Showing posts with label గంగ కథ. Show all posts
Showing posts with label గంగ కథ. Show all posts

Thursday, January 22, 2009

పంచదశోధ్యాయము

ఋషులు సూతుని మహాత్మా శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా విభాగమయి శ్రీకేదారేశ్వరుని పూజించుటకు, తపమాచరించుటకు ఎపుడు వచ్చిరి? ఆకాల భేదము సెలవిండని కోరిరి. దానికి సూతుడు నవ్వుచూ బ్రాహ్మణోత్తములారా వేద, శాస్త్ర, పురాణములన్నియు అనాదిగా యున్నవి. పరమేశ్వరుని సహచ ఉచ్ఛావస, నిశ్వాస నుండి ఉదయించినవి వేదములు. కనుక వీనికి కాల భేదముయొక్క మలినమంటదు. పరమాత్మ లీలా రూపమగు ఈ ప్రపంచ సృష్ఠి, స్థితి, లయలు కాలమునకు అతీతుము. ఊహకందునవి కావు. కనుక గంగాదేవి వృత్తాంతము సాకల్యముగా వినుడని చెప్పదొడగెను.

విష్ణుమూర్తి తపమాచరించు సమయమున నేను అలకనంద నామముతో అక్కడకు చేరి, అతనికి శీతలబాధ కలుగకుండ అనుష్టానమునకు గాను అతని ఎదుట సమశీతోష్ణగుండముగా నిలచితిని. తర్వాత మందాకిని నామముతో కేదారేశ్వరుని సేవించు కొనుటకు వెళ్ళి కొత్త పెండ్లి కుమార్తెగా ఒక అంశతో పతి సమక్షమున నుంటుని. ఆయన నాలో స్నానము చేయుటచే నేను ఉష్ణ గుండనునే ఆయన కుండల మణి ప్రభావమున మణికర్ణికనైతిని. అక్కడనుండి భగీరధుని వెంబడించి కుశావర్తమును గంగా ద్వారము/ హరిద్వారము/మాయాపురి యందు భూమిని తాకి, జహ్నుముని పుత్రికగా స్వీకరింపబడి మీతో కలిసి కాశీకి చేరి కేదారనాధుని ఎదుట ప్రాచీన మణికర్ణికతో కలసి ఖివాపరాధ ప్రాయశ్చిత్తము పొంది యమున, సరస్వతి, మరియు ఇతర నదులతో కలసి, విశ్వేశ్వర, మణికర్ణికాది దేవతలనందరను పదే పదే ప్రార్ధించి సగర పుత్రులనుద్ధరించుటకు … ప్రవహించితినని గంగ తన వృత్తాంతము సవిస్తరముగా వినిపించెను. కేదారేశ్వరుడు పరమ ప్రీతితో, సఖీ! మన సంగమ స్థలమగు నిచట స్నానమాచరించిన వారు ముక్తులగుదురు. జన్మ జన్మాంతరములలో చేసిన వివిధ పాపములన్నియు కాశీ దర్శన భాగ్యమున ముక్తమగును. కాశీలో చేసిన శివాపరాధములన్నియూ ప్రాచీన మణికర్ణికా స్నానమున ముక్తమగును. ఈనాటి మన సంగమదినము శ్రావణ సోమవారము, పూర్ణిమ యగుటచే విశేషము. ఇది దుర్లభము. ఏ ప్రాణియయినను ఇట్టి మహత్తర యోగ దినమున ఈ గౌరీ కుండమందు స్నానమాడినచో వారు నా రూపము ధరించి నన్ను చేరుదురు. నా ఎదుట గల గౌరీకుండ స్నానమున నీవు ధన్యత జెందితివి. గౌరీ దేవి నాయడల చేసిన అపరాధము ఇక్కడ 12 సంవత్సరములు తపమాచరించి, హరంపాప/రేతోదక తీర్థ స్నానమున ముక్తమయినది. అటులనే సరస్వతి బ్రహ్మదేవుని గోరిన పాపమునుండి ముక్తమయినది. కనుక ఇట్టి మహత్తర రహస్యమగు కాశీ కేదార కథను వినినవారు నిశ్చయముగ మరల తల్లి గర్భవాసము లేకయే ముక్తులగుదురు. ఈ వృత్తాంతము సాకల్యముగ తెలసికొనిన సనత్కుమార వామదేవులు, నాధశర్మ, అనవద్యలు, నా గురువర్యులు వ్యాస భగవానులు, వారిద్వారా విన్న నేను, నాద్వారా వినిన మీరందరునూ ధన్యులయితిరని సూత పౌరాణికుడు నైమిశారణ్యమున మునులకు వినిపించిరి.