Thursday, January 22, 2009

పంచదశోధ్యాయము

ఋషులు సూతుని మహాత్మా శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా విభాగమయి శ్రీకేదారేశ్వరుని పూజించుటకు, తపమాచరించుటకు ఎపుడు వచ్చిరి? ఆకాల భేదము సెలవిండని కోరిరి. దానికి సూతుడు నవ్వుచూ బ్రాహ్మణోత్తములారా వేద, శాస్త్ర, పురాణములన్నియు అనాదిగా యున్నవి. పరమేశ్వరుని సహచ ఉచ్ఛావస, నిశ్వాస నుండి ఉదయించినవి వేదములు. కనుక వీనికి కాల భేదముయొక్క మలినమంటదు. పరమాత్మ లీలా రూపమగు ఈ ప్రపంచ సృష్ఠి, స్థితి, లయలు కాలమునకు అతీతుము. ఊహకందునవి కావు. కనుక గంగాదేవి వృత్తాంతము సాకల్యముగా వినుడని చెప్పదొడగెను.

విష్ణుమూర్తి తపమాచరించు సమయమున నేను అలకనంద నామముతో అక్కడకు చేరి, అతనికి శీతలబాధ కలుగకుండ అనుష్టానమునకు గాను అతని ఎదుట సమశీతోష్ణగుండముగా నిలచితిని. తర్వాత మందాకిని నామముతో కేదారేశ్వరుని సేవించు కొనుటకు వెళ్ళి కొత్త పెండ్లి కుమార్తెగా ఒక అంశతో పతి సమక్షమున నుంటుని. ఆయన నాలో స్నానము చేయుటచే నేను ఉష్ణ గుండనునే ఆయన కుండల మణి ప్రభావమున మణికర్ణికనైతిని. అక్కడనుండి భగీరధుని వెంబడించి కుశావర్తమును గంగా ద్వారము/ హరిద్వారము/మాయాపురి యందు భూమిని తాకి, జహ్నుముని పుత్రికగా స్వీకరింపబడి మీతో కలిసి కాశీకి చేరి కేదారనాధుని ఎదుట ప్రాచీన మణికర్ణికతో కలసి ఖివాపరాధ ప్రాయశ్చిత్తము పొంది యమున, సరస్వతి, మరియు ఇతర నదులతో కలసి, విశ్వేశ్వర, మణికర్ణికాది దేవతలనందరను పదే పదే ప్రార్ధించి సగర పుత్రులనుద్ధరించుటకు … ప్రవహించితినని గంగ తన వృత్తాంతము సవిస్తరముగా వినిపించెను. కేదారేశ్వరుడు పరమ ప్రీతితో, సఖీ! మన సంగమ స్థలమగు నిచట స్నానమాచరించిన వారు ముక్తులగుదురు. జన్మ జన్మాంతరములలో చేసిన వివిధ పాపములన్నియు కాశీ దర్శన భాగ్యమున ముక్తమగును. కాశీలో చేసిన శివాపరాధములన్నియూ ప్రాచీన మణికర్ణికా స్నానమున ముక్తమగును. ఈనాటి మన సంగమదినము శ్రావణ సోమవారము, పూర్ణిమ యగుటచే విశేషము. ఇది దుర్లభము. ఏ ప్రాణియయినను ఇట్టి మహత్తర యోగ దినమున ఈ గౌరీ కుండమందు స్నానమాడినచో వారు నా రూపము ధరించి నన్ను చేరుదురు. నా ఎదుట గల గౌరీకుండ స్నానమున నీవు ధన్యత జెందితివి. గౌరీ దేవి నాయడల చేసిన అపరాధము ఇక్కడ 12 సంవత్సరములు తపమాచరించి, హరంపాప/రేతోదక తీర్థ స్నానమున ముక్తమయినది. అటులనే సరస్వతి బ్రహ్మదేవుని గోరిన పాపమునుండి ముక్తమయినది. కనుక ఇట్టి మహత్తర రహస్యమగు కాశీ కేదార కథను వినినవారు నిశ్చయముగ మరల తల్లి గర్భవాసము లేకయే ముక్తులగుదురు. ఈ వృత్తాంతము సాకల్యముగ తెలసికొనిన సనత్కుమార వామదేవులు, నాధశర్మ, అనవద్యలు, నా గురువర్యులు వ్యాస భగవానులు, వారిద్వారా విన్న నేను, నాద్వారా వినిన మీరందరునూ ధన్యులయితిరని సూత పౌరాణికుడు నైమిశారణ్యమున మునులకు వినిపించిరి.

Saturday, January 10, 2009

చతుర్దశోధ్యాయము

శౌనకాదులు సూతుని మహాత్మా! యముల, సరస్వతుల వృత్తాంతములను వినిన గంగ తన విషయము వారతో ఏమి చెప్పినది. గంగ శంకరునెట్లు వివాహమాడినది తెలుపుడని ప్రార్థించగా వారికి సూతపౌరాణికులిట్లు తెల్పిరి. గంగ, యమున సరస్వతులతో చెలులారా! నేను పరాశక్తి అంశను. బ్రహ్మకు శివుడు, దేవతలకు బ్రహ్మ, తర్వాత భగీరధుని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వదలిన నన్ను భరించుటకు భగీరధుడు శివుని ప్రార్థించగా శివుడంగీకరించినపుడు నేను చపల బుద్ధితో, స్త్రీ సహజ అహంభావముచే, శివుని మహత్తు తక్కువగా ఎంచి అతని శిరముపై దూకి పాతాళమునకు త్రొక్కదలచితిని. శివుడు అతివాగముగా దూకిన నన్ను ఒక సాధారణ జలబిందువు పగిది తన జటా జూటమున బంధించివేసెను. ఎంత ప్రయత్నించినను బయల్పడవీలులేని నేను నిస్సహాయురాలనై శివుని గురించి తపస్సు చేయగా ఆయన సంతోషించి నీ కోరిక ఏమని అడిగిరి. మీరు నానాథులు కావలయునంటిని. శివుడు నవ్వి నీవు పరాశక్తి అంశతో ఉద్భవించితివి, కనుక నీవు నాసతివే. నీవు గర్వముతో నాతలపై దూకి నన్ను చులకనగా తలంచి శివాపరాధమునకు పాలపడితివి గనుక నిన్ను నా జటలో బంధించితిని. అట్లుకూడ నిన్ను తలపై ధరించి సతిగా స్థానమిచ్చితిని. నీపాప పరిహారము కొఱకు నీవు హిమవంతునిపై దిగి అతని పుత్రికగా గుర్తింపబడి, తపస్సుచేసి ఉమాదేవిచే చెల్లెలిగా గుర్తింపబడి ఆమెద్వారా నన్ను జేరుదువు అని శంకరులు పల్కగా సంతసించి అచంచల మనస్సుతో తపమాచరించుచుంటిని.

