Wednesday, March 25, 2009

19 వ అధ్యాయము

వ్యాస శిష్యాగ్రగణ్యా, సూతపౌరాణికా! కేదారేశ్వరుడు ప్రధమ పద్మ కల్పమందు కాశీకి వచ్చినట్లు, విశ్వేశ్వర అనుజ్ఞచే నందీశ్వరుడు హిమాలయ కేదారమునుండి కాశీకి తీసికొని వచ్చినట్లు తెల్పితిరి. ఎకారణమున ఇట్లు సంభవించినదని మునులు ప్రశ్నింపగా మరల సూతుడు చెప్పనారంభించిరి. పరమేశ్వరుడు అవ్యయుడయ అలాజ్ఞవస గోచరుడు. నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త, శిరాశ్రయ, నిరంజన, నిర్వికల్ప, నిష్కళంకుడుగా తానొక్కడే వ్యాపించియున్న పరమాత్మ తాను సర్వవ్యాప్తముగావలెనని తలంచిలీలచే శివ శక్త్యాత్మకముగు తాని శివ శక్తులుగా విడిపోయి తాను మహాకైలాసమున అపాకృత సదాశివునిగానే యుండి శక్తిని పాంచభౌతికముగా విభజించి తాను ఈశ్వర నామముతో బ్రహ్మాండ రచన చేసి ఆనందించుటకు గాను సృష్ఠి, స్థితి, లయలు నిర్వహించుటకు తానే బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా విభజించుకొని, కాల నిర్ణయముకొరకు పద్మ, వరాహాది కల్పములుగా విభజించి ఒక్కొక్క కల్పము బ్రహ్మ ఆయుః ప్రమాణమున ఒక్క రోజుగా చేసి కల్పాంతమున మహాప్రళయము సృష్టించి లయమొనర్చి మరల సృష్టి చేయుచూ ఇట్లు లీలాకేళీ విలాసము సంకల్పించినాడు.

ఒక పద్మ కల్పమున కాశీకి విచ్చేసిన విశ్వనాథుడు, మంధర పర్వత విహారమునకు వెళ్ళి మరల వచ్చినపుడు మూడులోకములలోని తీర్థ, క్షేత్ర, ప్రతిమ, దేవమూర్తి, లింగమూర్తులలోని శక్తులన్నియూ విశ్వేశ్వర సాన్నిధ్యము కోరి వారి నిజస్థానములలో వారి షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము వదని 15 కళలతో కాశీకి చేరిరి. అట్లే కేదారేశ్వరుడు కూడ హిమాలయములనుండి విచ్చేసిరి.

అదే సమయమున హిమాలయములందు మాంధాతయను చక్రవర్తి, సార్వభొముడు, సూర్యవంశజుడు, తన తండ్రి మృతినొందకయే తండ్రి గర్భముచీల్చుకొని బయటకు వచ్చిన మహిమాన్విత శక్తి సంపన్నుడు తన 50 మంది కుమార్తెలను సౌభరియను యోగిపుంగవునకొసగి విరక్తుడై రాజ్యభారమును పుత్రులకు వదలి హిమాలయములకు వెళ్ళి 100 యుగములు తపస్సుచేసి కేదారేశ్వరుని లింగదర్శనము కోరగా ఈశ్వరుడు ఆకోశవాణి రూపమున "భక్త శిరోమణీ నీతపస్సుకు మెచ్చితిని. కాని శివాదపాధమొనరించిన బ్రహ్మకు ఇక్కడ లింగదర్శనమివ్వ ఇచ్ఛగింపక అదృశ్యమయితిని. బ్రహ్మకు శిక్ష ముగిసిన తర్వాత కాశీలో లింగదర్శన భాగ్యమిచ్చితిని. నేనిక్కడ లింగ దర్శనమివ్వనని ప్రతిన బూనిన కారణమున నీవు వెంటనే నా కాశీ నగరమునకు వెళ్లి తపమాచరింపుమని" చెప్పెను. దానికి మాంథాత "స్వామీ మీ దర్శనము లేని రోజు నాకు నిరర్ధకము కనుక నాకు మనోవేగము నిండు. ప్రది దినము గోగర్భ గంగాస్నానము, జ్యావాముఖి దర్శనము, హిమాలయ కేదారేశ్వర దర్శనము, జగత్తునందలి సంపూర్ణ దివ్యక్షేత్రముల దర్శనము మనో వేగమున క్షణకాలమునందు నిర్వర్తించి కాశీలో ఘోర తపమాచరింతును" అనగా స్వామి అనుగ్రహించిరి. అట్లు ప్రాతఃకాలమున సర్వదర్శనముల తర్వాత కాశీ మణికర్ణికా స్నాన, విశ్వేశ్వర అర్చనాదులు ముగించుకొని సంతుష్టలై తపోనిష్టులైరి. కొంతకాలము గడచిన పిదప వృద్ధుడైన మాంథాత నిత్యయాత్రచేయ నశక్తుడాయెను! అపుడు మరల కేదారేశ్వరుడు ఆకాశవాణిగా " భక్త శిఖామణీ! నీవు మయోభారమున శక్తి తగ్గినవాడవగుటచేత మధ్యాహ్న భజనానంతరము నన్ను దర్శింపరమ్ము. నాకు భక్తి ప్రధానము గాని, నియమపాలనగాదు" అని తెల్పగా మాంథాత ఆశ్చరమయముతో శివాజ్ఞ ఉల్లంఘించుటెట్లు యని తలంచి, నియమపాలన ముఖ్య ధర్మము గదా! కాశీలో ఆతిధ్యము ముఖ్య ధర్మమని, దాని మహాత్మ్యమును శివుడు విష్ణుమూర్తికి తెల్పిన విధమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.

