Monday, December 29, 2008

ద్వాదశోధ్యాయము

శౌనకాదులు, సూతునిచే సరస్వతీదేవి పూర్వ కథా వృత్తాంతమును వినగోరగా వారికి సూతుడిట్లు తెల్పిరి.

సరస్వతి గంగాదేవితో, మాతా! పూర్వము పితామహడు బ్రహ్మ, విద్యారూపియగు పరాశక్తిని మనస్సున తలంచి పదివేల సంవత్సరములు తపమాచరింపగా, పరాశక్తి సుందర రూపముతో కన్యగా అవతరించినది. ఆమెయే నేను. నా సౌందర్యమునకు విచలితుడయిన బ్రహ్మ మనమున కామావేశము గల్గి నన్ను పట్టుకొని రమించగోరెను. మాయోమోహమున బ్రహ్మ పరాశక్తిగా నన్ను గుర్తించలేకపోయెను. కన్యగానున్న నేను బ్రహ్మతో నీ తపోబలమున రూపదాల్చిన నేను ధర్మపరముగా నీ పుత్రికను. అట్టి నాపై నీకు మోహము తగదని నివారించిననూ బ్రహ్మ వినకపోవుటతో, బ్రహ్మయొక్క బలాత్కారమును తప్పించుకొనుటకు నేను లేడి రూపము దాల్చి పారిపోజూచితిని. కాని బ్రహ్మ కూడ మగలేడి రూపమున నన్ను వెంబడించెను.


పరాశక్తి నవ్వుచూ శంకరునితో స్వామీ బ్రహ్మ స్థతి చూడుడు, నన్ను పదివేల సంవత్సరములు ప్రార్థించగా నేను కన్య రూపమున దర్శనమిచ్చితిని. కానీ మీ మాయోవశుడమున బ్రహ్మ నా సౌందర్యమునకు విచలుడై ఇట్లు ప్రవర్తించుచున్నాడు. కనుకమీరు బ్రహ్మకు తగిన శిక్షనొసగుడు. తరువాత ఆ కన్యనతనికి ప్రసాదింపుడు. మనసా రమించిన స్త్రీ ఆ పురుషునిదే యగును. లేనిచో ధర్మ విరుద్ధమగును. బ్రహ్మ ఏందరనో స్త్రీ పురుషులను సృష్ఠి చేయుచున్నాడు. ఒకరిచేతనే సృష్ఠించబడుట వలన ధర్మముగ వారు సోదరీసోదరును. కాని మీ మాయా ప్రభావమున ఒకరిపై ఒకరు మనసుపడినవారు సతీ, పతులగుదురు.

పరాశక్తి భావము గ్రహించిన శివుడు వెంటనే కిరాతరూపము దాల్చి విల్లున బాణము సంధించి మగలేడి రూపమునున్న బ్రహ్మను వెంబడింటచెను. ఇది గమనించిన బ్రహ్మ, కిరాతరూపమునున్న శివుని గర్తించి లజ్జితిడై తలదించుకొని నిల్చుండిపోయెను. శివుడు కోపించి, బ్రహ్మా! నీవు ధర్మమును తప్పితివి. స్త్రీని బలాత్కరించి రమించుట దోషము. ఏకోదరి సోదరి, అన్న భార్య, తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, కోడలు, గురుపత్ని, తన కుమార్తె, మితృని భార్య, వీరు గౌరవింపబడువారు. రతికి వర్జితులు. పూర్వము నీవు చేసిన తప్పునకు ఒక శిరము కోల్పోతివి. ఇపుడు మిగిలిన నాల్గుశిరములను ఈ బాణముతో తృంచివేతునని బాణమును లాగి వదలబోవగా, పార్వతీదేవి శివును ప్రార్థించి బ్రహ్మదేవుని క్షమింపవేడెను. బ్రహ్మ విచార వదనముతో శంకరుని చరణములపై వ్రాలి రక్షింప వేడెను.

అర్ధనారీశ్వరముగా, శివ శక్త్యాత్మకమైన నేను మీలో లీనమైతిని. బ్రహ్మ ప్రార్థనపై కన్యగా అవతరించిన తన రూపమైన నన్ను పార్వతి ప్రశ్నించి పుత్రీ! నాగ్రూపముగా నీలోనున్న నేను నాశక్తిని ఉపసంహరించుకొంటిని. బ్రహ్మ మూడువేదములను అవగతము చేసికొనుటకు 10 వేల సంవత్కరములు తపము చేసిన పుణ్యాత్ముడు. అతని నాల్కపై విద్యారూపమున నేనుందును. ఇపుడు నిన్ను మా పుత్రికగా స్వీగరించినందున నీవు బ్రహ్మను వరించుట ధర్మవిరుద్ధముకాదు. శంకరా! మీరు భక్త సులభులు, బ్రహ్మమీ భక్తుడు గాన మన్నించి అతను కోరిన కన్యను మన పుత్రిగా బ్రహ్మ కొసంగుదుము అనగా, శివుడు ప్రసన్నుడై బ్రహ్మా ఈమెను మా పుత్రికగా నీ కొసంగుచున్నందున ధర్మలోపముగాదు. దేవతలలో ఇది సమంజసమే. భూదేవి, లక్ష్మి ఇద్దరునూ విష్ణువు భార్యలే. భూమినుండి వెలువడిన జానకిని రాముడుగా అవతరించిన విష్ణుమూర్తి పరిణయమాడెనుగదా! కౌసల్య పుతృనిగా జానకిని చేపట్టి ధర్మలోపముగాకుండ జేసెను. కశ్యపుడు, దక్షుడు, పులోముడు, అత్రి, అంగారసుడు, వారందరు నూ ఔరస పుత్రులేగదా! పినతండ్రి కుమార్తెలగు శచీదేవి, అశ్వని ఆదిగాగల తారలను గ్రహించిరి. నా ఆజ్ఞననుసరించి కుక్షిభేదము వలన వీనిలో ధర్మలోపము కలుగ లేదు. కనుక ఈ కన్యను గ్రహించమని ఆదేశింపగా నేను శాస్త్ర విధిగా బ్రహ్మను వివాహమాడితిని. వేదవిద్యగా నన్ను బ్రహ్మ జిహ్వాగ్రమున నిల్పుకొని ఆదరించెను. శంకరుడు నాతో, సరస్వతీ మొదట బ్రహ్మ నిన్ను వెంబడించి ధర్మ విరుద్ధమగు దోషి అయ్యెను. భార్యలు భర్తల దోషములను నివారింపవలెను. స్త్రీలకు భర్తలే ప్రత్యక్ష దేవతలు. కనుక నీవు బ్రహ్మ అపచారమును తుడిచివేయుటకు భూమిపై నదీరూపమున ప్రవహించి మహనీయుల స్నానస్పర్శవలన నీవును, నీలో స్నానమాడినందున పాపులును పవిత్రులగుదురు.

భూమిపై ఆర్యావర్తిము, అందు కురుక్షేత్రము పవిత్రభూములు. అక్కడ నీతీరమున యజ్ఞములు, తపస్సు చేసినవారు నీలో స్నానము, ఆచమనముల వలన నీవు పాప పరిహారము జేయుదువు. నా ప్రియపత్ని ఆకాశ గంగ పృధ్విపైనున్నది. నీవు ఆమెను కలిసి పూజించి నీ పతియొక్క మంచి కొరకు ఒక అంశమున నదిగా ప్రవహించుము. నీ సవతులు గాయత్రి, సావిత్రులు కూడా ఒక అంశతో నదులై ప్రవహింతురు. అని అంతర్ధానము చెందగా నేను కురక్షేత్రములో నదిగా అవతరించి నీకొరకు నీరీక్షించుచుంటిని. నీవు ఇక్కడ నాపతి, ప్రజాపతి క్షేత్రమునకు వచ్చినది తెలిసికొని ఒక అంశను కురక్షేత్రమున వదలి భూమియందు అంతర్థానమై ఇక్కడ వెలిసితిని. నా పతి అనేక మార్లు ఇక్కడ దశ సహస్ర అశ్వమేధయాగములు సల్పిరి. నీవిక్కడకు వచ్చి ప్రవహించుచు ఆయజ్ఞ సాఫల్యతనిచ్చితివి. ఇక్కడనుండి నీతే జేరి ప్రవహించుచు సముద్రమును చేరుదము. విష్ణుప్రియ కాళింది కూడ ఇక్కడ నీతో చేరినది అనెను.

