Sunday, June 21, 2009

ఆర్షధర్మము - మొదటి భాగము

1. నిద్ర మేల్కొనుట
“బ్రహ్మీ ముహూర్తే ఉత్థాయ”, “బ్రహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్య” అంటుంది ధర్మశాస్త్రం. బ్రహ్మ మూహూర్తం అనగా ఉదయం సూర్యోదయం అక్షాంశ రేఖను బట్టి ఏ ప్రదేశములో ఎన్ని గంటలకు జరుగుతుందో ఖచ్చితంగా తెలిసికొని దానికి ఒక మూహూర్తం అనగా రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషముల ముందు కాలం ఆసురీ ముహూర్తం, దానికి 48 నిమిషములు ముందు కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయములో భగవచ్చింతన జేయువారిని దేవతలు ప్రీతిగా ఆశీర్వదిస్తారని, మానవ మేథస్సునకు బ్రహ్మ సంకేతములు అందు కాలము ఆ ముహూర్తమనియు, ఆ సమయమున నిద్రించువారి పూర్వ జన్మల మరియు ఈ జన్మన ఆర్జించిన పుణ్యము కూడ క్షయమగుననియు వేద ప్రమాణము. బ్రహ్మ మూహూర్తమున ధ్యానం సత్ఫల దాయకము.

2. నిద్రనుండి మేల్కొని కనులు తెరుస్తూనే తమ అరచేతులను చూచుకొనుచు “కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీం తాం ప్రభాతే కర దర్శనం” అనే శ్లోకాన్ని మననం చేసికొని ముగ్గురు దేవేరిలను కుడి అరచేతిలో ఆవాహన జేసికొని కనులకద్దకొనవలెను. దీనివలన, మానవ సహజముగా కష్టం కలిగినపుడు ఈ రోజు లేస్తూనే ఎవరి ముఖం చూచామో యిలాజరిగినదని పరనింద జేసి పాపం మూటగట్టుకొనుట నివారింప వచ్చును.

3. భూమాత, భూదేవియని, భూమిని పంచ భూతములలోనొకటిగా ఆరాధించుట హైందవ సంస్కృతి. గనుక ప్రతి దినం “సముద్ర వసనే దేవి పర్వతస్థనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాద స్వర్శం క్షమస్వమే” యను శ్లోకాన్ని మననం చేసుకొని భూమికి నమస్కరించిన తర్వాత పాదాలు భూమిపై మోపాలి. ప్రతి యుగాంతం తర్వాత జలప్రళయం నుండి మరల భూమి ఉద్భవించి, దానిపై జీవరాసులు సృష్టింపబడి, ఆ భూమి నుండి వచ్చే ఆహారం ద్వారానే జీవులు బ్రతుకుచున్నప్పుడు, అలాంటి భూమిపై నడుస్తూ, ఉమ్ముతూ, మలమూత్ర విసర్జన చేస్తున్నాము. భూమాత కోపిస్తే భూకంపము, క్షామము ద్వారా వినాశము తథ్యము కనుక మన అపరాధములను క్షమింపవేడి నమస్కరించి భూమిపై కాళ్ళు పెట్ట వలెను.

4. పండ్లు తోముట, మలమూత్ర విసర్జన :
సూర్య చంద్ర గమనదిశలగు తూర్పు, పజమరలకు ఎదురుగా చేయరాదు. దంతధావనము ద్వారా, నోటిలో నురగలోనుండు సూక్ష్మ క్రిములు వేరుచోట్ల ప్రబలకుండునట్లు అటునిటు తిరుగకుండ ఒకేచోట చేయుట ఆరోగ్యదాయకము. మూత్ర విసర్జన నిలుచొని చేసినందున కొన్ని సమయములలో తల తిరుగుట, స్పృహతప్పుట ప్రత్యక్ష ప్రమాణములుగా తెలియుచున్నవి. అతి త్వరగా మూత్ర విసర్జన చేయవలసివచ్చినపుడు, కనులు మూసుకొని కూర్చొని చేయుట క్షేమమని డాక్టర్లు కూడ నిర్ధారించిరి.

