ముఘద్వారము నుండి క్రిందకు చూడగా సహస్ర కిరణ సూర్య ప్రకాశముతో ఒక యోగి ప్రాచీన మణికర్ణిక తీర్థము వద్ద కన్పించెను. అతడే శివానందుడు. విశ్వేశ్వర, మణికర్ణికల నర్చించి శివాపరాధ నివృత్త తీర్థమగు హరంపాప/ రేతోదక/ గౌరీకుండ/ ప్రాచీన మణికర్ణికకు వచ్చి స్నానమొనరించినంతెనే మేనక అతని పాదములపై వ్రాలి మహాత్మా నన్ననుగ్రహింపుడని వేడగా, శివానందులు చిరునగవుతో అప్సర సామణి శుభమేగదా యనగా, మేలక సర్వజ్ఞా! మీ కృపకు పాత్రురాలనగు నాకేమి కొదువ? ఇపుడు నేను వచ్చిన కార్యము సానుకూలమగునట్లు వరమిండనిగా, మరల శివానందులు నవ్వి, మేనకా! నీవు పరోపకార బుద్ధితో బయలుదేరినది మొదలుగా నేను జ్ఞానదృష్టితో తిలకించుచుంటిని, నీవు ఈ తీర్థ జలము, కేదారేశ్వర నిర్మాల్య బిల్వపత్రము తీసికొని వెళ్లి దుర్ధరునిపై వేసిన యడల శివగణము వానినడ్డగించక లోనికి రానిత్తురు. అపుడు నీవతనిని తీసికొని నావద్దకు రమ్మని చెప్పగా, మేనక మహాప్రసాదమని యోగిచెప్పినవిధముగా తీర్థ జలము, బిల్వపత్రములు దుర్ధరునిపై వేయగా మహాశ్చర్యముగా అతని దేహమునుండి కాకులు, గద్దలు, గుడ్లగూబలు, కొంగలు, కుక్కలు, గాడిదలు, పులులు, సింహములు, ఎద్దులు, బఱ్ఱెలు, ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలు, తోడేళ్ళు, పిల్లులు, జింకలు, పాములు, తేళ్ళు, మల క్రిములతో సహా క్రిమికీటకాదులు మొదట బయటకు వచ్చిన తర్వాత, బ్రహ్మరాక్షస, భేతాళాది కోట్లకొలది పిశాచములు హాహాకారములు చేయుచు నల్లని కాలిన శరీరములతో పర్వతాకారములు గల్గి బయటపడినావారు రోదించుచు ఆకాశమున నిల్చిరి. ఇంకనూ మహాశ్చర్యముగ దుర్ధరుని శరీరమునుండి సూర్యకిరణములవలె మెఱుపులు బయల్వెడలి ఆకాశమునంటి మొదటినుండి అతని శరీరమునుండి బయటకు వచ్చిన అండజ, స్వేదజ, జరాయుజ, పిశాచాదులనన్నిటిని భస్మమొనర్చి మరల అతని శరీరమునకు వచ్చి అదృశ్యమయినవి. అట్లు భస్మమయిన పొగ యంతయూ ఆకాశమును కప్పివేసి ఆకాశము నీలిమయినది. ఈ అద్భుత దృశ్యముచూచి చకితురాలయిన మేనక శివగణమును ప్రార్ధించి ఆవింతను గురించి తెల్పుడనగా, వారు దుర్ధరుడు క్రితము జన్మలలో చేసిన పాపమునకు గాను అతనినుండి బయల్వెడలిన అన్నిరకముల భూత యోనులలోను నూరు, నూరు సంవత్సరములు జీవించవలసి యున్నది గనుక అవన్నియూ వాసనారూపమున ఇతని అంతఃకరణమందు నిల్చియున్నవి. నీవు అతనిపై చిలికిన తీర్థమహాత్మ్యమున, కేదారేశ్వర నిర్మాల్య బిల్వస్పర్శవలనను అవన్నియూ నిల్వలేక బయటపడి రోదించుచుండగా, మరల అవి అతనినాకర్షించకుండుటకు తీర్థమహాత్మ్యమున అతనిలో ప్రవేశించిన శక్తి కిరణములు వచ్చి వానిని భస్మమొనరించి మరల అతనిలో చేరినవని చెప్పి అంతటి మహోపకారము