భగీరధుని కోరికపై శంకరులు నన్ను భూమికి వెళ్ళమనగా నేను భయముచే నన్ను విడువవద్దని శంకరుని ప్రార్ధించితిని. దానికి శంకరులు భయపడవలదని, హిమవంతుని పుత్రిగా, గిరిజ చెలిగా నీవు గుర్తింపబడి గిరిజ ద్వారానే నన్ను పొందగలవు. భక్తరక్షణ నా కర్తవ్యము. కనుక ఒక అంశగా హిమాలయముచేరి అక్కడ నుండి 7 పాయలుగా విడివడి 3 పాయలు తూర్పు సముద్రము, 3 పాయలు పశ్చిమ సముద్రములో కలిసి ఒకపాయ భగీరధుని రధము వెంట నడిచి జహ్నుముని ఆశ్రమముమీదుగా ప్రవహించి జహ్నుముని కోపకారణంగా అతని గర్భమును ప్రవేశించి, పుత్రికవై మరల భగీరధుని ప్రార్ధనపై జహ్నుముని కుడిచెవి నుండి బయల్పడి ప్రవహించుచు కాశీచేరి అచట కేదారేశ్వరుని ఎదుటనున్న హరంపాప/రేతోదక తీర్థముతో కలసి గౌరీదేవిని పూజించి, కేదార, విశ్వేశలింగములను పూజించి, మణికర్ణికను కలసి చివరగా సగర పుత్రులను తరింపజేసి సముద్రమును జేరుదువు. ఇపుడు త్రేతాయుగము జరుగుచున్నది, తరువాత ద్వాపర, కలియుగములు గడిచి మరల కృతయుగము వరకు షోడశ కళలతో సాశీలో నుందువు. ఒక అంశ మాత్రమే సముద్రమును జేరును. ఈ నాల్గు యుగములలోను పృధ్విపై జీవులను ఉద్ధరింతువు. త్రేతా, ద్వాపర, కలియుగములలో ధర్మము క్రమముగా 3, 2, 1 పాదము మాత్రమే మిగులును. మరల సత్యయుగమునకు ధర్మము నాల్గుపదములు ప్రవర్తించును. త్రేతాయుగ, ద్వాపరయుగములలో నీసేవనము ద్వారా కర్మబంధములనుండి ముక్తులగుదురు. కలియుగమున మానవులు కర్మ భ్రష్ఠులై దుర్బుద్ధులగుదురు. చాతుర్వర్ణములలో వర్ణ సంకరము జరిగి పాపులగుదురు. వేదనింద, బ్రాహ్మణ నింద జరుగును. అగ్రజాతులు నీచులై,నీచులు అగ్రజాతులై, మ్లేచ్ఛులు, చండాలురు, పుల్కసులు రాజులగుదురు. పరస్త్రీల సతీత్వము భంగపరచి శతవిధ ప్రయత్నములచే ద్రవ్యాపహరణ, యథారాజా, తథా ప్రజా! గా ధర్మలుప్తమై అల్పుల మాటలు వేదవాక్కులై శాస్త్ర విరుద్ధ కర్మలాచరించి, ధర్మా ధర్మములు తెలిసికొనక, మూఢులే ప్రబలి సనాతన ధర్మము అవహేళనకు గురికాబడి అధర్మములే ఉపదేశములై నాచే నిర్దేశింపబడిన వేదశాస్త్రములు తెలియజాలక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనేక తెగలై, కర్మభ్రరష్టులగుదురు. దేవ, ఋషి, ద్విజ, రాజన్య, వైశ్య , శూద్ర, బిడాల (మోసగాండ్రు), పశు, మ్లేచ్ఛ, చండాలురుగా 10 తెగలుగా బ్రాహ్మణులు దిగజారుదురు. కృత, త్రేత, ద్వాపర యుగములలో దేవ. ఋుషి, ద్విజ, రాజన్యులు నాల్గు తెగల బ్రాహ్మణులుందురు. మిగిలిన 6 తెగలవారును కర్మానుసారముగా కలియుగ బ్రాహ్మణులు. నిత్యము షట్కర్మలాచరించు అష్టాంగ యోగనిరతులు, నా రహస్యములను తెలిసినవారు గేవబ్రాహ్మణులు. షట్కర్మ నిరతులు, యోగయుక్తులు, వేదశాస్త్ర పద్ధతిగా యజ్ఞములాచరించువారు ఋషి బ్రాహ్మణులు. షట్కర్మలాచరించుచు, శాస్త్రవిధిన నా పూజలు సల్పువారు వేదములనెఱిగినవారు ద్విజ బ్రాహ్మణులు. వీరు సత్య, త్రేతా యుగములలో మాత్రమే యుందురు. అస్త్ర, శస్త్ర శాస్త్రములనెఱిగి, నా పూజావిధి నెఱిగి భజించువారు రాజన్య బ్రాహ్మణులు. వీరు ద్వాపర యుగమున నుందురు. కర్మభేదములచే కలియుగమున మిగిలిన 6 తెగలవారును జీవింతులు. వ్యవసాయము, గోసంరక్షణ, వాణిజ్యము చేయువారు వైశ్యబ్రాహ్మణులు. శూద్రాది నీచ జనుల సేవచేయుచు, సత్కర్మలో శ్రద్ధలేక, నియమపాలనలేక, వేదాధ్యయనము చేయక, స్వార్ధబుద్ధితో దేవ, ఋషి, పితృ సేవ చేయకయుండువారు శూద్రులు. ఇతరులను భ్రమింపజేసి, శాస్త్రములను నిర్వర్తించక యోగులవలె నటించుచు, స్వార్ధపరులై, ధనాపేక్షతో మునులవలె, ఉపదేష్ఠల వలె, అన్నపానాదుల విచక్షణారహితులై కౄరచిత్తులు, బిడాలురను మోసగాండ్రు.