5. స్నానము : చన్నీటి స్నానము ఉత్తమము. మొదట తలపైనుండి ఆరంభిచవలెను. క్రొత్తగా చన్నీటి స్నానం చేయుట వలన జలుబు చేయు ప్రమాదం కలదు కాని విడువకుండ అలవాటు చేసికొనినయడల ప్రశాంతత, మనోనిగ్రహం, ఏకాగ్రత, కంటికీ, మెదడుకు చలువజేసి కోపతాపాలనుండి ఉపశమనము పెద్దల అనుభవము. అట్టి ముఖ్యోద్దేశముతో హైందవ సంస్కృతి కార్తీక, మాఘస్నానాలని, దీక్షల పేరుతో మండలము రోజులు అనగా 48 రోజులు మూడువేళలా చన్నీటి తలస్నానం ఆదేశించిరి.

వేడినీటితో చేయునపుడు ముందుగా కాళ్లు తడుపుకొని ఆ తరువాత శరీరం తడుపకోవలెను.

శ్లో ॥ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా, సింధు, కావేరి జలే ऽ స్మిన్ సన్నిధిం కురు ॥

శ్లో ॥ గంగా గంగేతి యో బ్రూయంత్ యోజనానే శతైరపి
ముచ్యతే సర్వపాపే భ్యో విష్ణులోకం సగచ్ఛతి ॥

పవిత్ర నదులను స్మరించి మనము స్నానము చేయు నీటియందు ఆవాహన చేయుట వలన, గంగా గంగా యనుచు పుణ్య గంగానదీ స్నానానుభూతి పొందుట ద్వారా మానవులు పాప రహితులై విష్ణులోకమును బొందుదురని ధర్మశాస్త్రము.

స్నానం చేయునపుడు పురుషులు దిగంబరముగా మొలపై వస్త్రము లేకుండగను, స్త్రీలు వెంట్రుకలు విరియబోసుకొని నిలుచుండియూ స్నానము చేయరాదు. ఆ సమయమున భూత, ప్రేత, పిశాచములు ఆవహించు ప్రమాదము గలదు.

ప్రాతఃకాల స్నాన సమయము
తెల్లవారు ఝామున గం. 4 – 5 మధ్య ఋషి స్నానము. మహర్షులాసమయమున స్నానం చేయుదురనుటకు నిదర్శనం రామాయణమున అహల్యా శాప వృత్తాంతము.
గం. 5 – 6 మధ్య దైవ స్నానం. దేవాలయములలో దేవతా విగ్రహములకు ఆ సమయమున అభిషేకము నిర్వహింతురు.
గం. 6 – 7 మధ్య మానవ స్నానం. మానవులు కనీసం ఈ సమయంలోనయినా స్నానం చేయగలిగితే, స్నానానంతరం సూర్యునకు నమస్కారం చేసి ఆరోగ్యముగా నుండుటకు వీలగును. బ్రహ్మమూహూర్తంముందుగనే స్నానం చేసి కూర్యోదయం వరకు జప, తపాది అనుష్ఠానములు చేయువారు నిష్ఠాగరిష్ఠులగు, సనాతన సదాచార సంపన్నులగుదురు.
గం. 7 తరువాత రాక్షస స్నానం. నింద్యము.
స్నానం తరువాత ముందుగా ముఖము, తరువాత వక్షస్థలము, తరువాత శిరస్సు, ఆపై మిగిలిన అంగములు తుడుచుకొనవలెను. ఇట్లు చేయుట వైద్య శాస్త్రం ద్వారా సైనస్, నిమోనియా, జలుబు రాకుండగా కాపాడు కొనుటయే.

మానవ నిత్యాచరణ ధర్మములన్నియూ ఋషి ప్రోక్తములగు సాధారణ, శరీర వైద్య శాస్త్రమే.

పురుషులకు అభ్యంగన స్నానవారదోషములు:
ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం - కాంతి, మనోల్లాసము.
మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం - లక్ష్మీ కటాక్షము.
గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం - భోగము

గమనిక : పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు.

స్త్రీలకు మంగళ, గురు, శుక్రవారములు శుభములు.

సముద్ర స్నానము: ముందుగా మంచినీటి స్నానం చేసి వెళ్ళి సముద్ర స్నానము చేసి వచ్చిన వెంటనే మరల మంచినీటి స్నానం చేయవలయును. ఒకే సంవత్సరములో క్రమంగా ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమ దినములు సముద్రస్నానం మోక్షప్రదమగు వ్రతము. సముద్ర స్నానము ఒక ఘడియ (24 నిముషముల) కు పైగా చేసిన యడల మగవారిలో పుంసత్వము, ఆడవారిలో గర్భధారణ శక్తి తగ్గునని లోకోక్తి.