తలపెట్టిన మేనకను ప్రశంసించి ఇప్పుడతనిని కాశీలో ప్రవేశించుటకు అనుమతింతుము, వెంటనే తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేయుమనిరి. ఇదంతయు జ్ఞానదృష్టిచే తెలిసికొనిన శివానందుడు నిన్నిట్లు ఆదేశించెను. ఇదంతయు తెలిసిన మేము నిన్నతనివద్దకు పంపితిమనిరి. మేనక వారికి నమస్కరించి దుర్ధరుని తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేసెను. యోగి ప్రసన్నుడై తన పాదముల చెంతనున్న దుర్ధరుని లేవనెత్తి విధివిధానముగా ప్రాచీన మణికర్ణికా స్నానము చేయించగా మరొక వింత జరిగినది. దుర్ధరుని శరీరమునుండి ఒక స్వచ్ఛ మైన తెల్లని హంస బయటకు వచ్చి యోగికి నమస్కరించి నేను ఇతని అంతఃకరణమును. ఒకనాడు ఈతడొకపుష్పమును శివార్పణమన్న కారణమున శివ పుణ్యమను నేను శ్వేతహంస రూపమున ఇతనియందు చేరితిని. ఇతడు చేసిన మహాపాపములు నన్ను హింసించినవి. ఇపుడు మీదయవలన అన్నియూ ధ్వంసముకాగా నేను సుఘముగా మీ దర్శనమునకు బయటకు వచ్చితిని. ఇతడు చపల చిత్తుడు. మరల నేనితనిలో ప్రవేశించిన యడల మరల పాపములు చేసి నన్ను బాధించును గనుక మీ ఆజ్ఞ ప్రకారము నేను ప్రవర్తింతును. ఇతనిలో చేరుటయా లేక మిమ్ము సేవించుటయా అని ఆ హంస శివయోగిని ప్రశ్నింపగా యోగి ఆ హంసతో ఇట్లనెను. ఈతడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. ధర్మభ్రష్టుడే అత్యంత పాపి అయినాడు. సర్వభక్షకుడై అగామగామియై నీచజాతి స్త్రీలోలుడై దశార్ణదేశమున మ్లేచ్ఛుల సహవాసమున మ్లేచ్ఛ స్త్రీలంపటుడై ఒకనాటి రాత్రి గ్రామము వెలుపల ఒక వనములో శిధిలమైన ఒక సోమేశ్వర దేవాలయమున ఆ స్త్రీ సంగమము కొరకు తీసికొని వెళ్లి, తన వస్త్రముతో గర్భాలయమును శుభ్రముచేసి ఆ వస్త్రమును వెలుపలకు విసిరివేసి, ఆ స్త్రీకొరకు తెచ్చిన మాలలు, తాంబూలము ఆ చీకటిలో తడుముకొనుచి ఎదో రాతి దిమ్మయని తలచిన శివలింగము పైనుంచి, ఆ స్త్రీని చేయిపట్టుకొని లోనికి తీసికొనివచ్చి అనుభవించు సమయమున ఆ మాలలు, వగైరా తీసి ఆ స్త్రీకి సమర్పించెను. తెలియక చేసిననూ ఆ పుష్పమాలలు, విడియము, శివార్పితమయిన పుణ్యమున ఇతడు కాంచీ క్షేత్రమున ఒక వెశ్య పుత్రుడుగా జన్మించెను. ఇతని తల్లి వేశ్యయై వర్ణ సంకరమయిన కారణమున, అట్టి గర్భజనితుడు ఇతని బుద్ధి భ్రష్టమయినది. పరమ పాపి అయినను, మాలలు విడియము క్రితజన్మ యందు శివుని కర్పించిన కారణమున, తన చేతినుండి జారిపడిన పుష్పమును తనకు తెలియకనే శివార్పణమను పదము తన నోటిద్వారా ఉచ్ఛరించిన కారణమున శివాజ్ఞచే శివపుణ్యమము నీవు హంసరూపమున ఇతనిలో ప్రవేశించితిని. నీమహిమయే యమధర్మరాజు చే మరల ఆలోచింపజేసి, తెలియక చేసిననూ ఆ ఒక్క పుణ్య ఫలము ఇతనిని