ధర్మాధర్మములు, పుణ్యపాపములు, కృత్యాకృత్యములు తెలియక స్వధర్మ భ్రష్ఠులై, మాతా పితృ, గురువులను గౌరవించక కేవలము పొట్టనింపుకొనువారు నామ మాత్ర బ్రాహ్మణులు, అధమాధములు. బ్రాహ్మణోచిత సంస్కారములు లేనివారు పశువులు. బ్రాహ్మణకలమందు జన్మించి మ్లేచ్ఛ కర్మలయందు ఇష్టులై ప్రవర్తించుచు గడ్డము, మీసములు పెంచి మద్య మాంసములు సేవించుచు అన్ని జాతుల స్త్రీలను సంగమించుచు, పవిత్ర కర్మలను నిందించుచు, దయా ధర్మములు లేక, ప్రాణహింస చేయుచు బ్రతుకువారు మ్లేచ్ఛులు. ఇతర ప్రాణి హింసతో తృప్తిపడువారు, నీచులను సేవించుట సుఖమని భావించువారు, స్వకర్మలను వదలినవారు, నీచకుల స్త్రీలను కోరువారు, మద్య మాంసములందు ఇష్టులు, బ్రాహ్మణులుగా పుట్టినందుకు నిందించుకొనువారు, నీచ సహవాసము ప్రియమయినవారు, సజ్జనులను నిందించి, అవమానించువారు చండాలురు. నా భక్తులు లక్షలు, కోట్లుగా యుందురు. నా భక్తుడైన శూద్రుడు బ్రాహ్మణుని కంటె ఉత్తముడు. అన్ని వర్గములలోని నా భక్తిలేనివారు నీచులు. కలియుగమున ఇట్టివారిని నీవు తప్ప వేరెవరును ఉద్ధరించలేరు. కనియుగము పాప యుక్తము. రాజులు, బ్రాహ్మణులు పాపులగుదురు. శృతి, స్మృతి, పూరాణములందని నా రహస్యముల నెఱిగినవారు బ్రాహ్మణులు గాన వారు నా శరీరధారులు. నన్నెరిగిన బ్రాహ్మణుడు నా స్వరూపమే యగును. కృత, త్రేతా, ద్వాపర యూగములందు పుణ్యాత్ములతో పుణ్యలోకములు నిండిపోవును. కలియుగమున యమలోకముకిటకిటలాడును. స్వర్గాదిలోకములు శూన్యము కాకుండుటకు నీవు పాపులను పవిత్రులను జేసి పంపుదువు. పుణ్యాత్ములు దుర్లభులగుచో దేవలోక అప్సరసల కోరిక తీరదు. నీలో స్నానము చేసి, ఒక బిందువు జలము పానము జేసి, నీ దర్శనముతో జనులు విగతపాపులగుదురు. నీ తీరవాసులు ముక్తులగుదురు. నీ తటమున శరీరత్యాగము జరిగనివారు నా శ్వరూపము ప్రాప్తించి నన్ను చేరుట ధృవము. శంకరును నాకు మరియు వరమొసంగి నా జలము కలుషితమయినను, దుర్గంధమయినను, ఇంకినను, పవిత్రమే యగును. జనులను తరింపజేయును. విదేశములకు తీసికొని వెళ్లబడినను గంగాజలము పవిత్రమే. శివాజ్ఞతీసికొని నేను భగీరధుని వెంబడించితిని. హిమాలయములలోని గంగోత్రి వద్ద జలరూపమున మానవులకు దర్శనమిచ్చితిని. అక్కడనుండి నాల్గు విభాగములై శ్రీవిష్ణుమూర్తి పరమానంద కందులను పేర నరనారాయణులుగా శ్రీశంకరుని గుర్చి ఘోర తపమాచరించన చోటు చేరితిని. పరమేశ్వరుడు కైలాసమునుండి దిగివచ్చి, దర్శనమాత్రమున సద్యః ముక్తినొసగుటకు శ్రీకేదారేశ్వరునిగా లింగరూపమున దర్శనమొసగిన స్థలము హిమాలయ కేదారము. శ్రీ విష్ణుమూర్తి బదరికా క్షేత్రమున నర నారాయణులను పేర విభక్తమయి లింగార్చనలో నిమగ్నమయి, గ్రీష్మమున పంచాగ్ని మధ్యన, వర్ష ఋతువులో ఆచ్ఛాదనలేని మైదానమున, శరదృతువులో నిరాహారులుగ, హేమంతమున జల శాయిలుగ, పర్ణశాయిలుగను, కొద్ది రోజులు పర్ణ భక్షకులుగ, కొద్దిరోజలు తృణ భక్షకులుగ, కొద్దిరోజుల జల భక్షణము, వాయు భక్షణలతో కేదారేశ్వరుని ఆరాధించిరి. పరమాత్మ నరనారాయణుల నిష్ఠాగరిష్ఠ భక్తికి మెచ్చి వాంఛితార్ధముల నొసగి ఆ ప్రదేశమును బదరికా క్షేత్రముగా, దర్శనమాత్రమున ధర్మార్ధకామమొక్ష ప్రదముగ వరమొసగెను. ఈ రహస్య కథనము తెల్సికొనినవారు శివపదము బొందుదురు.

Thursday, January 1, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు




మా బ్లాగును సందర్శకులందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కాశీ విశ్వనాథుడు తన దేవేరులు విశాలాక్షి, అన్నపూర్ణలతో మీ అందరకూ

ఆయురారోగ్య అష్టైశ్వర్యములను ప్రసాదించు గాక.

--- దువ్వూరి వేణుగోపాల్

Monday, December 29, 2008

ద్వాదశోధ్యాయము

శౌనకాదులు, సూతునిచే సరస్వతీదేవి పూర్వ కథా వృత్తాంతమును వినగోరగా వారికి సూతుడిట్లు తెల్పిరి.

సరస్వతి గంగాదేవితో, మాతా! పూర్వము పితామహడు బ్రహ్మ, విద్యారూపియగు పరాశక్తిని మనస్సున తలంచి పదివేల సంవత్సరములు తపమాచరింపగా, పరాశక్తి సుందర రూపముతో కన్యగా అవతరించినది. ఆమెయే నేను. నా సౌందర్యమునకు విచలితుడయిన బ్రహ్మ మనమున కామావేశము గల్గి నన్ను పట్టుకొని రమించగోరెను. మాయోమోహమున బ్రహ్మ పరాశక్తిగా నన్ను గుర్తించలేకపోయెను. కన్యగానున్న నేను బ్రహ్మతో నీ తపోబలమున రూపదాల్చిన నేను ధర్మపరముగా నీ పుత్రికను. అట్టి నాపై నీకు మోహము తగదని నివారించిననూ బ్రహ్మ వినకపోవుటతో, బ్రహ్మయొక్క బలాత్కారమును తప్పించుకొనుటకు నేను లేడి రూపము దాల్చి పారిపోజూచితిని. కాని బ్రహ్మ కూడ మగలేడి రూపమున నన్ను వెంబడించెను.


పరాశక్తి నవ్వుచూ శంకరునితో స్వామీ బ్రహ్మ స్థతి చూడుడు, నన్ను పదివేల సంవత్సరములు ప్రార్థించగా నేను కన్య రూపమున దర్శనమిచ్చితిని. కానీ మీ మాయోవశుడమున బ్రహ్మ నా సౌందర్యమునకు విచలుడై ఇట్లు ప్రవర్తించుచున్నాడు. కనుకమీరు బ్రహ్మకు తగిన శిక్షనొసగుడు. తరువాత ఆ కన్యనతనికి ప్రసాదింపుడు. మనసా రమించిన స్త్రీ ఆ పురుషునిదే యగును. లేనిచో ధర్మ విరుద్ధమగును. బ్రహ్మ ఏందరనో స్త్రీ పురుషులను సృష్ఠి చేయుచున్నాడు. ఒకరిచేతనే సృష్ఠించబడుట వలన ధర్మముగ వారు సోదరీసోదరును. కాని మీ మాయా ప్రభావమున ఒకరిపై ఒకరు మనసుపడినవారు సతీ, పతులగుదురు.