అపుడు గంగ, హే బ్రహ్మప్రియే! కురుక్షేత్రములో బ్రాహ్మణులు యజ్ఞ, తపోధనులు, వారి మహిమ గొప్పదని వింటిననగా, సరస్వతి, హే గంగే బ్రాహ్మణుల మహిమ వినుడు. వింధ్య, హిమవత్పర్వతముల మధ్య భూమి ఆర్యావర్తము. అందు కురుక్షేత్రము విశేష్ము. సూర్యుని పుత్రి యమున, విష్ణుమూర్తిని తన భర్తగా పొందుటకు కురుక్షేత్రమున ఘోర తపమాచరించి శరీరము సుష్కించి అస్తి పంజరము మిగిలినది. అది చూచి అచటి బ్రాహ్మణులు ఆశ్చర్యపడిరి. జనులు తండోపతండములుగా వచ్చి చూడనారంభించిరి. యమున తపమునకు సంతసించి విష్ణుభగవానుడు ప్రత్యక్షమై హేపావనీ! నీతపమునకు మెచ్చి నిన్ను భార్యగా స్వీకరించి నీకు నా హృదయ స్థానమిత్తును. ఇంకను వరము కోరుమనగా యమున ఇక్కడ నాకు రక్షణ నిచ్చిన బ్రాహ్మణోత్తములకు ఉత్తమ గతి కల్గించుడమి కోరెను. విష్ణుమూర్తి, యమునా నీవు కన్యగా ఇక్కడ తపమాచరించి సుష్కించి కుబ్జగా మారిన ఈ ప్రదేశము "కన్యాకుబ్జ" మను పేరు తపో భూమిగా ఖ్యాతి చెందును. నీకు తూర్పున గంగ యున్నది. నీకును గంగకును మధ్యనున్న భూమి వేదభూమిగా ప్రసిద్ధిచెంది అందు చేయు తపో యజ్ఞములు అత్యంత ఫలదాయకములగును. నీవు గంగతో కలిసి తీరవాసులను పావనులను జేయుడు అని తెల్పెను. ఇక్కడ చేయు యజ్ఞ హవిస్సులు గొన్న దేవతలు సద్యః ఫలితమిత్తులు. దుర్లభమైన మానవ జన్మనెత్తియు మనో, వాక్కులు పాపాచరణకు లాగగా, అతి ప్రయత్నముచే నిరోధించి తపోయజ్ఞములచే నా తీరభూమియందు నాల్గు వర్ణములవారునూ పాప రహితులై అభీష్ట సిద్ధులగుచుండిరి.

ఇట్లు సరస్వతీదేవి గంగకు వివరించిన పుణ్యకథను విన్నవారు ఈశ్వ కటాక్షమున ముక్తులై కైలాసవాసులగుదురు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Sunday, December 28, 2008

దశమాధ్యాయము

శౌనకాదులు సూత మహర్షిని, వ్యాస శిష్యుడవగు తత్వజ్ఞాన నిధివగు మహాత్మా పరమేశ్వరుడు సంతసించి వరములొసగిన అట్టి పుష్పదంత స్తుతిని వినిపింపుడనిరి. సూతుడు ఆ స్తుతి సారమిట్లు చెప్పదొడగెను.

హే పరమేశ్వరా! అనంతమగు నీ మహిమను తెలియనివారు చేయు నీస్తుతి అయోగ్యమయినచో బ్రహ్మాదులు చేయు స్తుతియు అనర్హమే యగును. ఎందుకనగా నీ మహిమ అగమ్యము. నీ స్తుతి ఎవరు చేసిననూ వారి బుద్ధి కందినంత మాత్రమే చేయగలరు. నేనును అట్టి వాడనే కదా! శబ్ద వేగమనోవేగములకందని గుహ్యంతమము నీ మహిమ. వేదములే నేతి, నేతి యని గర్హించి నిశ్చయించలేకపోయినవి. అట్టి నీ స్తుతిని నాకు తెలిసనంతలో చేసినాగాత్రము శుద్ధి పరచుకొనుచుంటిని.

సత్వరజస్తమో గుణములకు సృష్టి, స్థితి, లయములకు నియమింపబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతింపబడిన నీ ఐశ్వర్యము వేదప్రతిపాదితము. వేదత్రయమార్గము, కాపిల మార్గము, వాశిష్ఠాది యోగ శాస్త్రమార్గము, పాంచరాత్రాది వైష్ణవ సిద్ధాంతమార్గములని భిన్న మార్గములన్నియూ నదీ జలములకు సముద్రము గమ్యమైనట్లు నిన్ను బొందునవే యగును. అగ్ని స్ంభము వంటి నీ తేజో రూపమయిన మహిమను ఆద్యంతమును తెలిసి కొనుటకు బ్రహ్మ ఊర్ధ్వముగను, విష్ణువు అధో ముఖముగను వెళ్లి సాధ్య పడక తిరిగి వచ్చి నిన్ను ప్రార్ధించి తెలిసిగొనగల్గిరి. బాణాసురుడు నీయనుగ్రహమువలన ముల్లోకములను ఆక్రమించి ఇంద్రుని జయించెను, కాని రావణాసురుడు నీసేవచే భుజబలమును సంపాదించియు నీ నివాసమైన కైలాసమును పెకలింపబూని పరాభవింపబడి పాతాళమునకు చేరెను గాన నీసేవయందు వినమ్రుడైనవాడు సర్వోన్నతిని బొందును. క్షీరసాగరమధనమున హాలాహలముద్భవింపగా ఆర్తజనరక్షణకు నీవు దానిని గ్రహింప, నీ కంఠము నీలమయిననూ అదియూ శోభాయమానమయినది. తిరుగులేని మన్మధబాణములు నిన్ను సోకి, అతని ఆహుతికి కారణమయినవి. నీ మహిమను ఏదియూ తిరస్కరింపజాలదు. సంధ్యాసమయమున లోకములను బాధింప బూనిన రాక్షస సంహారమునకై నీవు నాట్యము చేయు సమయమున, పాదతాడమనుచే భూమియు, బాహు సంచాలనమున ఆకాశము, జడల తాకిడికి స్వర్గమును కంపించుచున్నవి. తృణ సమానమగు త్రిపురములను దహింపగోరిన నీకు భూమి రథముగాను, బ్రహ్మ సారధిగాను, మేరువు ధనుస్సుగాను, సూర్య చంద్రులు రథ చక్రములుగాను, విష్ణువు బాణముగాను నేర్పడిరి. ఇవి నీ కవసరము లేకున్ననూ వారి సేవనీకు తోడ్పడినది. విష్ణుమూర్తి నీ పాదపూజకు సహస్రకమలములు తేగా వాని భక్తి పరీక్షింపగోరి నీవు ఒక పద్మమును తిరోహితము జేయ విష్ణువు తన నేత్రమునే పద్మముగ సమర్పింప నీవు అతని భక్తికి మెచ్చి సుదర్శన చక్రము నొసగితివి. యాగ క్రియ యందు ఆహుతులు భస్మమయినను దీక్షితులు నానిని నీకు సమర్పించిన కారణమున ఫలమును బొందుచున్నారు. కాని దక్ష ప్రజాపతి తన యాగమునకు నిన్ను ఆహ్వానిచని కారణమున శిరమును గోల్పోయెను.

బ్రాహ్మ తాను సృజించిన సంధ్యయనెడి స్త్రీ సౌందర్యమును మోహించి వెంబడించగా, నామె సిగ్గుతో లేడి రూపము బొందెను. బ్రహ్మ మగలేడి రూపము దాల్చి వెంబడించగా నీవు కోపించి పినాకమున బాణము సంధించి విడువగా, బ్రహ్మ సిగ్గుపడి మృగశిరా నక్షత్రరూపము దాల్చెను. అంత నీ బాణము ఆర్ద్రా నక్షత్రముగా వెన్నంటియే యున్నది.

మదనాంతకా! నీవు శ్మశానవాసివయి పిశాచ సహచరముతో చితాభస్మము పూసుకొని కపాలమాల ధరించి, అమంగళ ద్రవ్యములతోనున్ననూ, భక్తులకు మంగళ ప్రదాతము. నిన్ను సూర్య చంద్రులుగను, పంచ భూతములుగను, అ కార ఉ కార మ కారములుగను, వేద త్రయముగను, అవస్థా త్రయముగను, త్రిలోకములు, త్రిమూర్తులుగను భావించుచున్నారు. ఈ స్తవరాజ పఠన శ్రవణములు సర్వ కామ్యార్ధ ఫలదాయకములు.

నవమాధ్యాయము

గౌరీదేవి 12 సంవత్సరముల తపస్సును నిత్య హరంపాప తీర్థస్నాన, కేదారేశ్వర పూజలతో పూర్తిచేసిన సోవమారయుక్త శ్రావణ పూర్ణిమ పుణ్య దినమున పరమేశ్వరుడు ప్రీతి చేంది కేదార లింగము నుండి ప్రత్యక్షమై పార్వతిని వరము కోరనమగా, దైవి స్వామీ మానవులు కలియుగము మూఢులై కోట్ల కొలది బ్రాహ్మహత్యాపాతకములు, కోట్ల కొలది అగమ్యాగమన పాతకములు చేయుదురు. వారికి తరుణోపాయము కోరుచున్నానని వేడగా స్వామీ ప్రీతితో, కాశిలోగాని, వెలుపల గాని మానవులాచరించు ఎట్టి పాపములయినను మణిక్రణిక స్నానము, విశ్వేశ్వరాది లింగదర్శన పూజనలవలన నశించును కాని, నా స్వరూపమయిన కాశీతీర్థ, క్షేత్ర, లింగముల నింద, అపరాధములు కేవలము ప్రాచీన మణికర్ణిక/హరంపాప తీర్థము/ రేతోదక తీర్థము ముఖ్యముగా నీచే నిత్యము 12 వర్శములు స్నాన పుణ్యమబ్బినందున నీపేర గౌరీకుండమను తీర్థ స్నాన కేదార లింగ దర్శన పూజనల వలన మాత్రమే ఉపశమించునట్లు వరమొసంగెను. స్వామి ఆలింగమున అంతర్థాన మయిన వెంటనే గౌరీదైవి కూడ స్వామి వారితో కైలాసము చేరెను.