స్వర్గమందు మేనకవద్దకు పంపినది. ఆమెకు ఇతనిని ఉద్ధరించి ఉద్దేశ్యము కల్గినది. కాశీ ప్రాచీన మణికర్ణిక జలము, కేదారేశుని నిర్మాల్య పుష్పములు తాకినంతనే అతనిలోని పాప సముచ్ఛయమంతయూ నిర్గమించి భస్మమయినదు. ఇతని కింకనూ మంచి జరుగనున్నదని శివయోగి వచించెను. అపుడు శివపుణ్యమను హంస మరల దుర్ధరుని అంతరాత్మను చేరినది. ఈ సంవాదమంతయు మేనకకు అవగతమయినది. కాని దుర్ధరునికి తెలియదు. శివానందులు మేలక, దుర్ధరులను కేదారేశ్వరుని వద్దకు తీసికొని వెళ్లి, నందన వనము నుండి మేనక చే తేబడిన పుష్పములచే కేదారేశ్వరుని వారిద్దరిచే పూజింపజేసెను. ప్రదక్షిణ నమస్కారముల తర్వాత కేదారేశ్వరుని స్తుతింపగా పరమేశ్వరుడు వృషభ వాహనుడై పార్వీ సమేతుడై, వినాయక, షణ్ముఖ, శివగణ సమేతుడై శివానందులకు దర్శనమిచ్చి, నాకు అత్యంత ప్రీతిపాత్రుడవగు నీ కృపకు పాత్రుడైన ఈ దుర్ధరుడు ప్రతిష్ఠానపురమున రాజ కుమారుడుగా జన్మించును. అక్కడ రాజు తపమాచరించి నన్ను కుమారునిగా పొందగోలెను. అతనికి నా అనుగ్రహమున ఈ దుర్ధరుడు కుమారుడు కాగలడు. శివభక్తి పరాయణుడై కాశీకి వచ్చి విశ్వేశ్వర, మణికర్ణిక, కేదారేశ్వరాదుల నర్చించి అధిక సంపన్నుడైనందున బ్రాహ్మణులను సత్కరించి, తపో యోగమార్గముల నవలంబించి సార్వభౌముడై, నా అనుజ్ఞచే బ్రహ్మద్వారా వరములు పొంది ఈ కాశీ పట్టణమునకు దివోదాసను పేర రాజగును. దేవతలను మించిన శక్తి సంపన్నుడై తపోబలముచే పంచ భూతములను తిరస్కరించి తానే వారి కృత్యములు చేయుచు, నా మాయామొహమున కాశీలోని దేవతలనందరనూ నాతో సహా కాశీనుండి బయటకు పంపివేసి, తుదకు విరక్తుడై మాయ వదలగనే నా పదము పొందును. కనుక ఇతనిని మేనకతో స్వర్గమునకు పంపి తృప్తి తీరునంతవరకు స్వర్గసౌఖ్యమనుభవించి తదుపరి భూలోకమున ప్రతిష్ఠానపుర రాజకుమారునిగా జన్మింప నిమ్మని పరమేశ్వరుడు శివయోగికి చెప్పి అంతర్ధానమయ్యెను. శివానందులు ఆనందపారవశ్యమున శివుని స్తుతించి మేనకా దుర్ధరులను స్వర్గమునకు పంపెను. దేవతలెట్లు సద్యఃఫల సిద్ధి బొందుదురో అట్లే మనుష్య దేహధారులును శివభక్తి పరాయణులగుచో సర్వసౌఖ్యమున ననుభవించి తుదకు ముక్తి బొందుదురు. అట్లు శివానందుని అనుగ్రహ పాత్రుడయిన పరమపాపియు దురాత్ముడగు దుర్ధరుడే దివోదాసుగా కాశీని పరిపాలించి దేవతలనేధిక్కరించి, చివరకు పరమాత్మనే మందరాచలమునకు పంపివేయగల సమర్ధుడాయెను. తన భక్తుల కీర్తి ప్రబలుటకై శంకరుడునూ లీలా విలాసము చేయుచుండును. ముల్లోకములయందు కాశీ క్షేత్రము, విశ్వేశ్వర, మణికర్ణికాది సేవనము ప్రబల పాపహరములు. శివాపరాధమను ఘోరపాపము మాత్రము ప్రాచీన మణికర్ణికా స్నానము, కేదారేశ్వర సేవనమున మాత్రమే విముక్తమగును.