6. వస్త్ర ధారణ
స్నానానంతరం ఉతికి ఆరవేసిన పొడి వస్త్రములు ధరించి మూఖాలంకరణ చేసికొని దైవ ప్రార్థన చేయవలయును. తడి బట్టలతో శుభకార్యములు దైవ కార్యములు చేయరాదు. సంప్రదాయదుస్తులు ధరించి, అధునాతన అనుకరణలు విసర్జించుట సనాతన ధర్మము. సంప్రదాయ వస్త్రధారణ వలన తమ మనస్సు పవిత్రమై, ఇతరులను ఆకర్షించు పాపము నుండి విముక్తులగుదురు.

7. ముఖాలంకరణ
భస్మధారణ: హిందువులందరునూ విధిగా భస్మ ధారణ చేయవలయునని శివపురాణము వక్కాణించినది. పురుషులు మాత్రమేగాక స్త్రీలును త్రిపుండ్ర ధారణ చేయుట తమిళ సాంప్రదాయము.

శ్లో॥ శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనమ్॥
శ్లో॥ వినాభస్మ త్రిపుండ్రేన, వినా రుద్రాక్షమాలయా
పూజితో పి మహాదేవి నస్యాత్ తస్య ఫలం లభేత్॥
శ్లో॥ తత్సర్వం ఫలితం నాస్తి లలాటే తిలకం వినా
లలాటే సతతం దేవ్యాశ్రయ సహవిరాజితం
చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం॥
శ్లో॥ స్నానం, దానం, జపో, హోమం, సంధ్యా స్వాధ్యాయ కర్మసు
ఊర్ధ్వపుండ్ర విహీనశ్చ తత్సర్వం నిష్పలం భవేత్॥
శ్లో॥ శ్రాద్ధే, యజ్ఞే, జపో, హోమే, వైశ్వదేవే, సురార్చనే
ధృత త్రిపుండ్ర పూతాత్మా మృత్యుంజయతి మానవః॥

భస్మధారణ లేని ముఖమును, శివాలయము లేని గ్రామమును, శివార్చన లేని గృహమును, ఛీ, ఛీ, యనమని శివపురాణము. తాత్పర్యమేమనగా, హిందువులందరు తమ మతానుసారము విభూది, తిలకము, త్రిచూర్ణము, చందనము, మరేదయినను నుదుట ధరించి, ఆజ్ఞా చక్ర స్థానమగు భృకుటియందు పసుపుతో తయారు చేసిన కుంకుమ ధరించి, మెడలో రుద్రాక్ష మాలగాని, మరే మాలనయిననూ ధరించి దైవ ప్రార్ధన చేయుట వలన, పవిత్రతయే గాక దృష్టి దోష నివారణ కూడ జరుగును. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఒంటినిండా విభూది పూసుకొని త్రిపుండ్రములు ధరించి, పాశుపత దీక్షతో పంచాక్షరి జపించినట్లు పురాణముల గాధలు. నేటి కాలపు ముఖాలంకరణగా రంగుల రేఖలు, రంగుల బిళ్లలు ధరించుట ఆత్మహత్యా సదృశము. దేవతా విగ్రహములకు, పటములకు, మగవారు కూడ స్టిక్కర్లు ధరించుట విచారకరము.

8. మాలాధారణ
వక్షస్థలమున ధరించుటకును, జపమునకు బొటనవ్రేలు, మధ్యవ్రేలు, అనామికలతో మాలలోని పూసలను ముందుకు జరుపుటకును, వివిధ మాలలలో తంత్రసార శాస్త్రానుసారము తులసిమాల, శంఖమాల, పవడముల మాల, స్ఫటిక మాల, ముత్యాలమాల, పద్మాక్షమాల, సువర్ణమాల, కుశగ్రంధి మాలలు ఒకదానికన్న ఒకటి వరుసగా పది పది రెట్లు అధికఫలమొసంగును. ఇక రుద్రాక్షమాల అనంత ఫలదాయకము.

రుద్రాక్షమాలలము గురించి ప్రస్తుత కాలమున వారపత్రికలు, దృశ్యమాధ్యమముల (T.V.) ద్వారా వాణిజ్యప్రచారము ఎక్కువగా జరుగుచున్నది. కాని రుద్రాక్షలలో ఏకముఖి నుండి 14 ముఖములవరకు గలవాని విశిష్ఠత ప్రత్యేక మంత్ర బలము వలన సిద్ధించునేకాని, కేవలము ధరించినంత మాత్రమున సిద్ధించదని వేదవాక్యము.