ఇక నౌగమేయుడు గౌరీదేవి శాపమున మనుష్యయోనిలో బ్రాహ్మడుగా జన్మించి క్షేమకవి నామముతో పూర్వ జన్మ స్మృతిగల్గి తాను శంకరుని ద్వార వినిన నూరు కథలను బృహత్కథామంజరి నామముతో గ్రంథమును రచించి, తనపేర క్షేమేశ్వర నానముతో కాశీలోని కేదారునికి ఉత్తరమున లింగ ప్రతిష్ఠచేసి నిత్యమూ పరమేశ్వరుని ఆ లింగమున సేవించుచు, వ్యాసుని పురాణములు, స్మృతులు, శాస్త్రములను అవహేళన చేయుచు వ్యాసుని నిందించగా, వ్యాసుడు చింతా క్రాంతుడై కృంగుచుండెను.

కాశీ హరంపాపతీర్థమున నిత్య స్నానము, కేదార పూజలతో 12 సంవత్సరముల శివసేవకు సంతసించిన పరమేశ్వరుడు క్షేమేశ్వర లింగమునుండి కోటి సూర్వ ప్రభలతో, కోటి చంద్రుల చల్లదనముతో ప్రత్యక్షమై నేటినుండి 9వ రోజున శ్రావణ పంచము సోమవార పరవడి తిథియందు నీవు మరల మాలోకము చేరుదువు. ఈలోగా మణికర్ణికకు వెళ్ళి స్నానము చేసి అక్కడనే యున్న తెల్లని వ్యాస విగ్రహమును అవమానించి వ్యాసునితో సహా ఆనాడు కేదారనాధుని ముందుగల తీర్థస్నానము, కేదార అర్చనము చేయుమని ఆనతిచ్చెను.

క్షేమకవి స్వామి ఆజ్ఞనిర్వర్తించుటకు వెళ్ళి ణమికర్ణికా స్నానము చేసి వ్యాసవిగ్రహము చూచి ఎవరీ లంబోదరుడు, చక్రాకారముగ పెద్ద గర్భము ధరించి యున్నాడని నిందించ వ్రెలితో పొట్టను పొడవగా అందుండి వ్యాసుడు ఉద్భవించి క్షేమకవి చేతిని గట్టిగా పట్టుకొని, చకార కుక్షి యని నన్ను నిందించి నాపొట్టలో ప్రేలు గుచ్చిన నీ గొప్పతనాన్ని పరీక్షించదలచినాను, నీ కవిత్వ పటిమతో అనుష్టప్ ఛందస్సులో 32 అక్షరములతో నేను చెప్పు కథను ఒక శ్లోకములో చెప్పమని కథను ఇట్లు చెప్పెను.

ఒకరాజుగారి మహలు జీర్ణించి దానిలో ఒక గోడ కూలినది. దాని క్రింద ఉన్న ఒక కుక్క చనిపోయి అదే సమయమున రాజుగారికి కొడుకు పుట్టినాడు. అతని పేరు కూష్మాండఖండము. దీనిని 32 అక్షరములతో "చ"కారము ఉపయోగించక శ్లోకము చెప్పినచో నీవు గొప్ప కవివని అంగీకరింతుననెను. దానికి క్షేమకవి నవ్వి

రాజద్వారీ గలద్వారీ పతద్భిత్తౌ మృతేసుని,
రాజపుత్రస్య పుత్రో ऽ భూ నామ్నా కూష్మాండ ఖండకః

యని చెప్పి మహాత్మా మీరు చెప్పిన దానికి ఒక క కారము ఎక్కువ కలిపి కూడా అనుష్టుప్ ఛందస్సుకు ఒక అక్షరము తక్కువగానే పూర్తిచేసితిననెను. అపుడు వ్యాసుడు పూర్వ స్మృతి గల్గి నిన్ను శివగణాధ్యక్షుడు నౌగమేయునిగా గుర్తించితిని, శివానుగ్రహమున గొప్ప కవివని అంగీకరించితిని, నేను కూడా గౌరీదేవి శాపమున బ్రాహ్మణ జన్మనెత్తిన విష్ణుమూర్తిని, నన్ను అవమానించుటతో నీ శాపము తీరినది, కాని శివాజ్ఞచే నేను ఈ మన్వంతరమంతయూ గడిచినంతవరకూ కాశీకావల యుండవలయును అని చెప్పి ఇద్దరును గౌరీ కుండ స్నానము, కేదారేశ్వర దర్శనమునకు బయలుదేరిరి.

ఆనాడు సోమవార యుక్త శ్రావణ పౌర్ణమి. ఇద్దరును ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి కేదారేశ్వరుని పూజించి ప్రదోషకాల పూజవరకు ఏకాంతమనస్కులై ధ్యాననిమగ్నులైరి. పరమాత్మ ప్రసన్నుడై కోటి సూర్యకాంతి, కోటి చంద్రుల చల్లదనముతో నంది, భృంగి గణములతోడను, గణపతి, కుమారస్వాములు ఎలుక, నెమలి వాహనములపై ప్రక్కన నిలువగా వంగిమాగధుల విజయ ఘోషల మధ్య గౌరీసమేతుడై లింగమునుండి ఉద్భవించెను. అమృతమయ వాక్కులతో క్షేమకవి, వ్యాసమహర్షులను ప్రేమతో మీ ఈప్సితార్థములను కోరుడని ఆజ్ఞాపించెను. వారిద్దరునూ అశ్రువూరిత నయనములతో అవాక్కయి ఇట్టి మహాదర్శన భాగ్యమబ్బిన తర్వాత మాకింకేమి కావలయును, మమ్ములను ముక్తులను చేయుడనిరి. స్వామి కరుణించి క్షేమకవి మాత్రమే యిపుడు ముక్తుడగును కాని వ్యాసుడు ఈ మన్వంతరమంతయూ వేద, శాస్త్ర, పూరాణ, ఇతిహాసములు రచించి లోకోద్ధరణ తర్వాత ముక్తుడగునని చెప్పగా, వ్యాస మహర్షి స్వామీ క్షేమకవి వ్రాసిన బృహత్కథామంజరిలో క్రితం నూరు కల్పముల రహస్యములు మీచే అమ్మవారికి చెప్పబడిన కథలు విన్నవారు వెంటనే ముక్తులగుదురు, మిమ్ముచేరుదురు కనుక యిక నేను ఈ కల్పాంతము వరకు ఇక్కడనే ఉండి లోకోద్ధరణ కొఱకు వ్రాయవలసిన దేమున్నదని తెల్పగా పరమాత్మ ఆశ్చర్యముతో క్షేమకవి వ్రాసిన అట్టి ప్రశంశా పూర్వక గ్రంథమును వినగోరెను. వ్యాసులు, క్షేమకవి ద్వారానే వినుడని వేడగా స్వామి అతనినే వినిపింపమనెను. అపుడు దేనిని వినినంత మాత్రమున ముక్తులయ్యెదరో, ఏ రహస్యము లేశమాత్రము చెవిన పడిననూ శివధామము ప్రాప్తమగునో, సద్గురు మంత్రోపదేశము వలె ఏది పాశుపత జ్ఞానమొసగునో, వేదశాస్త్ర, పురాణ, ఇతిహాస, తంత్ర, స్మృతి, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, జ్యోతిష, శబ్ద, తర్క, మీమాంస, యోగములను, నూరు కల్పముల దేవతీర్థ, క్షేత్ర, లింగ మహాత్మ్యముల సమ్మిళిత సర్వస్వమును లక్షశ్లోకములలో వినిపించెను.

సుకుమార పుష్ప వృష్ఠి వలె సాగిన కవితా మాధుర్యమును, తత్కాల మూక్తి ప్రద రహస్య సారమును ఆనందపూర్వకముగా విన్న శివుడు క్షేమకవికి, పుష్ప దంతుడు, పుష్వ జీహ్వుడు, పుష్పాశ్యుడు అను నామముల నొసగి, ఇంతటి మహత్వ పూర్ణ విషయములను ఇపుడు వినిపించుట అనుచితము, నాచే కల్పింపబడిన లోకవ్యవహారము భంగమగును, సృష్టి, స్థితి, లయములకు తావుండదు గనుక వెంటనే దీనిని నష్టపరుచుము అని చెప్పి, నీటిలో ఆ గ్రంథమును వేయింటి లయము చేసెను. నేటినుండి నీ నామము నౌగమేయుడు కాదు, పుష్పదంతునిగా శివగణ నాయకుడవు కమ్మని దీవెంచెను. వ్యాసునితో స్వామి, నీవు వ్రాయు పురాణములే వేదవాక్కులుగా శిరోధాల్యములగనును, ప్రమాణములగును గాన నీరచనలు సాగించమని చెప్పు సమయమున కైలాసము నుండి దివ్య విమానము వచ్చి వాలినది. నౌగమేయుడు మానవరూపము వదలి దివ్య దేహధారియై, వీభూది, రుద్రాక్షలతో, త్రిశూల, త్రినేత్ర ధారియై శివాంశను బొంది రుద్ర సారూప్యముక్తుడై శివపార్వతులను స్తుతించెను. ఆ స్తుతిని నిత్య పారాయణ చేయువారి యిష్ట కామ్యములు నెఱవేరి అంతమున శివపద ప్రాప్తి కల్గునట్లు శివుడు వరమొసగెను. వెంటనే ఆ విమానమెక్కి పుష్పదంతుడు కైలాసమేగెను. గౌరీ కేదారేశ్వరుడు ఎట్లు లింగమునుండి ఉద్భవించెనో అటులనే గణసహితముగ లింగమున అంతర్థానము చెందెను. గౌరీదేవి, నౌగమేయుల శివాపరాధమును నిర్మూలించిన గౌరీ కుండ మహాత్మ్యమును తెల్పు ఈ కథ విన్న వారు కాశీ క్షేత్రమును దర్శించిన ఫలము పొంది ముక్తులగుదురు.