పరాశక్తి భావము గ్రహించిన శివుడు వెంటనే కిరాతరూపము దాల్చి విల్లున బాణము సంధించి మగలేడి రూపమునున్న బ్రహ్మను వెంబడింటచెను. ఇది గమనించిన బ్రహ్మ, కిరాతరూపమునున్న శివుని గర్తించి లజ్జితిడై తలదించుకొని నిల్చుండిపోయెను. శివుడు కోపించి, బ్రహ్మా! నీవు ధర్మమును తప్పితివి. స్త్రీని బలాత్కరించి రమించుట దోషము. ఏకోదరి సోదరి, అన్న భార్య, తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, కోడలు, గురుపత్ని, తన కుమార్తె, మితృని భార్య, వీరు గౌరవింపబడువారు. రతికి వర్జితులు. పూర్వము నీవు చేసిన తప్పునకు ఒక శిరము కోల్పోతివి. ఇపుడు మిగిలిన నాల్గుశిరములను ఈ బాణముతో తృంచివేతునని బాణమును లాగి వదలబోవగా, పార్వతీదేవి శివును ప్రార్థించి బ్రహ్మదేవుని క్షమింపవేడెను. బ్రహ్మ విచార వదనముతో శంకరుని చరణములపై వ్రాలి రక్షింప వేడెను.

అర్ధనారీశ్వరముగా, శివ శక్త్యాత్మకమైన నేను మీలో లీనమైతిని. బ్రహ్మ ప్రార్థనపై కన్యగా అవతరించిన తన రూపమైన నన్ను పార్వతి ప్రశ్నించి పుత్రీ! నాగ్రూపముగా నీలోనున్న నేను నాశక్తిని ఉపసంహరించుకొంటిని. బ్రహ్మ మూడువేదములను అవగతము చేసికొనుటకు 10 వేల సంవత్కరములు తపము చేసిన పుణ్యాత్ముడు. అతని నాల్కపై విద్యారూపమున నేనుందును. ఇపుడు నిన్ను మా పుత్రికగా స్వీగరించినందున నీవు బ్రహ్మను వరించుట ధర్మవిరుద్ధముకాదు. శంకరా! మీరు భక్త సులభులు, బ్రహ్మమీ భక్తుడు గాన మన్నించి అతను కోరిన కన్యను మన పుత్రిగా బ్రహ్మ కొసంగుదుము అనగా, శివుడు ప్రసన్నుడై బ్రహ్మా ఈమెను మా పుత్రికగా నీ కొసంగుచున్నందున ధర్మలోపముగాదు. దేవతలలో ఇది సమంజసమే. భూదేవి, లక్ష్మి ఇద్దరునూ విష్ణువు భార్యలే. భూమినుండి వెలువడిన జానకిని రాముడుగా అవతరించిన విష్ణుమూర్తి పరిణయమాడెనుగదా! కౌసల్య పుతృనిగా జానకిని చేపట్టి ధర్మలోపముగాకుండ జేసెను. కశ్యపుడు, దక్షుడు, పులోముడు, అత్రి, అంగారసుడు, వారందరు నూ ఔరస పుత్రులేగదా! పినతండ్రి కుమార్తెలగు శచీదేవి, అశ్వని ఆదిగాగల తారలను గ్రహించిరి. నా ఆజ్ఞననుసరించి కుక్షిభేదము వలన వీనిలో ధర్మలోపము కలుగ లేదు. కనుక ఈ కన్యను గ్రహించమని ఆదేశింపగా నేను శాస్త్ర విధిగా బ్రహ్మను వివాహమాడితిని. వేదవిద్యగా నన్ను బ్రహ్మ జిహ్వాగ్రమున నిల్పుకొని ఆదరించెను. శంకరుడు నాతో, సరస్వతీ మొదట బ్రహ్మ నిన్ను వెంబడించి ధర్మ విరుద్ధమగు దోషి అయ్యెను. భార్యలు భర్తల దోషములను నివారింపవలెను. స్త్రీలకు భర్తలే ప్రత్యక్ష దేవతలు. కనుక నీవు బ్రహ్మ అపచారమును తుడిచివేయుటకు భూమిపై నదీరూపమున ప్రవహించి మహనీయుల స్నానస్పర్శవలన నీవును, నీలో స్నానమాడినందున పాపులును పవిత్రులగుదురు.

భూమిపై ఆర్యావర్తిము, అందు కురుక్షేత్రము పవిత్రభూములు. అక్కడ నీతీరమున యజ్ఞములు, తపస్సు చేసినవారు నీలో స్నానము, ఆచమనముల వలన నీవు పాప పరిహారము జేయుదువు. నా ప్రియపత్ని ఆకాశ గంగ పృధ్విపైనున్నది. నీవు ఆమెను కలిసి పూజించి నీ పతియొక్క మంచి కొరకు ఒక అంశమున నదిగా ప్రవహించుము. నీ సవతులు గాయత్రి, సావిత్రులు కూడా ఒక అంశతో నదులై ప్రవహింతురు. అని అంతర్ధానము చెందగా నేను కురక్షేత్రములో నదిగా అవతరించి నీకొరకు నీరీక్షించుచుంటిని. నీవు ఇక్కడ నాపతి, ప్రజాపతి క్షేత్రమునకు వచ్చినది తెలిసికొని ఒక అంశను కురక్షేత్రమున వదలి భూమియందు అంతర్థానమై ఇక్కడ వెలిసితిని. నా పతి అనేక మార్లు ఇక్కడ దశ సహస్ర అశ్వమేధయాగములు సల్పిరి. నీవిక్కడకు వచ్చి ప్రవహించుచు ఆయజ్ఞ సాఫల్యతనిచ్చితివి. ఇక్కడనుండి నీతే జేరి ప్రవహించుచు సముద్రమును చేరుదము. విష్ణుప్రియ కాళింది కూడ ఇక్కడ నీతో చేరినది అనెను.

అపుడు గంగ, హే బ్రహ్మప్రియే! కురుక్షేత్రములో బ్రాహ్మణులు యజ్ఞ, తపోధనులు, వారి మహిమ గొప్పదని వింటిననగా, సరస్వతి, హే గంగే బ్రాహ్మణుల మహిమ వినుడు. వింధ్య, హిమవత్పర్వతముల మధ్య భూమి ఆర్యావర్తము. అందు కురుక్షేత్రము విశేష్ము. సూర్యుని పుత్రి యమున, విష్ణుమూర్తిని తన భర్తగా పొందుటకు కురుక్షేత్రమున ఘోర తపమాచరించి శరీరము సుష్కించి అస్తి పంజరము మిగిలినది. అది చూచి అచటి బ్రాహ్మణులు ఆశ్చర్యపడిరి. జనులు తండోపతండములుగా వచ్చి చూడనారంభించిరి. యమున తపమునకు సంతసించి విష్ణుభగవానుడు ప్రత్యక్షమై హేపావనీ! నీతపమునకు మెచ్చి నిన్ను భార్యగా స్వీకరించి నీకు నా హృదయ స్థానమిత్తును. ఇంకను వరము కోరుమనగా యమున ఇక్కడ నాకు రక్షణ నిచ్చిన బ్రాహ్మణోత్తములకు ఉత్తమ గతి కల్గించుడమి కోరెను. విష్ణుమూర్తి, యమునా నీవు కన్యగా ఇక్కడ తపమాచరించి సుష్కించి కుబ్జగా మారిన ఈ ప్రదేశము "కన్యాకుబ్జ" మను పేరు తపో భూమిగా ఖ్యాతి చెందును. నీకు తూర్పున గంగ యున్నది. నీకును గంగకును మధ్యనున్న భూమి వేదభూమిగా ప్రసిద్ధిచెంది అందు చేయు తపో యజ్ఞములు అత్యంత ఫలదాయకములగును. నీవు గంగతో కలిసి తీరవాసులను పావనులను జేయుడు అని తెల్పెను. ఇక్కడ చేయు యజ్ఞ హవిస్సులు గొన్న దేవతలు సద్యః ఫలితమిత్తులు. దుర్లభమైన మానవ జన్మనెత్తియు మనో, వాక్కులు పాపాచరణకు లాగగా, అతి ప్రయత్నముచే నిరోధించి తపోయజ్ఞములచే నా తీరభూమియందు నాల్గు వర్ణములవారునూ పాప రహితులై అభీష్ట సిద్ధులగుచుండిరి.