ఇట్టి కాశీమూల రహస్యమగునది శివాజ్ఞచే నాకు స్ఫురించి మీకు తెల్పితినని సూతుడు వచించెను. కాశీలో అడుగడుగుననూ గల తీర్థములు, లింగముల మహిమ ఆ శివునికే తెలియును గాని అన్యులెరుగరు. కేదారేశ్వర, ప్రాచీన మణికర్ణికల మహిమ తెలియుట దుర్లభము. దేశాంతరమందు, కాశీ తక్క మరెక్కడ నయిననూ చేసిన పాపములకు సూర్యపుత్రుడు యముడు దండనాయకుడు. కాని కాశీలో అతనికి స్థానము లేనందున కాశీలో పాపులను శిక్షించునది కాలభైరవుడు. కాశీలో శివాపరాధులకు నిష్కృతి లేనేలేదు. కాశీలో మరణించువారు ముక్తులగుదురు. కాశీలో కొద్ది ధర్మమయిననూ అమోఘ ఫలమొసంగును. ఒక్క పర్యాయమైనను కాశీ దర్శించి వెళ్ళి వేరెక్కడ మృతిచెందినను వారికి మరుజన్మగాని తదుపరి జన్మగాని కాశీలో తథ్యము. కాశీ మృతి వెంటనే జన్మరాహిత్యకారకము. కృత, త్రేతా, ద్వాపరయుగముల కంటె కలియుగమున కలిదోషముచే జీవులు శివాపరాధులగుదురు. అట్టివారికి తరుణోపాయము కాశీలో ప్రాచీన మణికర్ణిక, కేదారనాథ సేవనము తక్క వెరొండులేదు. ప్రేమపాత్రులగు సతి, గౌరి, రావణాసులులకే మోహవసమున శివాపరాధ దోషము ప్రాప్తించి వారికిని కాశీ ప్రాచీన గంగ, కేదారసేవనముల వలననే తద్దోష నివారణ జరిగినదన సాధారణ జీవుల గతి చెప్పవలెనా! యని సూతముని చెప్పగా శౌనకాదులు సంతసించిరి.

సప్తదశోధ్యాయము

మునులు సూతునితో, మహాత్మా! మీరు శివరహస్యకోవిదులు. లేశమాత్ర శివ నామస్మరణ మహాపాపియగు దుర్ధరునికి స్వర్గప్రాప్తి కల్గించినది. శివజ్ఞానికి అతనిపై గల్గిన కృపాలేశము యమధర్మరాజుకు అతనిపై దయ గల్గునట్లు చేసినది గనుక జీవతమున శివభక్తి రహస్యమును గురించి వినని జన్మ వ్యర్థము. దయచేసి మేనక అతని నెట్లు ఉద్ధరించినది తెల్పుడని కోరిరి. సూతుడిట్లు వచించిరి.

దేవకన్య మేనక దుర్ధనునెట్లు ఉద్ధరించుటాయని ఆలోచించి అతనినోదార్చి తను కైలాసమందు పరాశక్తి దర్శనము చేసికొనివచ్చువరకు అతనినక్కడే ఉండమని చెప్పి వెళ్ళెను. కైలాసమందు శివభక్తులు దేవిసేవకై దుర్వాస, గౌతమ, కణ్య, దధీచి, అంగిరస, భృగు, నారద, ఉపమన్యులు బ్రహ్మవాద శ్రేష్ఠులు ఎనమండుగురు మొదట శైలాదు గణేశ, కార్తికేయులను సేవించి తదుపరి పరమేశ్వరుని అర్చించి పరాశక్తిని పూజించుటకై అమ్మవారి వద్ద చేరిరి. అమ్మవారిని అనేక విధముల స్తుతించి తల్లి ఆజ్ఞమేరకు అక్కడ వేచియున్న సమయమున మేనక అక్కడకు చేరి వారందరకు నమస్కరించి అమ్మవారిని ఆనందపరచుటకై నాట్యము చేయనారంభించెను. పరాశక్తి చాలాకాలము నాట్యము చూచి ఆనందించి శివభక్తులనుద్దేశించి బ్రాహ్మణోత్తములారా ఎక్కడనుండి వచ్చినారు? ప్రపంచమున మీరు చూచిన గొప్ప ఆశ్చర్యకరమైన వింతలేమని ప్రశ్నించిరి. దానికి ముందుగా నారదమహర్షి తల్లీ! శివపార్వతులకు అపరాధము చేసినవారికైనను మంచి జరుగవచ్చును కాని మీభక్తులకపరాధము జేసినవారు నిశ్చయముగ శిక్షార్హులు. రావణాసురుడు బ్రహ్మవరములు పొందిన గర్వముచే కైలాసమునెత్తుటకు ప్రయత్నించి మీకపరాధముసల్పెను. అట్టిపాపోపశమనమునకు మిమ్ములను స్తుతించి తనగానముచే మిమ్ము మెప్పించి మీవద్ద రహస్య ఉపదేశము పొంది కాశీ వెళ్ళి గౌరీకుండస్నానము, కేదారేశ్వర దర్శన అర్చనలతో పాపనివృత్తి పొందెను. ఆ శాపమును మీరునూ తొలగించలేని కారణమున మీకత్యంతభక్తుడయిననూ కులముతో సహానాశము పొందెను.