Sunday, December 14, 2008

సప్తమాధ్యాయము

బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారు నియోగింపబడిన కార్య నిర్వహణకు వెళ్లిన తరువాతి పార్వతి, లక్ష్మి, సరస్వతులు వినోదముగా విహరించుటకు మంధర పర్వతమున కేగిరి. వారు ఆనందముగా విహరించుచు సంభాషించుకొను సమయమున లక్ష్మీదేవి పార్వతిని వేళాకోళముచేయుచు, తాను తన భర్త సర్వజ్ఞులమనయూ కనుకనే విష్ణువుకు పాలనా బాధ్యత నొసంగబడినదనియూ, మహా కైలాసమందు విష్ణుమూర్తికి సాదర సత్కారములు లభించిన వనియును, విష్ణుమూర్తియే బ్రహ్మ, రుద్రులకు కూడ అట్టి సత్కారములు లభింపజేసి నారనియూ, కనుక తాను, విష్ణుమూర్తి గొప్ప వారమని డాంబికముగా పల్కుగా, గౌరీదైవి కినుక వహించి, మన భర్తలు రాగోనే వారికీ విషయము తెల్పి వారి చేతనే ఎపరు గొప్పవారో చెప్పించెదనని, సర స్వతి సాక్షిగా యిది వారి పంతమనియూ పల్కి వారి పురములకు చేరిరి. లక్ష్మీదేవి విష్ణుమూర్తికీ విషయము తెల్పిన వెంటనే ఆయన కోపించి, రుద్రుడే సర్వజ్ఞుడనియూ లక్ష్మీదేవి పార్వతిని అవమానించుట తప్పిదమనియూ తెల్పి, తన భార్య పంతము నెగ్గుటకొక ఉపాయము తెల్పుదునని లక్ష్మితో ఇట్లు తెల్పెను. శివగణములలో శ్రేష్టుడగు నౌగమేయుడు శివునకు అంతరంగ భక్తుడు. శివ పార్వతుల ఏకాంతములో ఏమి సంభాషణ జరుగునో అతి అంతయూ నీకు చెప్పమని నౌగమేయుని ప్రార్థించి అతనిని ఒప్పించి, అట్లు విషయములను తెలిసి కొన్న నీవు పార్వతి ఏవిషయము చెప్పిననూ అది నీకు ముందగనే తెలిసినట్లు చెప్పుచూ కొంతకాలము నీమాట నెగ్గించు కొనవచ్చును. పార్వతి కోపించి ఏమి చేయునో, తదువరి ఏమగునో వేచి చూడమని లక్ష్మితో విష్ణుమూర్తి తెల్పెను.

రుద్రుడు పార్వతితో మహాకైలాసముందు జరిగిన వృత్తాంతమంతయూ తెల్పుచూ మాయా మోహితులయిన బ్రహ్మ, విష్ణువులు తన మాట లెక్కచేయక మహా కైలాసమేగి శంకరుని వద్ద భంగపడిన విషయము చెప్పి, నా మాటను ఎవరూనూ ఉల్లంఘింపరాదు. నావలననే వారిద్దరికినీ మరల పదవులు దొరికినవని విన్న పార్వతీదేవి నవ్వుచూ తనకు లక్ష్మికి జరిగిన సంభాషణ, వారి పంతములు రుద్రునకు తెల్పి, మరెవ్వరికినీ తెలియని
అత్యంత గుప్త మగు కథలు తనకు వినిపింపమని భర్తను కోరెను. శివుడు పూర్వ కల్పమందలి ఒక కథను మరేదేవతకును తెలియని దానిని పార్వతికి వినిపించెను. లక్ష్మి, పార్వతులు మరల విహారమునకు వారి చెలికత్తెలతో మేరు పర్వతమునకు వెళ్లినపుడు పార్వతి లక్ష్మి తో తమ పంతములను జ్ఞాపకము చేసి, మధ్యవర్తి సరస్వతిలేని కారణమున తమ చెలికత్తెలను పంపి సరస్వతిని రప్పించిరి. అపుడు పార్వతి, లక్ష్మితో శివుని మించిన పరమార్థమువేరు లేదనియు, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు శివుని ద్వారానే ఉత్పన్నమయిరనియూ కనుక లౌకిక రీతిగా మనము బంధువులమనియు, సరస్వతి నాకు వదినగారు, నీకు అత్తగారి వరసలనియు (రుద్రయామళము ననుసరించి సరస్వతినుండి విష్ణువు, పార్వతులు ఉద్భవించిరి. విష్ణు నీభి కమలమునుండి బ్రహ్మ ఉద్భవించుటచే పార్వతికి అన్నగారి భార్య సరస్వతి. విష్ణు కుమారుని భార్య యగుటచే సరస్వతి లక్ష్మికి అత్తగారు.) కనుక సరస్వతి మన ఇద్దరికిని న్యాయముగా మంచి చెప్పునని వినిన లక్ష్మి వెంటనే అంగీకరించి పార్వతి చెప్పిన రహస్య కథను నౌగమేయుని ద్వారా విని యున్నందున, పార్వతి ఆరంభించిన వెంటనే మిగిలిన వృత్తాంతమంతయు లక్ష్మి చెప్పసాగెను. ఉమ ఆశ్చర్యముతో లక్ష్మికి ఈ కథ ఎట్లు తెలిసియుండును. సరే ఈనాటికి వదలివేసి రేపు మరొక విశేష కథను వినిపించెదనని నిశ్చయించి ఇండ్లకు చేరిరి.

మరుదినము పార్వతి శివుని వద్దనుండి చాల కల్పములవెనుక జరిగినది, మరెవ్వరికినీ తెలియని రహస్యకథను విని, దానిని లక్ష్మికి వినిపింపగా ఆకథయూ గౌరి కన్న ముందుగనే లక్ష్మి పూర్తిచేసినది. ఇట్లు వంద కథలు చెప్పిననూ గౌరీదైవి గెలువలేక పోయినది.

ఇక చేయునది లేక పార్వతి తన ఓటమినంగీకరించి ఖిన్నురాలై ఇంటికి చేరుసరికి, రుద్రుడు పార్వతి ముఖము చిన్నబోవుట గమనించి ప్రియా నీకు గల్గిన కష్టమేమి? నీమాట నెగ్గనట్లు నీకోరిక తీరనట్లు చింతా క్రాంతురాలవుగ కన్పట్టుచున్నావు. విషయము తెల్పినచో నేను నీమాట నెగ్గించెదనని తెల్పగా, పార్వతి శివుని శంకించి, మీరే సర్వజ్ఞులని భ్రమ పడినాను. కాని విష్ణువే సర్వజ్ఞుడు. లక్ష్మియే సర్వజ్ఞురాలు. కానిచో మీరు ఏకాంతములో నాకు చెప్పిన నూరు రహస్యమగు కథలు లక్ష్మికెట్లు తెలియును. మీమనసులో నున్నవి గ్రహించు నంతటి శక్తిమంతులు వారే. కనుక మీరు నన్నెట్లు నెగ్గింపజేతురని పరుషముగ మాట్లాడెను.

శివుడు అమ్మవారు సహజ స్త్రీ బుద్ధి ప్రకటించుచున్నదని గ్రహించి ఆమెకెట్లు అవమానము జరిగియుండునని దివ్యదృష్టితో దర్శించి, నౌగమేయుని దుశ్చర్య గ్రహించి, ఆనాటి రాత్రి నౌగమేయుని వేరు పనిపై దూరముగా పంపించి, గౌరిని శాంతపరచి రేపు నీజయము నిశ్చయమని నచ్చచెప్పి, ఊరడించి, ఒక రహస్య కథను వినిపించి మరురోజు లక్ష్మి, సరస్వతులతో మేరు పర్వతమునకు పంపెను. ఆ దినము పార్వతి ఆరంభించిన కథ లక్ష్మికి తెలియక పోగా రేపు చెప్పెదనని బింకములు పలికెను. ఇదే విధముగా నౌగమేయుని దూరముగా పంపి ఆ మరుదినము శివుడు పార్వతికి 108 కథలు చెప్పి పంపెను. గౌరీదేవి సరస్వతిని సాక్షిగా పెట్టుకొని చెప్పిన ఆ 108 కథలలో ఒక్కటియూ లక్ష్మికి తెలియనందున, లక్ష్మి తన తప్పును ఒప్పుకొని, శివుడే సర్వజ్ఞుడనియు, విధాత బ్రహ్మ, విష్ణువుల కన్న అధికుడనియూ తాను ఓడి, పార్వతి గెల్పు ఖాయమనియు తానే ఒప్పుకొనెను.