9. ఆసనము
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయం 11వ శ్లోకంలో ధ్యానము, పూజలకు
శ్లో॥ శుచౌదేశే ప్రతిష్ఠాప్య స్థిరమానసమాత్మనః
నాత్యుచ్ఛితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥
అంటారు. మనసు భగవంతుని ఆరాధనలో లగ్నమగుటకు ఆసన ప్రభావం కూడ దోహదకారి. ఈ నాటి పరిస్థితులను బట్టి జింక చర్మంగాని, పులి చర్మంగాని లభించకపోయినా, సరాసరి నేలపై కూర్చొనకుండ పీటవేసికొని దానిపై దర్భాసనం, దానిపై చిత్రాసనం దొరకని యడల మెత్తని తెల్లని వస్త్రం వేసికొని కూర్చొనవలెను.
దర్భాసనం - పుష్ఠిని, కంబళి - దుఃఖవిమోజనమును, చిత్రాసనం - కామ్యసిద్ధిని, జింకచర్మం - జ్ఞానమును, పులిచర్మం - మోక్షమును, తెల్లని వస్త్రం - శాంతిని గల్గించును.
వెదురు - దరిద్రం, రాయి - వ్యాధి, నేల – దుఃఖము, కొయ్య – దౌర్భాగ్యము, గడ్డి - యశోహాని, చిగురుటాకులు - చిత్రభ్రమణము గాన వీనిని ఉపయోగింపరాదు.

10. ఇష్టదేవతా ప్రార్థన
84 లక్షల జీవరాసులను సృష్ఠించిన బ్రహ్మదేవునకు తనను తెలుసుకొను జీవిలేదను విచారముతో మానవులకు బుద్ధియను ప్రత్యేక గుణమును ప్రసాదించి జీవిత పరమావధిని తెలిసికొనునట్లు సృష్ఠించెను. కనుక ప్రతి మానవునకు ఇష్టదేవతా ప్రార్ధన ముఖ్యము. కోరికలతోనో, లేక కష్టములనుండి విముక్తి కొఱకో, లేక తప్పులకు క్షమాపణగానో గాక, మానవ జన్మనిచ్చినందులకు కృతజ్ఞతగా జన్మరాహిత్యము కొరకు నిత్యమూ ఇష్టదేవతా ప్రార్థన చేయుట విద్యుక్త ధర్మము. శుచిగా తూర్పుముఖముగా కూర్చొని దైవప్రార్థన చేయవలెను.

Saturday, June 6, 2009

ఆర్షధర్మము --- విన్నపము

విన్నపము

పూర్వజన్మల పుణ్య ఫలముగా భగవద్దత్తమయిన మానవజన్మను సఫలంచేసికొని, పతనం కాకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములను పొంది, పరమాత్మ కృపకు పాత్రులమగుటకు సనాతన ఆర్ష ధర్మానువర్తనమే పరమావధి. “ధర్మో రక్షతి రక్షితః" ధర్మ బద్ధులమయి జీవించి ధర్మముచే నుద్ధరింపబడవలసి యున్నది.

వేదాంతపరంగా మానవుడు త్రిదోషాలను ప్రయత్నపూర్వకముగా నిర్మూలించుకొని భగవత్కృపాపాత్రులు గావలసియున్నది. అవి మల, విక్షేపణ, ఆవరణ దోషాలు. మలదోషం శౌచం ద్వారాను, విక్షేపదోషం సద్గ్రంథ పఠన, శ్రవణముల ద్వారాను, ఆవరణ దోషం జప, తపాద్యనుష్ఠానముల ద్వారా నిర్మూలనమగునని శాస్త్ర ప్రమాణముగాన మొదటి మెట్టు శౌచము. నవసమాజములో మానవులు శరీర బాహ్య శౌచము ద్వారా ప్రజలను ఆకట్టుకొనగల్గుచున్నారు గాని, అంతః శౌచం తెలియక, పాటించలేనందు వలన భగవత్కృపకు పాత్రులుగాలేక పోవుచున్నారు.

గురు, బుధ, పండిత, ఆచార్యవర్యులు, ధర్మ ప్రచారముకన్న భక్తి ప్రచారమునకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మనోనైర్మల్యం లేని భక్తితో ఏకాగ్రత సాధించలేమనునది సత్యము. భారతీయ మానవులలో నరనరములందు రక్తంలోనే భక్తి ఇమిడియుంటుంది. కాని ధర్మాచరణ లేని భక్తి ఫలితం అత్యల్పము. జన్మాంతర సుకృతం వలన చరాచర జీవరాశిలో నాల్గవది, ఉత్తమమగు మానవ జన్మను, సనాతన ఆర్షధర్మ ఆచరణద్వారా సార్ధకం చేసికొనాలి.