మీభక్తసిఱోమణి ఈ దూర్వాసుడు మీచే ప్రసాదింపబడిన మాలను ఇంద్రునకు ఇవ్వగా అతడు దానిని భక్తితో స్వీకరింపక గర్వముతో ఐరావతము తలపై వేసెను. ఆ ఏనుగు మదముతో దానిని వేలపై విసిరి తొక్కివేసెను. ఇంద్రుడీ సంయమీంద్రుని వాక్కుతోనైననూ స్తుతింపక శాపగ్రస్తుడై రాజ్యభ్రష్ఠుడై, దుఃఖితుడై, రాక్షస భయముచే మందర పర్వత గుహలో తలదాచుకొని కడకు మునీంద్రుని శరణుజొచ్చి, ఇతడు దచతలచి ఉపదేశము చేయగా కాశీవెళ్ళి గౌరీకుండ క్నానము, కేదారేశ్వరుని అర్చనతో మీభక్తులకొనర్చిన అపరాధమునుండి ముక్తుడాయెను. మహాయోగిపుంగవుడు గౌతముడు మీభక్తాగ్రగణ్యుడు. ఇతనికి అపరాధము చేసి ఇంద్రుడు సహస్రయోనిజుడై నపుంసకుడాయెను గదా! దేవతల ఎగతాఱికి గురై బుధ్ధిగల్గి ఇతని ఏకాంతమున శరణుజొచ్చి క్షమింపవేడగా గౌతముడు కరుణించి కాశీలో గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చనము వలన మరల పుంసత్వము గల్గునని శుభము గల్గునని ఉపదేశింపగా అతడట్లేచేసి మరల అసురులను గెల్చి స్వర్గాధిపత్యము పొందెను. బాణుడు మీభక్తుడయినను కణ్వమహామునిని అనాదరించి సర్వమును కోల్పోయెను. యదువంశజులు కృష్ణుని ద్వేషించి యుద్ధమునకు వెళ్ళబోవగా వారికి కృష్ణుడు పాశుపతుడని తెలియజెప్పి అతని మనుమని వదలివేయమని బోధించితిరి. భక్తుని ద్వేషించువారిని శంకరుడునూ రక్షింపడు. కణ్వుడు ఏకాంతమున బాణునకు మంచి బోధించిననూ వినక మదగర్వముతో గురుధిక్కారము జేసి ఎదిరించి తనసహస్రబాహువులను గోల్పోయి రెండు భుజములవాడాయెను. అపుడు శుక్రాచార్యుడు బుద్ధిచెప్పి కణ్వమహర్షి శరణుజొచ్చి శివభక్తులకు అపరాధమొనరించి ఈ అనర్ధము తెచ్చికొంటినని చెప్పి ప్రార్ధించమని హితవుపలుకగా యుద్ధ భూమియందున్న బాణుడు మానసికముగ కణ్వమహర్షిని ప్రార్ధించెను. మహర్షి దానిని స్వీకరించి ప్రసన్నుడై అతనిని కాపాడమని శంకరుని వేడెను. తనభక్తుని అనాదరణకు కోపించిన శంకరుడు మహర్షి ప్రార్ధనకు శాంతించి వానినట్లు రెండు భుజములతో వదలి కాశీకి వెళ్ళి కేదారేశ్వరుని ఎదుట గౌరీకుండమున స్నానమాడి కేదారేశ్వరుని అర్చించి పాపవిముక్తుడవైనన్ను చేరగలవని కరుణించెను. బాణుడట్లేచేసి తనపేర శివలింగ స్థాపన జేసి శివపదము జేరి గణములలో ముఖ్యుడాయెను.