అపుడు పార్వతి చింతించి, వేదనిరూపణముగ ఉపనిషత్తులచే కొనియాడ బడిన పరమాత్మ, ఆది మధ్యాంత రహితుడు, సర్వం సహాద్రష్ట తన పతియేనని గ్రహించి, లక్ష్మితో మొదటి నూరు కథలు నీవెట్లు చెప్ప గల్గితివి, తరువాత ఎట్లు చెప్పలేకపోతివనియు, నిజము చెప్పనిచో తన పరాశక్తి అంశతో శిక్షింతుననియు, దీని వలన మన ముగ్గురితో భేద భావము పొడసూపుట తప్పదనియు పల్కెను. లక్ష్మి భయముచే తాని నిజము చెప్పలేననియూ, తనను శిక్షించి మనలోని సామరస్యమును త్రుంచవద్దనియు వేడుకొనెను. అపుడు గౌరి శాంతించి తన భర్త ద్వారానే విషయము తెలిసికొన నిశ్చయించి వారు వారి పురములకు చేరిరి. ఈ పుణ్య కథను తెలిసి కొనిన వారు భక్తిపూర్వకముగ శివ పార్వతులను సేవించి ముక్తులగుదురు.

Saturday, December 13, 2008

షష్టమాధ్యాయము

నీవెవడవు? ఎందులకు నీకీ దుర్గతి సంభవించినదని శివయోగి ప్రశ్నించగా బ్రహ్మరాక్షసుడు ఇట్లు తన కథను తెల్పెను. నేను పూర్వ జన్మలో బ్రాహ్మణుడను. శివభక్తుడను. కాని మ్లేచ్ఛపాషండ సాంప్రదాయులు నన్ను ప్రలోభపెట్టి భ్రష్టుడను చేసినారు. వారి మతానుసారముగ నన్ను ముద్రాంకితుని జేసి, వారి ప్రాంతమునకు నన్ను రాజును చేసి, అధికారము, ధనము, పరస్త్రీ లోలత్వము, మత్తు పానీయములతో నన్ను వశపరచుకొని శివదూషణ, శివారాధకుల వధ, వేదనింద, సర్వదేవతా నిందలు నాచే చేయించిరి. వారి మతానుసారము గురు తల్ప గమనము అనింద్యమని, సుకర్మయని బోధించి నన్ను వశపరచుకొనుటచేత, అత్యాచారములు, ధనమదముచే చెప్పనలవికాని దుష్కర్మలు చేసి, వేలకొలది శివాలయములు ధ్వంసముచేసి, శివలింగములను పెకలించి, కాశీనగరమందలి అన్ని ఆలయములను కూల్చి, ఎదిరించిన వారిని చంపివేసితిని. నన్ను వశపరచుకొన్న ఒక రాజుకు మత్తుమందులో విషము పెట్టించి చంపి, వారి రాణులము వశపరచుకొంటిని. సాధు కజ్జనులు భయకంపితులై రాజ్యము విడచి పరదేశములకు పోయిరి.

నా కర్మ పరిపక్వమయినందున, ఒకరోజు నేను వేటకు వెళ్ళి కారడవిలో చిక్కుకొని ఒక మదగజముచే చంపబడితిని, యమ భటులు నన్ను కౄరముగా బాధించుచు యముని వద్దకు తీసికొని వెళ్ళగా చిత్రగుప్తుడు నా దుశ్చర్యలు వర్ణించుటకు సిగ్గుపడెను. యముని ఆజ్ఞమేరకు ప్రత్యేక నరకములలో 10 కోట్ల కల్పములు శిక్షించిరి. తదుపరి 45 కోట్ల సంవత్కరములు వివిధ నరకముల తరువాత స్వేదజ, అండజ, కుక్క, నక్క, పంది జన్మలనెత్తి వంద, వంద జన్మల ననుభవించి ఇప్పుడు బ్రహ్మరాక్షసుడనైతిని. పదివేల సంవత్సరములనుండి అన్న పానీయములు లేక క్షోభించితిని. ఒకరోజు నా అదృష్టవశాత్తు ఒక శివభక్తుడు నా కంటపడగా అతనిని భక్షింపబోతిని. అతడు నాకు నీతులు బోధించి నన్ను భక్షించినందున నీ ఆకలి తీరదు. నన్ను వదిలిపెట్టినచో నీకు తరుణోపాయముపదేశించెదనని చెప్పి, నన్ను ఈ చెట్టు పై మాత్రమే నివశించి, దీనినీడన విశ్రమించిన వారిని మాత్రమే భక్షించి క్షుదార్తి తీర్చుకొనుచుండిన యడల కొద్దికాలమునకే నీకు విముక్తి కల్గునని తెల్పిన అతని సంభాషణతో ఆనాడు నాకు ఆకలి నశించినది. పూర్వజన్మలో రాత్రిసమయమున శివాలయముధ్వంస మొనర్చుటకు శివుని వద్ద దీపము వెలిగించిన పుణ్యమొక్కటి నీకు మంచి చేయగలదని తెల్పెను. ఆదినము అతనిని వదలి వందసంవత్సరములు ఆకలితో అలమటించుచుంటిని. ఈరోజు మిమ్ము చూడగనే భక్షింప ఆశించితిని గాని మీ తేజస్సు నన్ను నిలువరించినది. హేమహానుభావా! ఈరాజు, మంత్రులతో సహా నన్నుకూడ ఉద్ధరింప సమర్ధులు అని పదేపదే ప్రార్థించి నమస్కరించెను.

శివజ్ఞాని, ఆత్మజ్ఞానముతో గమనించి రాక్షసుని ఉద్ధరించు ఉపాయము కేవలము కాశీ కేదార హరంపాప తీర్థ స్నాన పానములు, కేదారేశ్వర దర్శనము మాత్రమే నని నిశ్చయించి వెనువెంటనే రాజు, మంత్రి, వారి బలగము, బ్రహ్మరాక్షసునితో సహా కాశీ క్షేత్రము చేరెను. త్రోవలో రాక్షసునితో శివజ్ఞాని ఇట్లు చెప్పదొడంగెను.

ఎంతటి శివాపరాధివయినను ఒక్క రాత్రి శివుని వద్ద దీపము వెలిగించిన పుణ్యమున నన్ను చూడగనే నీ పూర్వజన్మల స్ఫురణ గల్గినది. తనను దూషించిన వారిని, తనకు అపకారము చేసిన వారిని కూడా శంకరుడు, క్షమించి ముక్తులను చేయును. రావణాసురుడు, దక్షుడు మొదలగు ఎందరనో తరింపజేసిన స్వామి నిన్నుకూడ కరుణించునట్లు చెసెదనని తెల్పుచు, కాశీ క్షేత్ర పంచక్రోశము వెలుపలి దేవభూమిని ప్రవేశింపగనే శివగణములు బ్రహ్మరాక్షసుని అడ్డగించి కాశీక్షేత్రమున ప్రవేశింప అనుమతింపకుండిరి. శివజ్ఞాని తాను మరల వచ్చువరకు రాక్షసుని అక్కడనే వేచి యుండమని చెప్పి తాను రాజు, మంత్రి, సేనతో సహా పంచక్రోశమునందు అడుగిడి దేహలీవినాయకునికి నమస్కరించి జ్యోతిర్లింగాత్మక క్షేత్రమున అడుగిడుచున్నందుకు మన్నింపవేడి వూజాదికములు సల్పి ముందుగా మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర దర్శనము, తరువాత కేదారేశ్వర దర్శన పూజలు, పరం పాప తీర్థ స్నానము చేసి, రాజు, మంత్రి అక్కడి బ్రాహ్మణ సమూహమునకు భూరి దక్షిణలిచ్చిన తరువాతి, శివయోగి హరంపాప తీర్థము/ రేతోదక తీర్థము/ గౌరీకుండ తీర్థమును కొంత తీసికొని వెళ్ళి పంచ క్రోశమునకు వెలుపల వేచియున్న రాక్షసునిపై చిలుకరింపగా అతని శరీరమునుండి నల్లని దట్టమైన ధూళి వెలువడి నలుదిశల ఆకాశము వరకు ఆక్రమించెను. అది చూచి క్షేత్రపాలకుడు కాలభైరవుడు, శివగణములు ఆశ్చర్యపడి ఈ ధూళి ఏమని శివయోగి నడుగగా, జన్మ జన్మాంతరములలో ఆ రాక్షసుడు చేసిన పాపము లన్నియూ వారికి చెప్పి, హరం పాప తీర్థము చల్లిన కారణముగా ఆ పాపములన్నియు ఈ రూపమున బయటపడినట్లు చెప్పిరి. కొంతసేపటికి ఆ ధూమము అదృశ్యమవగానే రాక్షసరూపము నుండి సుందరాకారుడుగా మారి శివయోగికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపగా మరల శివయోగి వానిని తీసికొని క్షేత్రములోనికి వెళ్లి విధి విధానముగా తీర్థ స్నానములు, లింగ దర్శనములు, కేదార, హరం పాప దర్శనపూజలు చేయించినతోడనే శివ గణములతో కైలాసమునుండి విమానము దిగి వానిని కైలాసమునకు సంతోషముగా తీసికొని వెళ్ళిరి. అతడో వాల్కలుడు అని శివయోగి తెల్పగా అందరునూ ఆనందవరవశులైరి.