ఇట్లు సరస్వతీదేవి గంగకు వివరించిన పుణ్యకథను విన్నవారు ఈశ్వ కటాక్షమున ముక్తులై కైలాసవాసులగుదురు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Sunday, December 28, 2008

దశమాధ్యాయము

శౌనకాదులు సూత మహర్షిని, వ్యాస శిష్యుడవగు తత్వజ్ఞాన నిధివగు మహాత్మా పరమేశ్వరుడు సంతసించి వరములొసగిన అట్టి పుష్పదంత స్తుతిని వినిపింపుడనిరి. సూతుడు ఆ స్తుతి సారమిట్లు చెప్పదొడగెను.

హే పరమేశ్వరా! అనంతమగు నీ మహిమను తెలియనివారు చేయు నీస్తుతి అయోగ్యమయినచో బ్రహ్మాదులు చేయు స్తుతియు అనర్హమే యగును. ఎందుకనగా నీ మహిమ అగమ్యము. నీ స్తుతి ఎవరు చేసిననూ వారి బుద్ధి కందినంత మాత్రమే చేయగలరు. నేనును అట్టి వాడనే కదా! శబ్ద వేగమనోవేగములకందని గుహ్యంతమము నీ మహిమ. వేదములే నేతి, నేతి యని గర్హించి నిశ్చయించలేకపోయినవి. అట్టి నీ స్తుతిని నాకు తెలిసనంతలో చేసినాగాత్రము శుద్ధి పరచుకొనుచుంటిని.

సత్వరజస్తమో గుణములకు సృష్టి, స్థితి, లయములకు నియమింపబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతింపబడిన నీ ఐశ్వర్యము వేదప్రతిపాదితము. వేదత్రయమార్గము, కాపిల మార్గము, వాశిష్ఠాది యోగ శాస్త్రమార్గము, పాంచరాత్రాది వైష్ణవ సిద్ధాంతమార్గములని భిన్న మార్గములన్నియూ నదీ జలములకు సముద్రము గమ్యమైనట్లు నిన్ను బొందునవే యగును. అగ్ని స్ంభము వంటి నీ తేజో రూపమయిన మహిమను ఆద్యంతమును తెలిసి కొనుటకు బ్రహ్మ ఊర్ధ్వముగను, విష్ణువు అధో ముఖముగను వెళ్లి సాధ్య పడక తిరిగి వచ్చి నిన్ను ప్రార్ధించి తెలిసిగొనగల్గిరి. బాణాసురుడు నీయనుగ్రహమువలన ముల్లోకములను ఆక్రమించి ఇంద్రుని జయించెను, కాని రావణాసురుడు నీసేవచే భుజబలమును సంపాదించియు నీ నివాసమైన కైలాసమును పెకలింపబూని పరాభవింపబడి పాతాళమునకు చేరెను గాన నీసేవయందు వినమ్రుడైనవాడు సర్వోన్నతిని బొందును. క్షీరసాగరమధనమున హాలాహలముద్భవింపగా ఆర్తజనరక్షణకు నీవు దానిని గ్రహింప, నీ కంఠము నీలమయిననూ అదియూ శోభాయమానమయినది. తిరుగులేని మన్మధబాణములు నిన్ను సోకి, అతని ఆహుతికి కారణమయినవి. నీ మహిమను ఏదియూ తిరస్కరింపజాలదు. సంధ్యాసమయమున లోకములను బాధింప బూనిన రాక్షస సంహారమునకై నీవు నాట్యము చేయు సమయమున, పాదతాడమనుచే భూమియు, బాహు సంచాలనమున ఆకాశము, జడల తాకిడికి స్వర్గమును కంపించుచున్నవి. తృణ సమానమగు త్రిపురములను దహింపగోరిన నీకు భూమి రథముగాను, బ్రహ్మ సారధిగాను, మేరువు ధనుస్సుగాను, సూర్య చంద్రులు రథ చక్రములుగాను, విష్ణువు బాణముగాను నేర్పడిరి. ఇవి నీ కవసరము లేకున్ననూ వారి సేవనీకు తోడ్పడినది. విష్ణుమూర్తి నీ పాదపూజకు సహస్రకమలములు తేగా వాని భక్తి పరీక్షింపగోరి నీవు ఒక పద్మమును తిరోహితము జేయ విష్ణువు తన నేత్రమునే పద్మముగ సమర్పింప నీవు అతని భక్తికి మెచ్చి సుదర్శన చక్రము నొసగితివి. యాగ క్రియ యందు ఆహుతులు భస్మమయినను దీక్షితులు నానిని నీకు సమర్పించిన కారణమున ఫలమును బొందుచున్నారు. కాని దక్ష ప్రజాపతి తన యాగమునకు నిన్ను ఆహ్వానిచని కారణమున శిరమును గోల్పోయెను.

బ్రాహ్మ తాను సృజించిన సంధ్యయనెడి స్త్రీ సౌందర్యమును మోహించి వెంబడించగా, నామె సిగ్గుతో లేడి రూపము బొందెను. బ్రహ్మ మగలేడి రూపము దాల్చి వెంబడించగా నీవు కోపించి పినాకమున బాణము సంధించి విడువగా, బ్రహ్మ సిగ్గుపడి మృగశిరా నక్షత్రరూపము దాల్చెను. అంత నీ బాణము ఆర్ద్రా నక్షత్రముగా వెన్నంటియే యున్నది.

మదనాంతకా! నీవు శ్మశానవాసివయి పిశాచ సహచరముతో చితాభస్మము పూసుకొని కపాలమాల ధరించి, అమంగళ ద్రవ్యములతోనున్ననూ, భక్తులకు మంగళ ప్రదాతము. నిన్ను సూర్య చంద్రులుగను, పంచ భూతములుగను, అ కార ఉ కార మ కారములుగను, వేద త్రయముగను, అవస్థా త్రయముగను, త్రిలోకములు, త్రిమూర్తులుగను భావించుచున్నారు. ఈ స్తవరాజ పఠన శ్రవణములు సర్వ కామ్యార్ధ ఫలదాయకములు.