ఇంకనూ ఈ ఉపమన్యుమహాత్ముని చంద్రుడు పరిహసించి క్షీణబలుడయ్యెను. శివప్రసాద బలమున ఇతడు క్షీరసాగర మానము జేయబోగా చంద్రుడు నవ్వి పరిహాసముగా, ఎంతత్రాగగలవు?బ్రాహ్మణుని ఆశకు హద్దులేదు. సముద్రమెంత! నీవెంత! సముద్రమును పానము జేయగలవా? శివునికి కూడ బుద్ధి చాంచల్యము చేనీకు సముద్రునిచ్చెను. అని హేళనచేయగా ఉపమన్యు కోపించి మూఢుడా, శివభక్తుల ప్రతాపను నీవెరుంగవు. శివ భక్తాగ్రగణ్యుడు, యోగిపుంగవుడు, ఘటమున అంగుష్ఠమాత్రమూగా ఉద్భవించిన అగస్త్యమహర్షి ఈ సముద్రమును జలబిందువుగా కరమున గ్రహించి ఆచమనము చేసెను, మరల అల్పాచమనముగా విడిచినందున సముద్రము అపవిత్రమైనది. మహోన్నతుడయిన వింధ్యపర్వతమేమైనది? ఉత్వలుడు, వాతాపి ఎమైరి? ఒక్క వాక్కుతో మరణించిరి. నీవు అత్రిపుత్రుడవై, శివుని తలనెక్కి, క్షీరసాగరమున ఉద్భవించి, మూడులోకములను ఆనందపరచుచు నక్షత్రరాజువైననూ, గురుతల్పదోషమునకు శివుడు కోపించి నిన్ను సమాప్తిగావించతలంచెనుగాని మీమాత అనసూయ పార్వతికి ఇష్టురాలైనందున తల్లి కోరికపై శంకరుడు నిన్ను వదిలివేయగా ఆతల్లి నిన్ను రక్షించుకొనెను. గనుక బ్రాహ్మణుని అవమానించిన ఫలితము నీవిప్పుడే అనుభవింతువని పల్కి ఉపమన్యు వెళ్ళిపోయెను. అదేసమయమున గణపతి తన ఎలుగ వాహమనుపై మేరుపర్వతమున తోటి బాలురతో విహారమునకు వెళ్ళగా చంద్రుడతనిని చూచి పరిహసించెను. ఎలుక వాహనము పర్వతము అంచున పరుగెత్తుచూ జీరి పడిపోగా గణేశుడు నేలపై పడుటచూచి చంద్రుటు వికట్టహాసము జేసెను. గణపతి దానిని సహింపలేక కోపించి మనోదృష్ఠిచే భస్మము చేయనెంచి చంద్రుని చూచి మూఢా! ఈనాటినుండి నీప్రకాశము క్షీణించి దేవతలు నిన్ను మింగివేయుదురు. నిన్ను చూచిన త్రిలోకవాసులు అవమానములు పొందెదరు. అని లోకపాలకులను చంద్రుని కళలను మ్రింగివేయుడని ఆజ్ఞాపించెను. వెంటనే మొదట అగ్ని, తరువాత సూర్యుడు, విశ్వేదేవుడు, సముద్రుడు, వషట్కారుడు, ఇంద్రుడు, దేవర్షులు, అజైకపాదుడు, యముడు, పవనుడు, శక్తి, పితరులు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ ఇట్లు 15 కళలు 15మంది లాగవేయగా గణపతి చంద్రుని 16వ కళను విష్ణుమూర్తికిచ్చెను. కాని విష్ణుమూర్తి దానిని హరింపక, దయతో గణపతిని మహానుభావా త్రైలోక్యవాసులు చంద్రుడు లేక జీవింపలేరు. ఒక్క కళతోనైనను ఇతనిని బ్రతకనిండు. అపరాధులకు మీరేదిక్కు అని వేడగా గణపతి, ఈతడు శివభక్తులనవమానించినాడు. నాభక్తుల అవమానము నా అవమానముకన్న గొప్పది. కనుక నాభక్తుడే అతనికి దిక్కు లేనిచో ఇతని గతికి ఇతనిని వదిలివేయవలసినదే. అనగా చంద్రుడు భయముచే కంపించి విష్ణువును ప్రార్ధించి సముద్ర గర్భమున యున్న ఉపమన్యు చరణములపై వ్రాలి రక్షింపప్రార్ధించెను. అపుడు ఉపమన్యు శాంతించి నవ్వుచు, నీకు శుభమగుగాక! నీవు గణేశుని కూడ అవమానించినందున వెంటనే వెళ్ళి ఆయన శరణు వేడమని పంపెను. చంద్రుడు విష్ణుమూర్తి సహాయమున గణేశుని శరణుజొచ్చి బ్రతికింపగోరెను. అపుడు గణపతి కరుణించి, అల్పుడా! నా అవమానము, మా మాతా పితరుల అవమానము కంటె మాభక్తుల అవమానము సహింపరానిది. నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని ఎదురుగానున్న గౌరీకుండమున స్నానముజేసి కేదారేశ్వరుని పూజించి నీపేర లింగప్రతిష్ఠచేసి నిత్యము పూజించుచున్నయడల క్షీణించిన ఒక్కొక్కకళను క్రమ క్రమముగ మరల పొందగలవు. ఇట్లు 15గురు దేవతలచే భక్షింపబడుచు మరల పొందుచు జీవింతువు. మాభక్తులను అవమానించినందులకు నీకీశాస్తి తప్పదని చంద్రుని విష్ణుమూర్తితో సహా కాశీకి పంపెను. చంద్రుడు గణేశుని ఆజ్ఞనిర్వర్తించి జీవించుచుండెను.