ఇక శివజ్ఞానుని పరగతి వినుడని వామదేవునికి సనత్కుమారులిట్లు తెల్పదొడంగిరి. నర నారాయణులను రాజు, బ్రాహ్మణ మంత్రులను శిష్యులుగా స్వీకరించి, వారికి మంత్రోపదేశము చేసి, వారి గురు సేవకు మెచ్చి తనకొరకు రాక్షసునకు ఆహారముగా వాని నోటిలోనికి వెళ్ళి త్యాగము చేసిన వారికి సద్గతి కల్పింపనెంచి, ఏకాగ్ర మనసుతో శంకరుని ప్రాంర్థించి, దివ్యదృష్టితో రాజు, మంత్రుల భవిష్యత్తు చూచి సంతోషించి మీరు మరు జన్మలో విష్ణువు, బ్రహ్మలు అగుదురనియూ, అంతదనుక వెళ్లి రాజ్య భారము వహించి ప్రజారంజకముగా రాజ్యము చేయుడని ఆశీర్వదించి, వారితో కాశీ కేదారేశ్వరుని దర్శించి శివయోగి శ్రావణ పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన పుణ్యదినమున గౌరీ తీర్థములో స్నానము చేసి, కేదారేశ్వరుని ధ్యానములో ఒక్క క్షణమాత్రము సమాధి నిష్ఠ పొంది బ్రహ్మ రంధ్రము ద్వారా ప్రాణము శివైక్యముజేసి, జన్మరాహిత్య కైవల్యము బొందిరి. ఇక రాజు, మంత్రి గురుధ్యానముతో వారి పార్ధివ శరీరమును గంగలో నిమజ్జనము చేసిరి.

గురు వాజ్ఞ ధిక్కరించ కూడదను సదాచారముతో వారి కాశీక్షేత్ర, తీర్థ, లింగముల నన్నిటిని దర్శించి, పూజించి వారి రాజ్యము చేరి, సదా గురు స్తుతి చేయుచూ కాశీ కేదార మహాత్మ్యమును రాజ్యమున వాడ వాడల ప్రచారము చేయుచు జనరంజకముగా పాలన చేసి దేహాంతమున మరు జన్మగా, వారే ఈ కథారంభమునగల బ్రహ్మ, విష్ణువులైరి. శంకరుని ద్వారా వారి పూర్వ జన్మ వృత్తాంతమంతయూ విన్న బ్రహ్మ విష్ణువులు శివాజ్ఞను నెరవేర్చుటకు మరల వెళ్ళి సృష్టి స్థితులు నిర్వర్తించ సందేహించి వారి కక్కడే స్థానము కల్పింపగోరిరి. శంకరుడు కోపించి గౌరీదేవితో వీరిద్దరికినీ తగు చికిత్సచేయమని తెల్పగా గౌరీదేవి ఒక పెట్టెను వారిముందుర ఉంచి దానిని తెరువమని వారిని ఆజ్ఞాపింపగా వారు దానిని తెరచి చూడగా దానియందు ఎందరో బ్రహ్మలు, విష్ణువులు కన్పించిరి. అమ్మవారు ఈ బ్రహ్మ, విష్ణువులను కూడా దానిలో బంధించి వేరొకరిని సృష్ఠి స్థితులకు నియమింతునని తెల్పగా, వారు భయభ్రాంతులై శంకరుని ఆజ్ఞను శిరసావహించి మరల వెళ్లి వారి పనులు చేసికొందుమనియూ, వారి అపరాధములు క్షమించి పదవికాలానంతరము కైలాస ప్రాప్తి కల్పింపమనియు వేడిరి. పరాశక్తి వెంటనే ఒక రుద్రుని సృష్టించి, కల్పారంభముజేసి వారినా కల్పమునకు సృష్టి, స్థితి, లయకారకులుగా వెళ్ళమని నియమించెను.


సనత్కుమారుడు వామదేవునకు వినిపించిన ఈ పురాణమును నాథశర్మ భార్య అనవద్యకు, వ్యాసమహర్షి సూత పౌరాణికునకు, సూతుడు శౌనకాదులకు తెల్పగా శౌనకాది మహామునులు సూతుని ప్రార్థించి, అంతటి పవిత్ర తీర్థమును గురించి చెప్పమని వేడుకొనిరి. సూతుడు ఈ విధముగా చెప్ప దొడంగెను.

శంకరుడు గౌరీదేవి పాపహరణము కొరకు కుండము సృష్టించినది శ్రావణ పౌర్ణిమ. 12 సంవత్సరముల తపము ముగించి ఆ కుండమందు గౌరీదేవి స్నానమాడినది శ్రావణ పౌర్ణిమ, సోమవారము. శిజ్ఞానయోగి అంతిమ కాలమున స్నానమాడినది శ్రావణ పౌర్ణమి సోమవారము. గౌరీదేవి తపము ముగించి శంకరుని ప్రార్ధించి తన పేర గౌరీకుండముగా వెలసిన హరంపాప తీర్థము, రేతోదక తీర్థమునకు సర్వపాప హమమహత్తును ప్రసాదించమని వేడగా, ప్రతి శ్రావణ పౌర్ణిమ ప్రత్యేకముగా సోమవారముకూడా కలిసిన యోగమందు గౌరీకుండ స్నానము జన్మ జన్మాంతరపాపహరమగునని వరము ప్రసాదించెను. కలుక వాల్కలుడు, గౌరి, గంగ, నౌగమేయుడు, శివవిజ్ఞానమయుడు అందరును శ్రావణపౌర్ణమి, సోమవారయుక్త యోగకారక దినమున గౌరీకుండ స్నానముచే సర్వపాపహరులయి ముక్తులయిరి. ఈ కథను శివభక్తిపూర్వకముగ వినినవారందరునూ నిస్సంకోచముగ ముక్తులగుదురు.

Wednesday, December 10, 2008

ప్రకాశిక

ప్రపంచ దేశము లన్నింటికిని ఆధ్యాత్మిక కేంద్రముగా పేరెన్నికగన్న భారత దేశములోని తీర్థ, క్షేత్రములలో తలమానికయినది కాశీ మహా క్షేత్రము. వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణములలోని తీర్థ, క్షేత్ర మహాత్మ్యములు తెలిసిన వారిలో, కొందరు మాత్రమే అతి ప్రయాసలకోర్చి, ఆర్థిక స్తోమతు, ప్రయాణ సొకర్యములు, భోజన వసతి లేని దూరప్రాంత తీర్థ, క్షేత్ర, దర్శనములకు సాహసించెడివారి. 4, 5 దశాబ్దముల క్రితము వరకు "కాశీకి వెళ్ళిన వారు కాటికి వెళ్ళిన వారితో సమానము" అను నానుడి యుండెడిది. భారతదేశ స్వాతంత్య్రము తరువాత కూడ దూరప్రాంతముల నుండి నాలుగయిదు అంచెలుగ ప్రయాణించవలసిన కాశీ క్షేత్రమునకు క్రమక్రమముగ సవారి రైలుమార్గమేర్పడినది. ఆర్థక వసతులు మెఱుగైనవి. వార్తా పత్రికలు దూరశ్రవణ, దూరదర్శన యంత్రములద్వారాను, సాధు సజ్జనుల ఆధ్యాత్మిక ప్రసంగముల ద్వారాను తీర్థ, క్షేత్ర మహాత్మ్యములు విస్తృతమై హిందూ మతములోని సర్వజాతుల వారును ఇపుడు అశేష ప్రజానీకము కాశీ క్షేత్రమును దర్శించుచున్నారు.

బదరీ కేదార యాత్ర చేయువారు హిమాలయ కేదారేశ్వరుని దర్శింతురు. అక్కడి కేదారేశ్వరుని గుఱించి వేద విహిత, శాస్త్ర సమ్మత మయిన అష్టాదశ పురాణములలోని గాధలు మాత్రమే గ్రాహ్యములు. అనేక తీర్థ, క్షేత్ర మహాత్మ్యములునూ అట్టివే.

హిందూ ధర్మ సిధ్ధాంతముననుసరించి అపౌరుషేయములగు వేదములను మహర్షులు తపోశక్తిచే మనోనేత్రమున దర్శించిన మన దేవతలు 33 కోట్లని నిర్ణయించిరి. అందు ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వనీ దేవతలు మొత్తం 33 మంది. మానవ సముదాయము ఎందరు దేవతలను వివిధ నామ రూపములతో భావించి పూజించు చుండిరో వారందరును పై 33 దేవతల కోట్ల అంశారూపములు. వీరందరు భౌతిక జగత్తునందు ఆయా పరిస్థితుల ననుసరించి, ఆయా క్షేత్రములందు ఉద్భవించియున్నారు.

పైవిధముగనే, మహర్షులచే మానవ జాతికి అందించబడిన వేద గర్భిత ఉపనిషత్తులు మొత్తము 1180. అందు ప్రధానమయినవి శ్రీరామ చంద్రునిచే శ్రీమదాంజనేయునకు ఉపదేశింపబడిన 108 ఉపనిషత్తులు మాత్రమే అందుబాడులోనుండి ప్రచారమగుచున్నవి. అట్టి ఉపనిషత్తులలో కాశీ మహాత్మ్యము వర్ణింప బడియున్నదనిన కాశీ క్షేత్రము వేదముల కన్న ముందుగా యుండి యుండవలెననుట నిర్వివాదాంశము. కాశీక్షేత్ర మహాత్మ్యము విపులముగ శ్రీ వేదవ్యాస మహర్షిచే స్కాంతపురాణమున కాశీ ఖండముగా తెలుపబడినది. అటులనే కాశీలోని శ్రీ గౌరీకేదారేశ్వర మహాత్మ్యము గూడ బ్రహ్మ వైవర్త పురాణమందరి కాశీ కేదార రహస్యమందు విపులముగ వివరింపబడినది.