నవమాధ్యాయము

గౌరీదేవి 12 సంవత్సరముల తపస్సును నిత్య హరంపాప తీర్థస్నాన, కేదారేశ్వర పూజలతో పూర్తిచేసిన సోవమారయుక్త శ్రావణ పూర్ణిమ పుణ్య దినమున పరమేశ్వరుడు ప్రీతి చేంది కేదార లింగము నుండి ప్రత్యక్షమై పార్వతిని వరము కోరనమగా, దైవి స్వామీ మానవులు కలియుగము మూఢులై కోట్ల కొలది బ్రాహ్మహత్యాపాతకములు, కోట్ల కొలది అగమ్యాగమన పాతకములు చేయుదురు. వారికి తరుణోపాయము కోరుచున్నానని వేడగా స్వామీ ప్రీతితో, కాశిలోగాని, వెలుపల గాని మానవులాచరించు ఎట్టి పాపములయినను మణిక్రణిక స్నానము, విశ్వేశ్వరాది లింగదర్శన పూజనలవలన నశించును కాని, నా స్వరూపమయిన కాశీతీర్థ, క్షేత్ర, లింగముల నింద, అపరాధములు కేవలము ప్రాచీన మణికర్ణిక/హరంపాప తీర్థము/ రేతోదక తీర్థము ముఖ్యముగా నీచే నిత్యము 12 వర్శములు స్నాన పుణ్యమబ్బినందున నీపేర గౌరీకుండమను తీర్థ స్నాన కేదార లింగ దర్శన పూజనల వలన మాత్రమే ఉపశమించునట్లు వరమొసంగెను. స్వామి ఆలింగమున అంతర్థాన మయిన వెంటనే గౌరీదైవి కూడ స్వామి వారితో కైలాసము చేరెను.

ఇక నౌగమేయుడు గౌరీదేవి శాపమున మనుష్యయోనిలో బ్రాహ్మడుగా జన్మించి క్షేమకవి నామముతో పూర్వ జన్మ స్మృతిగల్గి తాను శంకరుని ద్వార వినిన నూరు కథలను బృహత్కథామంజరి నామముతో గ్రంథమును రచించి, తనపేర క్షేమేశ్వర నానముతో కాశీలోని కేదారునికి ఉత్తరమున లింగ ప్రతిష్ఠచేసి నిత్యమూ పరమేశ్వరుని ఆ లింగమున సేవించుచు, వ్యాసుని పురాణములు, స్మృతులు, శాస్త్రములను అవహేళన చేయుచు వ్యాసుని నిందించగా, వ్యాసుడు చింతా క్రాంతుడై కృంగుచుండెను.

కాశీ హరంపాపతీర్థమున నిత్య స్నానము, కేదార పూజలతో 12 సంవత్సరముల శివసేవకు సంతసించిన పరమేశ్వరుడు క్షేమేశ్వర లింగమునుండి కోటి సూర్వ ప్రభలతో, కోటి చంద్రుల చల్లదనముతో ప్రత్యక్షమై నేటినుండి 9వ రోజున శ్రావణ పంచము సోమవార పరవడి తిథియందు నీవు మరల మాలోకము చేరుదువు. ఈలోగా మణికర్ణికకు వెళ్ళి స్నానము చేసి అక్కడనే యున్న తెల్లని వ్యాస విగ్రహమును అవమానించి వ్యాసునితో సహా ఆనాడు కేదారనాధుని ముందుగల తీర్థస్నానము, కేదార అర్చనము చేయుమని ఆనతిచ్చెను.

క్షేమకవి స్వామి ఆజ్ఞనిర్వర్తించుటకు వెళ్ళి ణమికర్ణికా స్నానము చేసి వ్యాసవిగ్రహము చూచి ఎవరీ లంబోదరుడు, చక్రాకారముగ పెద్ద గర్భము ధరించి యున్నాడని నిందించ వ్రెలితో పొట్టను పొడవగా అందుండి వ్యాసుడు ఉద్భవించి క్షేమకవి చేతిని గట్టిగా పట్టుకొని, చకార కుక్షి యని నన్ను నిందించి నాపొట్టలో ప్రేలు గుచ్చిన నీ గొప్పతనాన్ని పరీక్షించదలచినాను, నీ కవిత్వ పటిమతో అనుష్టప్ ఛందస్సులో 32 అక్షరములతో నేను చెప్పు కథను ఒక శ్లోకములో చెప్పమని కథను ఇట్లు చెప్పెను.

ఒకరాజుగారి మహలు జీర్ణించి దానిలో ఒక గోడ కూలినది. దాని క్రింద ఉన్న ఒక కుక్క చనిపోయి అదే సమయమున రాజుగారికి కొడుకు పుట్టినాడు. అతని పేరు కూష్మాండఖండము. దీనిని 32 అక్షరములతో "చ"కారము ఉపయోగించక శ్లోకము చెప్పినచో నీవు గొప్ప కవివని అంగీకరింతుననెను. దానికి క్షేమకవి నవ్వి

రాజద్వారీ గలద్వారీ పతద్భిత్తౌ మృతేసుని,
రాజపుత్రస్య పుత్రో ऽ భూ నామ్నా కూష్మాండ ఖండకః

యని చెప్పి మహాత్మా మీరు చెప్పిన దానికి ఒక క కారము ఎక్కువ కలిపి కూడా అనుష్టుప్ ఛందస్సుకు ఒక అక్షరము తక్కువగానే పూర్తిచేసితిననెను. అపుడు వ్యాసుడు పూర్వ స్మృతి గల్గి నిన్ను శివగణాధ్యక్షుడు నౌగమేయునిగా గుర్తించితిని, శివానుగ్రహమున గొప్ప కవివని అంగీకరించితిని, నేను కూడా గౌరీదేవి శాపమున బ్రాహ్మణ జన్మనెత్తిన విష్ణుమూర్తిని, నన్ను అవమానించుటతో నీ శాపము తీరినది, కాని శివాజ్ఞచే నేను ఈ మన్వంతరమంతయూ గడిచినంతవరకూ కాశీకావల యుండవలయును అని చెప్పి ఇద్దరును గౌరీ కుండ స్నానము, కేదారేశ్వర దర్శనమునకు బయలుదేరిరి.