నారదుడికనూ, తల్లీ! నీకు తెలియనిదేమి, నీ పూర్వజన్మ జనకుడు దక్షప్రజాపతి, శ్వభక్తుడయినను సభలో దధీచి నవమీనించి ఎగతి పొందెను! అతనిని నిందించిన కారణమున యజ్ఞము ఒక్క క్షణములో భంగమై అతనికి సహాయము జేయబోయిన సూర్యుడు పండ్లువిరిగిన వాడాయెను. దక్షునకు మేకతల ప్రాప్తించి అట్లే శివాజ్ఞపై కాశీకి వెళ్లి గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చన, తనపేర శివలింగస్థాపన పూజల వలన, మేకతలతో తిరిగి వచ్చి "చమక" మన్నపర శివస్తుతి జేసి మరల తనపదవిని పొందెను.

ఇక ఈ భృగుమహర్షి మీ భక్తాగ్రగణ్యుడు. పుణ్యాత్ముడు. విష్ణుమూర్తి మొదట ఇతని భార్యను చంపి పాపమాచరించెను. అట్టి అపరాధమునకు విష్ణుమూర్తి జన్మలనెత్తవలసి వచ్చినది. కాని మీకృపవలన దశావతారములతో పాప పరిహారమైనది. మరల జన్మలేకుండ వరము పొందినను భృగు భార్యా వియోగ దోషమున విష్ణువు రామావతారమున భార్యా వియోగమనుభవింపవలసి వచ్చినది. తదుపరి శివాజ్ఞపై కాశీలో గౌరీకుండస్నానము, కేదారేశ్వర పూజలు, అభిషేకముజేసి, తనపేర లింగప్రతిష్ఠజేసి నివృత్తి పొందెను.

ఇక అంగీరసముని విషయమున, పూర్వము నహుషుడను రాజేంద్రుడు విధివిధానముగ యజ్ఞముచేసి ప్రజారంజకముగ పాలన జేసెను. యజ్ఞమందు ఏనుగు తొంజమంత వశోధారతో 12 వర్షములు అగ్నిదేవుని తృప్తి పరచగా అగ్నికి అజీర్ణరోగము వచ్చెను. సర్వభక్షకుడగు అగ్నియే అజీర్ణరోగవిముక్తికి బ్రహ్మను ప్రార్ధించెను. బ్రహ్మ ఆలోచించి నహుషుని దివ్య యజ్ఞమునకు చకితుడై అగ్నిదేవుని ఆజీర్తి శాంతింపజేయుటకై, పృధ్విపైగల ఇంద్రుని ఖాండవవనమందు అజీర్తి ఉపశాంతికి తగిన ఓషధులు గలవు దానిని భక్షింపుమనిచెప్పి, దానిని చేరుట కష్టమయిననూ ప్రయత్నింపుమనెను. అగ్ని వెంటనే వెళ్ళి దహింపబూనగా ఇంద్రుడు మేఘముల నాదేశించి అగ్నిని ఆర్పివేసెను. ఎన్నిమార్లు ప్రయత్నించిననూ మేఘములతో గెలువలేక అగ్ని మరల బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకొనెను. బ్రహ్మ మరొక ఉపాయమాలోచించి విష్ణుమూర్తి అంశతో నరనారాయణులు కృష్ణార్జులులుగా పృధ్విపై అవతరించియున్నారు. వారిని శరణుజొచ్చి ప్రార్ధించి ఖాండవ దహనమునకు నీకు సహాయము చేయమని కోరుమని సలహా యిచ్చిరి. అగ్ని అట్లేచేసి తన అజీర్తి ఉపశమింపజేసికొనెను. అంతటి ప్రతిభావంతుడు నహుషుడొకమారు స్వర్గమునకు వెళ్ళగా ఇంద్రుడతనిని పూజించి , తనకు సమానముగా ఆసనమిచ్చి గౌరవించెను.