కొందరు చోరులు కాశీ వెలుపల గ్రామములందు చాలా ధనమపహరించి రాత్రికి రాత్రి పరుగున కాశికి చేరి కేదారవనమందుగల ఒక శివాలయమున ప్రమిదలో గల మిగిలిన నేతితో వారి పైవస్త్రము చివర చించి వత్తిజేసి దీపము వెలిగించి ఆలయములోని స్వామి సన్నిధిన వస్త్రము పరిచి దొంగిలించిన సొమ్ము భాగములు చేసి పంచుకొను సమయమున భేధాభిప్రాయమున కలహించుకొని తెల్లవారకమునుపే వారి గృహములకు చేరిరి. అందు దీపము వెలిగించిన దొంగ తెలియక చేసినప్పటికి శివాలయమున నేతిదీపారాధన ఫలితమున మరు జన్మ కళింగ దేశాధిపతిగా పుట్టెను. క్రిత జన్మ రహస్యము తెలిసికొనిన ఆరాజు తన దేశమున అన్ని శివాలయములలోను దీపమాలిక నిత్యము వెలిగింపజేసి పూజింపదొడగెను. పుత్ర పౌత్రులు సర్వభోగముల ననుభవించి యజ్ఞములు, దానములు సల్పి అంతమున కాశీవాసము జేసిముక్తి బొందెను. అని విష్ణుమూర్తికి శివుడు చెప్పిన కథము సనత్కుమారుడు వామదేవునికిని, నాథశర్మ తన భార్య అనవద్యకును వినిపింపగా, అనవద్య భర్తద్వారా కాశీలో నిత్య నియమములు, వాని మహత్మ్యము, మాంథాత ఆచరించిన విధిని, తెలుసుకొనగోరగా నాథశర్మ ఇట్లు తెల్పెను. కాశీలో నిర్వహించిన కొద్ది ధర్మమయినను మేరుపర్వతమంత పుణ్య ఫలప్రదమగును. ఇందు సందేహము వలదు. బ్రాహ్మణాది చండాలురవరకు, స్త్రీ పురుష, నపుంసకువరకు, అనులోమ విలోమజాతులు, మ్లేచ్ఛ, హూణ, యవనులకయినను తెలిసి, తెలియక కొద్ది ధర్మమాచరించినను అది అమోఘ ఫలదాయకము. శివునకు ఒక్క జలబిందువు, బిల్వపత్రము, తిలమిశ్రిత తండులములు, వారి వైభవముననుసరించి పూలు, గడ్డిపరక అయినను శివార్పణమని విడిచిన వారిక అమోఘఫల మబ్బును. దశదాన, షోడశ దానములును, గంగా తటమున మెట్లు, మఠములు, జనావాసములు కట్టించినవారు స్వర్గాది శివలోకములవరకు అన్నిభోగముల ననుభవించి క్రమశః పునరావృత్తిరహిత మోక్షమును బొందుదురు. దేవతలు, మునులు, రాజన్యులు ప్రతి దినము కాశీలో ధర్మమాచరించు సదవకాశము కొఱకు నిరీక్షింతురు. ఇక శంకరుల ఆజ్ఞవినిము. కాశీలో అన్నదానమొనరించువారి విషయమున అన్నములోని మొదటి మెతుకునకు ధర్మమును, రెండవ మెతుకునకు అర్ధమును మూడు, నాల్గు మెతుకులకు కామ మోక్షములనిత్తును. ఇక మిగిలిన అన్నమునకేమి ఇవ్వవలసియుండనని ఆలోచింతుననెను. కలియుగమున చతుర్విధ ఫల పురుషార్ధముల నొసగు స్థలము కాశీతక్క వేరొండు లేదు. కాశీలో మాంథాత నిత్య వ్రతముగ ప్రాతఃకాల కేదార పూజానంతరము నిత్యయాత్ర చేసి వచ్చి మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర నిత్యయాత్ర, తర్వాత ప్రాచీన మణికర్ణికా స్నానము, భిక్షుకులకు ఆతిధ్యము నొసగి అపుడు భోజనము చేయును. నిత్య యాత్రము, మాసయాత్రము, వార్షిక యాత్రలు విధివిధానముగ జేయును. ఆకాశవాణి రూపమున భోజనము చేసి కేదారయాత్రము రమ్మని శివాజ్ఞనెట్లు ఆచరించుట ఏది కర్తవ్యము? సంశయనివారణకు కాశీలోని శివభక్తులు, వేదపండితుల వద్దకు వెళ్ళి నమస్కరించి పరిష్కారమడిగెను. వారు సంతోషించి శివాను ఆకాశవాణి రూపమున విని, నిత్యవ్రతుడైన మాంథాతను ప్రశంసించి నమస్కరించిరి.

No comments:

Post a Comment