“కాశ్వాన్మరణాన్ముక్తిః", “అరుణాచల స్మరణాన్ముక్తిః", "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" అటులనే "కేదారజలం పీత్వా పునర్జన్మ నవిద్యతే" యనునది నానుడి. కాని హిమాలయ కేదారము దర్శించువారు, అట్టి జలమెక్కడగలదని తెలిసికొని, సేవించి, తీసికొని వచ్చుచున్నారు ? అనునది ప్రశ్నార్థకమే. అట్టి జలమును శ్రీకేదారేశ్వరుడు కాశీలో గుప్త తీర్థముగా నేర్పరచియున్నాడు. శ్రీ కాశీ కేదారేశ్వరునికెదురుగా గల గౌరీ కుండము, కేదారఘట్ట స్నానము, ప్రాచీన మణికర్ణిక /గౌరీకుండ/ హరంపాప/ రేతోదక/ మధుశ్రవ/ మాంధాత/ కేదార/ నీలకంఠ/ హంతీర్థ మను నవతీర్థ స్నాన ఫలితమొసగును. కాశీలోని గంగ పశ్చిమ తీరమున గల 64 ఘట్టములలో ఇంతటి మహత్తర పుణ్యప్రద స్నానమింకొకటి లేదు.

శ్రీ కాశీ గౌరీ కేదారేశ్వర లింగము శుద్ధోదక స్నానానంతరము, బియ్యము, పెసర పప్పులతో వండిన పులగము గుమ్మరించినట్లు రెండు రంగుల మిశ్రితముగ ఈ కలియుగమున కన్పించుచున్నది. ద్వాపరయుగమున వెండి లింగముగను, త్రేతాయుగమున స్వర్ణలింగముగను, కృతయుగమున నవరత్న మణిమయ లింగముగను కన్పట్టునని, దివ్వ దృష్టిగల ఋషిపుంగవులును, గౌరీదేవి శాపమునకు గురియయిన సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాస మహర్షిగా ఉద్భవించి, "వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే,” కల్పాంతము వరకు నాల్గు యుగములయందును శ్రీ కాశీ గౌరీ కేదారేశ్వరుని దర్శించు కొనుచు, బ్రహ్మవైవర్త పురాణమందు కాశీ మూల రహస్యాంతర్ఘత కాశీ కేదార మహాత్మ్యమందు వ్రాసి యున్నారు. ఇట్టి అద్భుతము మరే ఇతర లింగ, మూర్తి రూపములకును కల్గునట్లు వేద, శాస్త్ర , ఇతిహాస,పురాణములందు గన్పట్టదు.

స్కందపూరాణాంతర్గత కాశీ ఖండమున, అసి వరుణ మధ్యగల కాశీ క్షేత్రమును పరమేశ్వర రూపముగ భావించి, శిఖాది కంఠ పర్యంతము ఓంకార ఖండముగను, కంఠాది నాభి పర్యంతము విశ్వేశ ఖండముగను, నాభినుండి పాద పర్యంతము కేదార ఖండముగను తలంచిరి. పై మూడు ఖండములందు కేదార ఖండమందలి శ్రీగౌరీ కేదార విశేష మహాత్మ్యమును వేదవ్యాస మహర్షి ప్రత్యేకముగ బ్రహ్మ వైవర్త పురాణమందు పేర్కొనిరి.

ప్రప్రథమమున మహా కైలాసము నుండి నర నారాయణ రూప విష్ణుమూర్తి ననుగ్రహించుటకై నందీశ్వరుని కోరికపై హిమాలయ పర్వత శ్రేణిలోని బదరీ కేదార పర్వతమునకు దిగి వచ్చిన సదాశివుడు, మాంథాత చక్రవర్తి తపోదీక్షకు తృప్తుడై అతని కోరికపై తన షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము హిమాలయ కేదారమందు వదలి పంచదశ కళాత్మకుడై శ్రీ కాశీ కేదారమందు అన్నమయ లింగరూపుడుగ, హరిహరాత్మక, శివశక్త్యాత్మక, భావనా పూర్వక రెండు భాగములుగ స్వయంభువై వెలసి యున్నాడు. శ్రీ గౌరీ కేదారేశ్వర దర్శన, పూజన, స్తోత్రములచే శివ, పార్వతి, విష్ణు, లక్ష్మి, అన్నపూర్ణలను పంచదేవతలను అర్చించిన సద్యః ఫలితము ప్రాప్తించును.

శ్రీ కాశీ కేదార ఆవిర్భావము బ్రహ్మవైవర్త పురాణమందలి కాశీ మూల రహస్యమను 19, 20, 21 అధ్యాయములందు కొన్ని శ్లోకములుగా వర్ణింపబడినది.

సంస్కృతమూలము:

తస్మిన్ కాలే తతః పూర్వం చిరకాలాద్హిమాచలే । తపస్సన్ సంస్థితస్తత్ర మాంథాతానామ భూపతిః ॥
సూర్యాన్వయశ్చిరం రాజ్యం కృత్వా పుత్రాస్తరాజ్యధుః । సార్వభౌమ మహాయోగి సర్వయజ్వాऽదానవాన్॥
పంచాశత్కన్య కోయేన దత్తా సౌభరియోగినే। యోనిర్భేద్యపితుః కుక్షిం నిర్గతస్తన్మృతిం వినా॥
యస్యగాయా పురాణేషు ప్రథితా దేవ సంస్కృతా ।ససర్వభోగ వితః కేదారేశం సమాశ్రయత్॥
ధ్యాత్వా తత్ర చిరందేవం యుగానాం ఖతమర్పయత్ ।త్వల్లింగ దర్శనం భూయాత్ మమా ऽ త్త్రేతినిరంతరమ్॥
తదాహభగవాన్ శంభుః శ్రీమత్కేదారనాయకః ।రాజర్షితం నభోవాణ్యా ప్రేమ్ణా భక్త శిరోమణిమ్॥
ఇతితేః సహకేదార స్థాన మాప ఋషిః పునః ।ఉషస్యన్నం చాపమాస ముగ్దదా లీయుతం క్షణాత్॥
శృణుభక్తా ऽ త్రమే లింగరూపం యుగ చతుష్టయే । ముద్గదా ల్యాత్మికం లింగం భవిష్యతి శుభ ప్రదమ్॥
త్వయా ऽऽ తిథ్యా యార్ధభాగ కృతయారేశయాయుతమ్ ।భాగద్వయాత్మకం లింగం సత్యం హరిహరాత్మకమ్॥
శివ శక్త్యాత్మక మపి నాత్రకార్య విచారణా । భగమన్నేన పూర్ణత్వాదన్న పూర్ణా ऽ త్ర తిష్ఠతు॥
అన్నపూర్ణాత్మకం లింగం మద్భాగేన సుసంయుతమ్ । తస్మాదన్నాన్నపూర్ణాహి కేదారేమయి తిష్ఠతి॥
అన్నపూర్ణా ససహితం మల్లింగం యస్తుసేవతే । తస్యాన్నపూర్ణా సతతం గృహమాశ్రియ్య తిష్ఠతి॥

తెలుగు అనువాదము
పూర్వము సత్య యుగమున మాంథాతయను సార్వభౌముడు సర్వయజ్ఞయాగములు, దానములు చేసినవాడు, తనతండ్రి మృతిచెందకయే అతని ఉదరము చీల్చుకొని బయల్పడినవాడు, సౌరభియను యోగి పుంగవునకు తన 50 మంది కుమార్తెలను వివాహము చేసి, సర్వభోగవిరక్తుడై, రాజ్యభారము పుత్రులకప్పగించి, హిమాలయ పర్వతములందు వంద యుగములకాలము కేదారేశ్వరుడు సంతసించి ఆకాశవాణి రూపమున అతనిని కాశీకి వెళ్ళి తపమాచరింప నాదేశించెను. మాంథాత కాశీ చేరి ఒకధనుర్మాంసాంత మకర సంక్రాంతి పుణ్యదినమున ఉషఃకాల పూజానంతరము నివేదనకు బియ్యము, పెసరపప్పుతో చేసిన పులగన్నమును రెండుగా మధ్యలో గీతగీచి ఒక భాగము కేదారేశ్వరునకు, రెండవది తనకుగా తలంచి నివేదింపగా, శంకరుడు అతిథి రూపమున దర్శనమిచ్చి, మాంథాత చకితుడై ఆశ్చర్యముగ ప్రణమిల్లి ప్రార్థింపగా పరమేశ్వరుడతనికి తన నిజరూపము ప్రకటింపజేసి ఆపులగాన్నమునందు అంతర్హితుడాయెను. హిమాలయ కేదార పాషాణ లింగము వలె కన్పట్టు శ్రీకాశీ గౌరీకేదార లింగము నాల్గు యుగములయందు రూపాంతరము చెందుననియు, రెండు భాగములుగ నున్న యది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము గను, అన్నలింగమయినందున అన్నపూర్ణ సదాయిందు వసించి యుండునని, అన్నపూర్ణ సహిత కేదారేశ్వరునిగా తనను పూజించిన వారింట అన్నమునకు లోటుండదని మాంథాత పరమాత్మచే వరము పొందెను. ధర్మార్థకామమోక్షములు కరతలామలకములై మనోవాంఛితములు నెఱవేరును.