మానవలక్షణాలున్నంతమాత్రాన మానవులముగాము. అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానముల తారతమ్యములు తెలిసికొని సద్ధర్మాచరణ గావించాలి. వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణములన్నియూ మానవ అభ్యుదయానికీ, భక్తి, జ్ఞాన, వైరాగ్య సాధనకూ మూలము స్వధర్మాచరణయేనని ప్రబోధిస్తున్నవి.

కనీసము మన నిత్యకృత్యములలో ఆచరించగల్గిన ధర్మాలను తెలిసికొని ఇంతవరకు తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని మానవార్హతబొంది సద్గతిని బొందపలసియున్నది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి పాకులాడినట్లు, ఇంట గెలవకయే రచ్చ గెలవాలనే తాపత్రయంలా, ధర్మాచరణలేని మానవుల పూజలూ, పుస్కారములు, పురాణ భాష్య శ్రవణములు, తీర్థయాత్రలు, సత్సంగములు అత్యల్ప ఫలదాయకము మాత్రమే.

మానవునకసాధ్యములేదు. మనసుంటే మార్గంముంటుంది. మాట్లాడే ప్రతిమాట భావాన్ని మనసుకు పట్టించుకుంటే చాలు. “భవానీ భావనాగమ్యా" మనం రోజూ నిద్రలేచినది మొదలు మరల పరుండేవరకు ఆచరించగలిగే కొన్ని ధర్మాలను తెలిసికొనవలయునను కుతూహలంతో, నా అల్ప పరిజ్ఞానానికందినంత సేకరించి తోటివారికందించి ఉడుతాభక్తిగా మానవసేవ రూపంలో మాధవసేవకు ప్రయత్నించాను.

ప్రయత్నం నాది, ఫలితం చదువరులది.


బుధజన విధేయుడు
బాలనరస అప్పేశ్వర శాస్త్రి
కాశీవాసి

ఆర్షధర్మంతో మళ్లీ మీముందుకు వస్తున్నాం

ఇంతవరకూ మేము కాశీ కేదారం పేరుతో కాశీ (వారణాశి) లోని కేదార ఖండముయొక్క మహాత్మ్యమును మీముందు ఉంచినాము. ఈ సంకలనము మొత్తాన్ని ప.డి.యఫ్ రూపంలోకి మార్చాము. కావలసినవారు మాకు తెలిపిన మేము ఫైలు పంపగలము. ప్రస్తుతము దీనిని పండిత పరిష్కృతం చేయించే దిశలో ఉన్నాము. అది అయిన తరువాత అచ్చువేయడం జరుగుతుంది.

నెలరోజులనుండి ఖాళీగా ఉండి - అంటే ఏమీ పోష్ట్ చెయ్యక – చేతులు చాలా …. గా ఉన్నాయి.

బ్రహ్మశ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు 1995 లో ఆర్షధర్మము (చారుచర్య) అనే చిరు పొత్తమును సంకలనం చేసి ముద్రింపించారు. అవి అన్ని కాపీలు పూర్తిగా చెల్లుబాటవగా మరల ప్రచురించ సంకల్పించారు. ఇంతకు ముందులానే దీనిని కూడా ప్రచురించడానికి ముందు అంతర్జాలంలో ఉంచిన మరింతమందికి చేరుతుందని ఆశిస్తూ దీనిని మీ ముందు ఉంచుతున్నాము. ఇందులోని ధర్మములు మను ధర్మశాస్త్రము, చతుర్వేద పరమ రహస్యము, వర్ణాశ్రమ ధర్మ పరిణామము, సంపూర్ణ నీతి శాస్త్రము, ధర్మానుష్ఠాన చంద్రిక లనుండి గ్రహింప బడ్డాయి.

1995 లో దీనిని నెల్లూరు లో జరిగిన ఆర్షధర్మ మహాసభ వారి ప్రథమ వార్షికోత్సవ సభలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ శంకరాచార్య మహాస్వామి వారి కరకమలములచే ఆవిష్కరిమప బడినది.
దీనినికూడ అంతర్జాలం లోని ఆంధ్రులు ఆదరిస్తారని ఆశిస్తూ

మీ

దువ్వూరి వేణు గోపాల్