ఆనాడు సోమవార యుక్త శ్రావణ పౌర్ణమి. ఇద్దరును ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి కేదారేశ్వరుని పూజించి ప్రదోషకాల పూజవరకు ఏకాంతమనస్కులై ధ్యాననిమగ్నులైరి. పరమాత్మ ప్రసన్నుడై కోటి సూర్యకాంతి, కోటి చంద్రుల చల్లదనముతో నంది, భృంగి గణములతోడను, గణపతి, కుమారస్వాములు ఎలుక, నెమలి వాహనములపై ప్రక్కన నిలువగా వంగిమాగధుల విజయ ఘోషల మధ్య గౌరీసమేతుడై లింగమునుండి ఉద్భవించెను. అమృతమయ వాక్కులతో క్షేమకవి, వ్యాసమహర్షులను ప్రేమతో మీ ఈప్సితార్థములను కోరుడని ఆజ్ఞాపించెను. వారిద్దరునూ అశ్రువూరిత నయనములతో అవాక్కయి ఇట్టి మహాదర్శన భాగ్యమబ్బిన తర్వాత మాకింకేమి కావలయును, మమ్ములను ముక్తులను చేయుడనిరి. స్వామి కరుణించి క్షేమకవి మాత్రమే యిపుడు ముక్తుడగును కాని వ్యాసుడు ఈ మన్వంతరమంతయూ వేద, శాస్త్ర, పూరాణ, ఇతిహాసములు రచించి లోకోద్ధరణ తర్వాత ముక్తుడగునని చెప్పగా, వ్యాస మహర్షి స్వామీ క్షేమకవి వ్రాసిన బృహత్కథామంజరిలో క్రితం నూరు కల్పముల రహస్యములు మీచే అమ్మవారికి చెప్పబడిన కథలు విన్నవారు వెంటనే ముక్తులగుదురు, మిమ్ముచేరుదురు కనుక యిక నేను ఈ కల్పాంతము వరకు ఇక్కడనే ఉండి లోకోద్ధరణ కొఱకు వ్రాయవలసిన దేమున్నదని తెల్పగా పరమాత్మ ఆశ్చర్యముతో క్షేమకవి వ్రాసిన అట్టి ప్రశంశా పూర్వక గ్రంథమును వినగోరెను. వ్యాసులు, క్షేమకవి ద్వారానే వినుడని వేడగా స్వామి అతనినే వినిపింపమనెను. అపుడు దేనిని వినినంత మాత్రమున ముక్తులయ్యెదరో, ఏ రహస్యము లేశమాత్రము చెవిన పడిననూ శివధామము ప్రాప్తమగునో, సద్గురు మంత్రోపదేశము వలె ఏది పాశుపత జ్ఞానమొసగునో, వేదశాస్త్ర, పురాణ, ఇతిహాస, తంత్ర, స్మృతి, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, జ్యోతిష, శబ్ద, తర్క, మీమాంస, యోగములను, నూరు కల్పముల దేవతీర్థ, క్షేత్ర, లింగ మహాత్మ్యముల సమ్మిళిత సర్వస్వమును లక్షశ్లోకములలో వినిపించెను.

సుకుమార పుష్ప వృష్ఠి వలె సాగిన కవితా మాధుర్యమును, తత్కాల మూక్తి ప్రద రహస్య సారమును ఆనందపూర్వకముగా విన్న శివుడు క్షేమకవికి, పుష్ప దంతుడు, పుష్వ జీహ్వుడు, పుష్పాశ్యుడు అను నామముల నొసగి, ఇంతటి మహత్వ పూర్ణ విషయములను ఇపుడు వినిపించుట అనుచితము, నాచే కల్పింపబడిన లోకవ్యవహారము భంగమగును, సృష్టి, స్థితి, లయములకు తావుండదు గనుక వెంటనే దీనిని నష్టపరుచుము అని చెప్పి, నీటిలో ఆ గ్రంథమును వేయింటి లయము చేసెను. నేటినుండి నీ నామము నౌగమేయుడు కాదు, పుష్పదంతునిగా శివగణ నాయకుడవు కమ్మని దీవెంచెను. వ్యాసునితో స్వామి, నీవు వ్రాయు పురాణములే వేదవాక్కులుగా శిరోధాల్యములగనును, ప్రమాణములగును గాన నీరచనలు సాగించమని చెప్పు సమయమున కైలాసము నుండి దివ్య విమానము వచ్చి వాలినది. నౌగమేయుడు మానవరూపము వదలి దివ్య దేహధారియై, వీభూది, రుద్రాక్షలతో, త్రిశూల, త్రినేత్ర ధారియై శివాంశను బొంది రుద్ర సారూప్యముక్తుడై శివపార్వతులను స్తుతించెను. ఆ స్తుతిని నిత్య పారాయణ చేయువారి యిష్ట కామ్యములు నెఱవేరి అంతమున శివపద ప్రాప్తి కల్గునట్లు శివుడు వరమొసగెను. వెంటనే ఆ విమానమెక్కి పుష్పదంతుడు కైలాసమేగెను. గౌరీ కేదారేశ్వరుడు ఎట్లు లింగమునుండి ఉద్భవించెనో అటులనే గణసహితముగ లింగమున అంతర్థానము చెందెను. గౌరీదేవి, నౌగమేయుల శివాపరాధమును నిర్మూలించిన గౌరీ కుండ మహాత్మ్యమును తెల్పు ఈ కథ విన్న వారు కాశీ క్షేత్రమును దర్శించిన ఫలము పొంది ముక్తులగుదురు.

Sunday, December 14, 2008

సప్తమాధ్యాయము

బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారు నియోగింపబడిన కార్య నిర్వహణకు వెళ్లిన తరువాతి పార్వతి, లక్ష్మి, సరస్వతులు వినోదముగా విహరించుటకు మంధర పర్వతమున కేగిరి. వారు ఆనందముగా విహరించుచు సంభాషించుకొను సమయమున లక్ష్మీదేవి పార్వతిని వేళాకోళముచేయుచు, తాను తన భర్త సర్వజ్ఞులమనయూ కనుకనే విష్ణువుకు పాలనా బాధ్యత నొసంగబడినదనియూ, మహా కైలాసమందు విష్ణుమూర్తికి సాదర సత్కారములు లభించిన వనియును, విష్ణుమూర్తియే బ్రహ్మ, రుద్రులకు కూడ అట్టి సత్కారములు లభింపజేసి నారనియూ, కనుక తాను, విష్ణుమూర్తి గొప్ప వారమని డాంబికముగా పల్కుగా, గౌరీదైవి కినుక వహించి, మన భర్తలు రాగోనే వారికీ విషయము తెల్పి వారి చేతనే ఎపరు గొప్పవారో చెప్పించెదనని, సర స్వతి సాక్షిగా యిది వారి పంతమనియూ పల్కి వారి పురములకు చేరిరి. లక్ష్మీదేవి విష్ణుమూర్తికీ విషయము తెల్పిన వెంటనే ఆయన కోపించి, రుద్రుడే సర్వజ్ఞుడనియూ లక్ష్మీదేవి పార్వతిని అవమానించుట తప్పిదమనియూ తెల్పి, తన భార్య పంతము నెగ్గుటకొక ఉపాయము తెల్పుదునని లక్ష్మితో ఇట్లు తెల్పెను. శివగణములలో శ్రేష్టుడగు నౌగమేయుడు శివునకు అంతరంగ భక్తుడు. శివ పార్వతుల ఏకాంతములో ఏమి సంభాషణ జరుగునో అతి అంతయూ నీకు చెప్పమని నౌగమేయుని ప్రార్థించి అతనిని ఒప్పించి, అట్లు విషయములను తెలిసి కొన్న నీవు పార్వతి ఏవిషయము చెప్పిననూ అది నీకు ముందగనే తెలిసినట్లు చెప్పుచూ కొంతకాలము నీమాట నెగ్గించు కొనవచ్చును. పార్వతి కోపించి ఏమి చేయునో, తదువరి ఏమగునో వేచి చూడమని లక్ష్మితో విష్ణుమూర్తి తెల్పెను.