తుషారాద్రిం సమారూప్యా కేదారం వీక్ష్యే యత్ఫలమ్।
తత్ఫలం సప్త గుణితం కాశ్యాం కేదార దర్శనే ॥
(స్కందపురాణము)
హిమాలయ కేదార దర్శనమునకు 7 రెట్లు అధిక ఫలము కాశీ కేదార దర్శనము. విశ్వేశ్వరునకన్న అధిక ప్రాధాన్యము కేదారేశ్వరునకు గలదు. కేదార ఖండమందు దేహత్యాగము సంభవించెనేని, వారొనరించిన పాపములకు కాలభైరవ దండన లేకయే శివసాయుజ్యము తథ్యము. ఇట్టి సుకృతము పంచక్రోశాత్మక కాశీయందు మరెక్కడను లేదు.

శ్రీ కాశీ కేదార మహాత్మ్యమును సంస్కృతమూలము, హిందీ భాషానువాదము నుండి గ్రహించి తెలుగు భక్త జనావళికి తేటతెల్లమొనరించుటకు ఈ గ్రంథరచన నా పూర్వజన్మ సుకృతమున శ్రీకేదారేశ్వరుడు నాకొసంగిన వరముగా భావింతును.

బుధజన విధేయుడు
జానపాటి బాలనరస అప్పేశ్వర శాస్త్రి
సనాతన ధర్మ ప్రచారక
కాశీ వాసి

Tuesday, December 9, 2008

పంచమాధ్యాయము

మరల వామదేవుని కోరికపై సనత్కుమారులు చెప్పదొడంగిరి.

వారి ముగ్గురి తరఫున బ్రహ్మ దేవుడు మహాదేవుని ప్రార్థించి, స్వామీ మేము మాకార్యములు చేసి అలసిపోతిమి, ఇక మీ సన్నిధానములో ఇక్కడ ఉన్న బ్రహ్మలవలె మీ సేవచేసికొనెదమనగా, పరమాత్మ చిరునగవుతో రుద్రుని వంకచూచి వీరు మాయా మోహితులయిరి. నీవు వీరికి మంచి మార్గము తెలుపలేదా యని కనుసైగ చేసిరి. మహాకైలాసమున సంభాషణ అంతయు పశ్యంతి యనగా మనోభాషను కనుసైగలద్వారా వ్యక్త పరచుటే కాని వైఖరి యనగా శబ్దమూలమున జరుగదు.
అపుడు రుద్రుడు నవ్వుచూ, మహాత్మా మీరు సర్వజ్ఞులు. వీరికి తగిన చికిత్స చేయుడనగా పరమాత్మ బ్రహ్మతో ఇట్లనిరి. మీరు అతి కష్టతరమగు పనులు చేసి చాలా పుణ్యము సంపాదించితిరి. దుర్లభమగు బ్రహ్మ, విష్ణు పదములు సాధారణ పుణ్య కార్యములకు లభ్యము కావు. పృధ్విలోని సామాన్యులకిట్టిది దుర్లభము. మీర మరల మీలోకములకు వెళ్లి పూర్వము వలె సృష్ఠి, స్థితి కార్యములు నిర్వర్తించుచు నాపై భక్తి గల్గి నన్ను సేవించిన యడల అంతమున నా లోకము జేరగలరు. పరిపక్వము గాని ఫలము క్రింద పడదు. మధ్యకాలములో నాసన్నిధానము దుర్లభము. మీరు భక్తితో నన్ను సేవించని యడల మరల భూలోకమున నరజన్మపొందుదురు.
మీరు మొదటి జన్మలో భూలోకమున బ్రాహ్మణ, క్షత్రియులు. వేద, పురాణ, ఆగమములలో శివజ్ఞాన రహస్యము నెఱిగిన నా భక్తుజు శివవిజ్ఞుడు అనువాడు హిమాలయములలోని కేదార పర్వతమందు తపశ్చర్యలో నిమగ్నుడై యుండెను. నరనారాయణుల పేరుగల పర్వత రాజు, జ్ఞన సిద్ధి యను మంత్రి, నా భక్తుడు శివవిజ్ఞానుని చాలా కాలము సేవింపగా అతడు ప్రసన్నుడై వారిని అనుగ్రహించెను. తపమాచరించు శివవిజ్ఞానుడు పరమేశ్వరునకు నమస్కరించి హేప్రభూ మీ వృషభమూపుర రూప దర్శనము మాత్రమే చేయుచుంటిని, నాపై కరుణించి మీ లింగరూప దర్శన మిప్పింపుడని వేడగా పరమాత్మ ఆకాశవాణి రూపమున భక్తా మానవ శరీరులకు ఇక్కడ లింగరూప దర్శనము దుర్లభము. గాన నీవు కాశీ క్షేత్రమునకు వెళ్లి కాశీలో నేను పంచదశ కళలతో శోభిల్లు కేదారలింగ సాన్నిధ్యమున నీరూపముగా యున్న రేతోదక, హరంపాప, గౌరీకుండములలో ప్రదక్షిణ పూర్వక స్నానమాచరించి వచ్చిన యడల నీకిక్కడ లింగరూప దర్శనము లభ్యమగునని తెల్పెను. అది వినివ నరనారాయణ, జ్ఞానసిద్ధులిద్దరునూ సంతసించి మనముకూడా శివవిజ్ఞానుని నిత్యమూ సేవించు కొనుచు కాశీ దర్శించెదమని తలంచి త్రోవలో గురు శుశ్రూషలో వారు కుశలు, సమిధలు, ఫల పుష్పాదులు సేకరించుచు, గురుపాద సేవనము చేయుచు వారి వాహనములు, చతురంగబలమును వదలి గురు ఆజ్ఞపై పాదచరులై మార్గమధ్యమున ఒక అరణ్యమును చేరిరి. అందు ఒక తటాకము ఒడ్డున ఒక పెద్ద వటవృక్షము చూచి శివవిజ్ఞానునితో సహా ఆ వటవృక్షము నీడన విశ్రమించిరి. ఆవృక్షముపై శివనిందాపరాధమున బ్రహ్మరాక్షస రూపమున ఒకడు నివశించుచుండెను. అర్ధరాత్రి సమయమున రాక్షసుడు వట వృక్షమునుండి క్రిందకు దిగి వటవృక్షము క్రింద నిద్రించు శివయోగిని భక్షింపబోగా, వటవృక్షము చుట్టును శివయోగికి రక్షణగా కావలి యున్న రాజు, మంత్రులు ఆ రాక్షసుని గమనించి నిలువరించి కాటుక కొండవలె ఉన్నవానిని ప్రశ్నించిరి. అతడిట్లు చెప్పదొడంగెను. నేను బ్రహ్మరాక్షసుడను. ఈ వటవృక్షమునాశ్రయించి రాత్రి నిద్రించువారిని భక్షించుచుంటిని. అదృష్టము వలన నేడు యితడు నాకు ఆహారమయినాడు.మీరు వృక్షఛాయకు దూరముగా యున్నందున మిమ్ము వదలివేయుదును. మీరు నన్ను అడ్డగించినచో మీరు, మీసేనతో సహా నాకు ఆహారమగుదురు. నా ప్రళయ భయంకర రూపము చూడుడని అతడు అగ్ని పర్వతమువలె మహాకాయుడై వికటాట్టహాసము చేయగా రాజు,మంత్రి భయభ్రాంతులై, మనమూ మనసైన్యమూ వీనినేమియూ చేయలేమని తలంచి ఉపాయముగా వానితో, శివయోగి బ్రాహ్మణోత్తముడు, నీవునూ బ్రాహ్మణుడవు గనుక దయతలచి శివయోగిని విడిచి పెట్టమని బ్రతిమాలిరి.
బ్రహ్మరాక్షసుడు తనకు అట్టి పాపభీతి లేదని, శివయోగిని వదల వలసిన మీరిద్దరునూ నాకు ఆహారము కావలయునని తెలుపగా, రాజు,మంత్రి ఆోలోచించుకొని బ్రాహ్మణుడు, సర్వవిద్యాపారంగతుడు అగు గురువును బ్రతికించుకొనుటకు క్షణభంగురమగు తమ తనువులు త్యాగము చేయతలచిరి. వారు రాక్షసునితో తమను ఆహారముగా తీసుకొని శివయోగిని వదిలి పెట్టమనియు, రాక్షసుని మాటలు ఎట్లు విశ్వసించ గలమనియు తెల్పిరి. దానికి రాక్షసుడు వారిద్దరినీ చెట్టునీడకు రమ్మనియు, వారిని తన నోటియందు పెట్టుకొని మింగుటకు ముందుగా శివయోగిని లేపి చెట్టు నీడనుండి వెలుపలకు వెళ్ళమనియు, చెట్టునీడలో నున్నవారిని మాత్రమే తాను భక్షించుట తన నియమమనియు తెల్పెను. వారు సమ్మతించి చెట్టు క్రిందకు రాగా, రాక్షసుడు అతని నోటిని కొండ గుహయంతచేసి వారిని తన నోటిలో పెట్టుకొనగనే రాజు, మంత్రి బిగ్గరగా కేకలు వేసి శివయోగిని నిద్రనుండి లేపిరి. అతడు కలత నిద్రలో లేచి, రాక్షసుని నోటిలో వారిని చూచి వారిద్వారా విషయమంతయు విని, ఏకాగ్రచిత్తుడై పరమాత్మను ధ్యానము చేసి, రాఙసుని గట్టిగా గదమాయించగా, రాక్షసుని శరీరమంతయూ అగ్నిలో నున్నట్లు బాధింపగా రాక్షసుడు రాజును, మంత్రిని నోటినుండి క్రిందకు ఉమిసి తనను కాపాడవలసినదిగా శివయోగిని ప్రార్థించెను.