ఒకమారు ఇంద్రుడు వృతాసురుని చంపి భయముతో అదృశ్యుడైన సమయమున దేవతలు ఇంద్ర సభలో సింహాసనము ఖాళీగా యుండకూడదని ఇంద్రుడు వచ్చువరకు నహుషుని ఇంద్ర సింహాసనమున అభిషేకించిరి. నహుషుడు మదగర్వితుడై శచీదేవిపై మనసుపడి, భర్తజాడ తెలియక దుఃఖించుచున్న శచీదేవిని బలాత్కరించెను. అపుడు బృహస్పతి నహుషునితో, సచీదేవి పతివ్రత, తత్కాల సింహాసనాధిష్టత గర్వముతో శచీదేవినాసింపరాదని హితవు పలికి తన తండ్రిని అంగీరసునితో కూడ నహుషుని హెచ్చరింపమని పంపెను. నహుషుడు ఈ మహా యోగిపుంగవుని మాట నిరాదరించిన కారణమున ఇతడు కోపించి అధోగతి పాలగుదువని శపించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. నహుషుడు కొండచిలువగా భూమిపై పడెను. 10 వేల సంవత్సరములు సర్పముగా పడియుండి, హిమాలయ బిలములలో తపమాచరించు భక్తులను భక్షించి ఆకలి తీర్చుకొనుచుండెను. ఒకపరి పాంజు కుమారుడు భీముని మ్రింగివేయగా ధర్మరాజు తెలిసికొని అక్కడకు వచ్చి హేపాపీ! నా చిన్న తమ్ముడు భీముని మ్రింగితివి. నేను ధర్మరాజును. పాపఫలముగా పాము జన్మనెత్తియూ శివభక్తుల జంపుట నీ పూర్వజన్మపు శివభక్తులయడలి అపరాధమై యుండును. ఇపుడు నీవు మ్రింగిన నా తమ్ముడు భీముని వెడల గ్రక్కిన యడల నీకు మంచి జరుగును. శంభుని కృపవలన నీ కష్టములు తీరునని ధర్మరాజు చెప్పగా, అతని నోటినుండి శంభుని పదము చెవిని పడిన వెంటనే, ఆ అజగరమునకు పూర్వ స్మృతి గల్గి, భీముని వెడల గ్రక్కి యుధిష్టిరునితో, కుమారా! నేను మీవంశమునందు ప్రధముడను, నహుష చక్రవర్తిగా కీర్తింపబడినవానిని. అకారణముగా అగస్త్య, అంగీరసులతో ద్వేషము పెంచుకొని, ఆ శివభక్తులను అవమానించి ఈగతి తెచ్చుకొంటిని. వారిని ప్రార్ధించి ప్రసన్నులను జేసి నన్ను ఉద్ధరింపుమని బ్రతిమాలెను.

అపుడు ధర్మరాజు అంగీరసుని ఆదరపూర్వకముగ ప్రార్ధించి, అగస్త్యుని పూజించి నహుషుని అపరాధము మన్నింపుమని వేడగా, వారు ధర్మరాజుకు ఉపదేశము జేసి కాశీలో హరంపాప తీర్థస్నానము, కేదారేశ్వరుని అర్చనలవలన వాంఛితార్ధము సిద్ధించి నహుషుని పేర, ధర్మరాజుపేర లింగప్రతిష్ఠలు చేయుమని ఆదేశించిరి. ధర్మరాజట్లేచేసి నహుషుని ఉద్ధరించి తాను ముక్తుడాయెను. ఇట్లు శూర, పద్మ, కారణ్యాది దేత్యులెందరో బ్రాహ్మణ ద్రోహము జేసి గౌరీకుండ, ప్రాచీన గుప్త తీర్థ స్నానము, కేదారేశ్వర అర్చనల వలన ముక్తులైరి. విశ్వేశ్వర, మణికర్ణికల వలన కూడ అలవికాని పాపహరము, శివాపరాధ దోషనివృత్తి, హరంపాప తీర్థస్నాన, శ్రీకేదారేశ్వరుల అర్చనలవలన మాత్రమే నివృత్తి యగునని తెల్పి, తల్లీ శివుని కర్త, అకర్త, అన్యధాకర్త లీలలు నీ నిగ్రహానుగ్రహ ప్రసాదముల వలన జరుగని దేమున్నది. నేను చెప్పతరమా యని నారదుడు, తక్కిన బ్రాహ్మణులతో చేరి తలయొక్కి నమస్కరించి తల్లి అనుజ్ఞపై వారి స్థానములకు జేరిరి. కాశీక్షేత్ర తీర్థములు, విశ్వేశ్వర కేదారలింగములు దుస్తర దోషనివారకములు. శివభక్తులకు ముక్తిదాయకములు. ఆ సమయమున అక్కడ దేవి సన్నిధిలో నారదునిచే అమ్మవారికి వినిపింపబడిన ఈ వృత్తాంతమంతయు విని మేనక స్వర్గము చేరి దుర్ధరునితో అనునయముగా చింతించవలదనియూ, పాపపరిహారమున్నదనియూ తెల్పిన ఈశివ భక్తాగ్రగణ్యుల విశేష వైచిత్ర్యములను వినినవారు శివలోకము చేరుట తధ్యము. మేనక దుర్ధరునకు తాను దేవ బ్రాహ్మణులతో కూడి పరాంబిక వద్ద వినిన శివభక్తాగ్రగణ్యుల ప్రభావము, శివాపరాధుల పాప పరిహార మార్గములను వివరించి అతనికి ధైర్యము చెప్పి అతనినుద్ధరింప తలంచెను.