రుద్రుడు పార్వతితో మహాకైలాసముందు జరిగిన వృత్తాంతమంతయూ తెల్పుచూ మాయా మోహితులయిన బ్రహ్మ, విష్ణువులు తన మాట లెక్కచేయక మహా కైలాసమేగి శంకరుని వద్ద భంగపడిన విషయము చెప్పి, నా మాటను ఎవరూనూ ఉల్లంఘింపరాదు. నావలననే వారిద్దరికినీ మరల పదవులు దొరికినవని విన్న పార్వతీదేవి నవ్వుచూ తనకు లక్ష్మికి జరిగిన సంభాషణ, వారి పంతములు రుద్రునకు తెల్పి, మరెవ్వరికినీ తెలియని
అత్యంత గుప్త మగు కథలు తనకు వినిపింపమని భర్తను కోరెను. శివుడు పూర్వ కల్పమందలి ఒక కథను మరేదేవతకును తెలియని దానిని పార్వతికి వినిపించెను. లక్ష్మి, పార్వతులు మరల విహారమునకు వారి చెలికత్తెలతో మేరు పర్వతమునకు వెళ్లినపుడు పార్వతి లక్ష్మి తో తమ పంతములను జ్ఞాపకము చేసి, మధ్యవర్తి సరస్వతిలేని కారణమున తమ చెలికత్తెలను పంపి సరస్వతిని రప్పించిరి. అపుడు పార్వతి, లక్ష్మితో శివుని మించిన పరమార్థమువేరు లేదనియు, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు శివుని ద్వారానే ఉత్పన్నమయిరనియూ కనుక లౌకిక రీతిగా మనము బంధువులమనియు, సరస్వతి నాకు వదినగారు, నీకు అత్తగారి వరసలనియు (రుద్రయామళము ననుసరించి సరస్వతినుండి విష్ణువు, పార్వతులు ఉద్భవించిరి. విష్ణు నీభి కమలమునుండి బ్రహ్మ ఉద్భవించుటచే పార్వతికి అన్నగారి భార్య సరస్వతి. విష్ణు కుమారుని భార్య యగుటచే సరస్వతి లక్ష్మికి అత్తగారు.) కనుక సరస్వతి మన ఇద్దరికిని న్యాయముగా మంచి చెప్పునని వినిన లక్ష్మి వెంటనే అంగీకరించి పార్వతి చెప్పిన రహస్య కథను నౌగమేయుని ద్వారా విని యున్నందున, పార్వతి ఆరంభించిన వెంటనే మిగిలిన వృత్తాంతమంతయు లక్ష్మి చెప్పసాగెను. ఉమ ఆశ్చర్యముతో లక్ష్మికి ఈ కథ ఎట్లు తెలిసియుండును. సరే ఈనాటికి వదలివేసి రేపు మరొక విశేష కథను వినిపించెదనని నిశ్చయించి ఇండ్లకు చేరిరి.

మరుదినము పార్వతి శివుని వద్దనుండి చాల కల్పములవెనుక జరిగినది, మరెవ్వరికినీ తెలియని రహస్యకథను విని, దానిని లక్ష్మికి వినిపింపగా ఆకథయూ గౌరి కన్న ముందుగనే లక్ష్మి పూర్తిచేసినది. ఇట్లు వంద కథలు చెప్పిననూ గౌరీదైవి గెలువలేక పోయినది.

ఇక చేయునది లేక పార్వతి తన ఓటమినంగీకరించి ఖిన్నురాలై ఇంటికి చేరుసరికి, రుద్రుడు పార్వతి ముఖము చిన్నబోవుట గమనించి ప్రియా నీకు గల్గిన కష్టమేమి? నీమాట నెగ్గనట్లు నీకోరిక తీరనట్లు చింతా క్రాంతురాలవుగ కన్పట్టుచున్నావు. విషయము తెల్పినచో నేను నీమాట నెగ్గించెదనని తెల్పగా, పార్వతి శివుని శంకించి, మీరే సర్వజ్ఞులని భ్రమ పడినాను. కాని విష్ణువే సర్వజ్ఞుడు. లక్ష్మియే సర్వజ్ఞురాలు. కానిచో మీరు ఏకాంతములో నాకు చెప్పిన నూరు రహస్యమగు కథలు లక్ష్మికెట్లు తెలియును. మీమనసులో నున్నవి గ్రహించు నంతటి శక్తిమంతులు వారే. కనుక మీరు నన్నెట్లు నెగ్గింపజేతురని పరుషముగ మాట్లాడెను.

శివుడు అమ్మవారు సహజ స్త్రీ బుద్ధి ప్రకటించుచున్నదని గ్రహించి ఆమెకెట్లు అవమానము జరిగియుండునని దివ్యదృష్టితో దర్శించి, నౌగమేయుని దుశ్చర్య గ్రహించి, ఆనాటి రాత్రి నౌగమేయుని వేరు పనిపై దూరముగా పంపించి, గౌరిని శాంతపరచి రేపు నీజయము నిశ్చయమని నచ్చచెప్పి, ఊరడించి, ఒక రహస్య కథను వినిపించి మరురోజు లక్ష్మి, సరస్వతులతో మేరు పర్వతమునకు పంపెను. ఆ దినము పార్వతి ఆరంభించిన కథ లక్ష్మికి తెలియక పోగా రేపు చెప్పెదనని బింకములు పలికెను. ఇదే విధముగా నౌగమేయుని దూరముగా పంపి ఆ మరుదినము శివుడు పార్వతికి 108 కథలు చెప్పి పంపెను. గౌరీదేవి సరస్వతిని సాక్షిగా పెట్టుకొని చెప్పిన ఆ 108 కథలలో ఒక్కటియూ లక్ష్మికి తెలియనందున, లక్ష్మి తన తప్పును ఒప్పుకొని, శివుడే సర్వజ్ఞుడనియు, విధాత బ్రహ్మ, విష్ణువుల కన్న అధికుడనియూ తాను ఓడి, పార్వతి గెల్పు ఖాయమనియు తానే ఒప్పుకొనెను.

అపుడు పార్వతి చింతించి, వేదనిరూపణముగ ఉపనిషత్తులచే కొనియాడ బడిన పరమాత్మ, ఆది మధ్యాంత రహితుడు, సర్వం సహాద్రష్ట తన పతియేనని గ్రహించి, లక్ష్మితో మొదటి నూరు కథలు నీవెట్లు చెప్ప గల్గితివి, తరువాత ఎట్లు చెప్పలేకపోతివనియు, నిజము చెప్పనిచో తన పరాశక్తి అంశతో శిక్షింతుననియు, దీని వలన మన ముగ్గురితో భేద భావము పొడసూపుట తప్పదనియు పల్కెను. లక్ష్మి భయముచే తాని నిజము చెప్పలేననియూ, తనను శిక్షించి మనలోని సామరస్యమును త్రుంచవద్దనియు వేడుకొనెను. అపుడు గౌరి శాంతించి తన భర్త ద్వారానే విషయము తెలిసికొన నిశ్చయించి వారు వారి పురములకు చేరిరి. ఈ పుణ్య కథను తెలిసి కొనిన వారు భక్తిపూర్వకముగ శివ పార్వతులను సేవించి ముక్తులగుదురు.